తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దళిత కథకు అంతే ప్రశస్తమైన స్థానం ఉన్నది. అయినా దళిత సంకలనాలు తక్కువగా వచ్చాయనే చెప్పాలి. ఈ క్రమంలో రచయిత్రి అరుణ గోగులమండ, మానస ఎండ్లూరి సహ సంపాదకత్వంలో తెచ్చిన కథా సంకలనం ‘ముళ్ళ చినుకులు’. ఇద్దరూ దళిత ఆడబిడ్డలుగా దళితజాతి నేటి ఆధునిక కాలంలోనూ అంచులకు నెట్టివేయబడుతున్న వైఖరిని చూస్తూ ఆందోళన చెందుతున్నవాళ్లు. తెలుగు కథాసాహిత్యంలో దళితుల ఉనికిని ఒడిసి పట్టుకునే ఆలోచన లోంచి కురిసినవే ఈ ముళ్ళ చినుకులు.
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే ఎన్నో వాడ కథలు వచ్చాయి. కార్పొరేట్ సంస్థల్లో, అత్యాధునిక వేదికలలో దళితుల స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయాలను కథల రూపంలో పొందుపరుద్దామనుకున్నారు. ఆ స్థాయి వరకు వెళ్లిన వారిలో చాలా తక్కువమంది రచయితలుగా ఉన్నారు. ఆ స్థాయిలో లేని వారికి అక్కడి పరిస్థితులు, లోపలి రాజకీయాలు తెలియవు. దాంతో అనుకున్న కథలు రాకపోయినా మధ్య తరగతి, నిరుపేద కుటుంబాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ఆఫీసుల్లో మనకు తెలియని ఎన్నో రకాల వివక్షలు ఉన్నాయని ఈ కథలు చదివాక అర్ధమైందని అంటున్నారు అరుణ, మానసలు. ఈ కథా సంకలనం కోసం ప్రయత్నిస్తున్నపుడు ఎదురైన అనుభవాలను ఇలా పంచుకున్నారు.
‘కథలకు ఆహ్వానం ఇచ్చినప్పుడు కేవలం దళిత కథలైతే చాలని చెప్పాం. దళితేతరులను కూడా రాయమని ఆహ్వానించాం. వచ్చిన కథల్లో తెలిసిన రచయితలు తప్ప ఎవరెవరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో మాకు ఏమాత్రం తెలీదు. మా ఇద్దరి కథలతో పాటు ఇరవైమూడు కథల్లో తెలంగాణ రచయితల కథలు పదకొండు ఉన్నాయి. మొట్టమొదటి కథ రాసిన రచయితల నుంచి జూపాక సుభద్రలాంటి విఖ్యాత రచయిత్రి వరకు ఈ సంకలనంలో కథలు రాశారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో రచయిత్రి డాక్టర్ పుట్ల హేమలత వర్ధంతి సందర్భంగా ‘ముళ్ళ చినుకులు’ పుస్తకాన్ని ఆవిష్కరించాం. తెలంగాణ తొలి దశ ఉద్యమకారిణి తిరునగరి దేవకీదేవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి కేఎన్. మల్లీశ్వరి పుస్తక పరిచయం చేశారు. బెంగుళూరుకు చెందిన తెలుగమ్మా యి కీర్తన చంద్రగిరి, ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్, హైదరాబాద్కు చెందిన మెడికల్ విద్యార్ధిని ప్రేరణ ఈ పుస్తకానికి ముఖచిత్రాలు వేశారు.
దళిత సాహితీ దిగ్గజం జూపాక సుభద్ర రాసిన కథ ‘మల్లా నా ఎదాన్నే’ కథ రోడ్లు ఊడ్చే మున్సిపల్ కార్మికురాలు నీలక్క తాగుబోతు భర్తతో పడే నరకయాతనని కళ్ళకు కట్టినట్టు రాశారు. కష్టపడి పని చేసుకు బతికే నీలక్కకి తాగొచ్చి బట్టలు చించి చావగొట్టే భర్త చూపించే బాధ అంతా ఇంతా కాదు. తోటి మహిళా కార్మికులతో కలిసి భర్త మీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చి స్టేషన్లో పెట్టిస్తుంది. ఒక్క రాత్రైనా కంటి నిండా నిద్రపోదామనుకున్నా అది జరగదు. ఒక్కసారి భర్త అంటూ వస్తే మంచోడైనా చెడ్డోడైనా వదిలించుకోలేని తనంలో స్త్రీ బానిసత్వాన్ని తెలియజేస్తుంది ఈ కథ. గంగాడి సుధీర్ రాసిన కథ ‘వివక్ష’. ఊళ్ళలో దళితులు పడుతున్న ఆర్ధిక, అస్తిత్వ, కుల వివక్షలను హృద్యంగా వివరిస్తూ రాసిన కథ ఇది. మహేష్ కొంగర తను చూసిన ఒక నిజజీవిత కథను ‘కొత్త మాదిగ’ గా అక్షరీకరించారు. ఎంత కష్టపడి కొత్త జీవితాల కోసం పాకులాడినా చుట్టూ ఉండే కులరక్కసి వేసే కాట్లు ఎంత చెప్పినా తరగనివి.
వేణు మరీదు రాసిన ‘ది టాయ్లెట్ గర్ల్’ అనే కథ కు మంచి స్పందన వస్తున్నది. ఎంతోమందికి తారసపడని ఒక చేదు విషయాన్ని ఈ కథలో రాశారు. లాటరీ పద్ధతిలో ప్రభుత్వ బడి పిల్లలతోనే స్కూల్ టాయ్లెట్ శుభ్రం చేయించే దారుణమైన సంస్కృతిని మొదలుపెడతాడు సర్పంచి. ఇరుళ అనే అమ్మాయి పేరు లాటరీలో రెండు సార్లు వస్తుంది. ఆ పాప పెద్దద యి రాజ్యాంగబద్ధంగా బతికే తీరుని, సాధించే ఘనతని ఈ కథ ముగింపు బలంగా చూపిస్తుంది. శ్రీనివాస్ సూఫీ రాసిన కథ ‘పీనిగనెత్తాల’ మా మూలుగా కనిపించే విలక్షణమైన కథ. శవాలని కాల్చడం పూడ్చటం చేసే దళితుల వ్యథ. వేరే ఏ విద్యలోకి చోటివ్వని జాతికి ఈ కులవృత్తి తల్లితో సమానమవుతుంది. కొడుకు ఈ పని చేయనని మొండికేస్తే మునిసిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఇదే పనిని అడుక్కుని చేయాల్సివస్తుందని చెప్పే దీన దళిత క్రైస్తవ తండ్రి కథ ఇది.
డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ ఈ సంకలనంలో రాసిన కథ ‘ప్రతిభ’. గీతిక పాత్ర ద్వారా స్నేహితుల్లాగే కనిపించే మన తోటివారు కులం దగ్గరికి వచ్చేసరికి ఉన్నట్టుండి రంగు మార్చే వైనాన్ని వర్ణించారు రచయిత్రి. సామాజికంగా అసమానతలకు గురవవ్వడం పై ఈ కథ ఆలోచింపజేస్తుంది. వడ్ల విశ్వనాథ్ రాసిన కథ ‘భీం’. కులం వల్ల పోయే మర్యాద నుంచి చదువు వల్లే వచ్చే ఆత్మాభిమానం వరకు ఈ కథ చర్చిస్తుంది. డా.సిద్దెంకి యాదగిరి రాసిన ‘ఆచరణ’ కథలో అంబేద్కర్ను ఆయన ఆశయాలను ఆవిష్కరించారు. ఆయ న బాటలో సాగాల్సిన అవసరం ఎంతో ఉందని గుర్తుచేస్తుంది ఈ కథ.
మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకు బ్రతికేస్తున్న ఈ సమాజంలో మార్పు రావాలి. కోరిక తీర్చుకోడానికి కులం పట్టిం పు ఏమాత్రం ఉండదు. గానీ వాళ్ళు ఎదురు పడకూడదు. ఇదేమి న్యాయమో సాటి ఆడ దే మరో ఆడదాన్ని కసురుకోవడం, హింసించటం నేటి ఆధునిక సమాజంలో నూ ఇంకా చూస్తూనే ఉన్నాం. ఎంతసేపూ కులం కుల మని కొట్టుకు చస్తూనే ఉంటాం. బానిస బతుకువీడి భావితరాలకై బతకండి బతికించండని చెప్పే కథలు ఈ ముళ్ళ చినుకులు.
‘తారలు చూపిన తార’ కథలో అంజద్ అలీ సమాజంలో సామాజికంగా అణిచివేతకు గురవుతున్న నిమ్న జాతి స్త్రీలను గురించి వివరించారు. రాజేష్ ఖ న్నా రాసిన కథ ‘కులానికి పూసిన పూలు’ ఈ కథ చదివిన వారి మనసు మరో కొత్త లోకాన్ని, కొత్త ప్రపంచాన్ని కోరుకుంటుంది. దళితులు అంటే మాల మాదిగలే కాదు. వారిలో ఎన్నో ఉపకులాలు, ఆశ్రిత జాతు ల వారు కూడా ఉన్నారని ‘నల్లపూసల తాడు’ కథలో తెలియ జేశారు డా.గడ్డం మోహనరావు.
ఏజెంట్ను నమ్ముకొని విదేశాలకు వెళ్ళిన వాళ్ళ బతుకులు వర్ణనాతీతం. ఆ బాధను దాసు ఈ కథలో ఇలా చెప్తాడు. ‘నేను ఇక్కడ ఇరవైముప్పై ఏండ్లు కష్టపడినా అప్పు తీరేటట్టు లేదనే వాక్యం అణగారిన వర్గాల జీవితాలు ఎలా ఉన్నాయో మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.‘నీ చేత్తోని బువ్వ తినక ఎన్ని దినాలాయెనే..! పిల్లలు పైలం.. మంది తెరువువోకు..నాకు.. నూకలు… బాకిలేవే..!? ఈ మాటలు చదివితే కళ్ళ వెంట నీళ్ళు జలపాతంలా వస్తాయి.
ముళ్ళ చినుకులు ఇప్పటికే ప్రముఖుల నుంచి పాఠకుల దాకా చేరి కన్నీళ్లు పెట్టించింది. మన చుట్టూ జరిగే నమ్మశక్యంకాని ఎన్నో కథలను చెప్పింది. మరిన్ని దళిత కథలు రావాలి. కొత్త తరం రాయాలి. సమానత్వం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ…
మానస ఎండ్లూరి: 91607 34990