రాజ్యాంగం ఆర్టికల్-1లో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా పేర్కొన్నది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. రాజ్యాంగబద్ధంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను పనిచేయనీయకుండా నిరోధించడంలో గవర్నర్లు తమ
అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు.
గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం జాతీయ రాజకీయ పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీకి ప్రతినిధిగా పనిచేయడం వల్లే గవర్నర్లు అపహాస్యం పాలవుతున్నారు. రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ను అనుసరించి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహణాధికారాలను చెలాయిస్తారు. ప్రభుత్వ నిర్వహణకు సహాయపడేందుకు గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులను నియమిస్తారు. కానీ గవర్నర్ పదవి ఇప్పుడు అలంకారప్రాయమైనది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తూ ప్రభుత్వాలను పడగొట్టడానికి, ఏర్పాటుచేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది.
1967 వరకు కేంద్రంతోపాటు రాష్ర్టాల్లో ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండటం వల్ల గవర్నర్ వ్యవస్థ వివాదాలకు తావులేకుండా సజావుగా సాగింది. ఆ తర్వాత అనేక రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటికి పదవిలో కొనసాగుతున్న అనేకమంది గవర్నర్లను తొలగించారు. 1980లో తిరిగి కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది గవర్నర్లను తొలగించి కొత్తవారిని నియమించారు. అప్పటినుంచి గవర్నర్ల వ్యవస్థ అప్రతిష్ఠ పాలైంది. రాజ్యాంగం లోని 356 ఆర్టికల్ ఆసరాతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుపరిచి రాష్ట్రపతి పాలన విధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
గవర్నర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు, రాజ్యాంగస్ఫూర్తిని నిలిపేందుకు రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అనేక సూచనలు చేశారు. ముఖ్యంగా 1969లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పాలనా సంస్కరణల సంఘం, 1971లో పీవీ రాజమన్నార్ సంఘం, 1971లో ఏర్పాటుచేసిన గవర్నర్ల ఉప సంఘం విలువైన సూచనలు చేశాయి, కానీ పరిస్థితి మారలేదు. జాతీయపార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థపై తీవ్రంగా స్పందిస్తాయి. కానీ అదే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక గవర్నర్ల వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి గవర్నర్లను వాడుకునే సంప్రదాయానికి ఇకనైనా స్వస్తి పలకాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే పూర్తిస్థాయి అధికారాలుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై సగటు భారతీయుడికి విశ్వాసం పెరుగుతుంది.
రాష్ర్టాల్లో గవర్నర్లను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలన్న డిమాండ్ను అమలుచేయాలి. రాష్ట్ర శాసనసభ ఆమోదించి గవర్నర్కు పంపిన బిల్లు విషయంలో ఆమోదించడం లేదా తిరస్కరించడం నిర్ణీతకాలంలో జరగాలి. అప్పుడే గవర్నర్ వ్యవస్థకు విశ్వసనీయత చేకూరుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ర్టాల హక్కుల కోసం, పన్నుల వాటా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో, గవర్నర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించి రాజ్భవన్ గౌరవాన్ని పెంపొందించే వ్యక్తులనే గవర్నర్లుగా నియమించాలని కోరుతున్నారు. రాజ్యాంగస్ఫూర్తిని గుర్తెరిగి కేంద్ర ప్రభు త్వం సమగ్రమైన సంస్కరణలు చేపట్టి, గవర్నర్ పదవిని ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఆ పదవికి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
– కర్నాటి విద్యాసాగర్, 94913 93999
(వ్యాసకర్త: టీఆర్ఎస్, మునుగోడు నియోజకవర్గం)