భారత ఉపఖండంలో ప్రాచీన చరిత్రకు చెందిన మతపరమైన పురావస్తు ఆధారాల్లో బౌద్ధానికి చెందినవే విస్తృతంగా ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ సాహిత్యంలోని మహా పరినిబ్బాన సుత్త ప్రకారం బుద్ధుడి మహా పరినిర్వాణం తర్వాత అతడి అస్థికలను ఎనిమిది స్తూపాల్లో నిక్షిప్తం చేశారు. ఆ తర్వాత అశోకుడు ఏడు స్థూపాల్లోని అస్థికలను తీసి తన రాజ్యంలోని 84,000 స్తూపాలలో పంచి విస్తృతినీ, ప్రాశస్త్యాన్నీ కల్పించాడని తెలుస్తున్నది.
బుద్ధుడి కాలంలోనే తెలంగాణ నేలకు బౌద్ధం విస్తరించింది కాబట్టి ఇక్కడ కూడా స్తూప నిర్మాణం జరిగింది. ఇప్పటివరకు పురావస్తుశాఖ రికార్డుచేసిన బౌద్ధ స్తూపాలు గోదావరి, కృష్ణా లోయలలో ఉన్నాయి. తెలంగాణలో బౌద్ధ ఆధారాలు ఇప్పటికైతే శాతవాహన కాలం నుంచే కనిపిస్తున్నాయి. శాతవాహన కాలం నుంచి, విష్ణుకుండి వంశ పాలన ఉన్నంతవరకు అంటే క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ.5వ శతాబ్దం వరకు స్తూపాలు, వాటి అవశేషాలు తవ్వకాల్లో దొరికాయి. శాతవాహనుల కథ జగిత్యాల జిల్లాలో గోదావరి ఒడ్డున ఉన్న కోటలింగాలతో మొదలైనట్టు స్పష్టంగా కాల నిర్ధారణ చేసిన తొలి స్తూపం కూడా ఇక్కడే దొరికింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని శాతవాహనకాలం నాటి బౌద్ధ ఆరాధన ప్రదేశాలుగా ఉన్న స్తూపాలు, తెలంగాణలో తొలి బౌద్ధం అంటే థేరవాద బౌద్ధ అవశేషాలను మనకు మిగిల్చాయి.
కోటలింగాల: 1979 నుంచి నాలుగేండ్లు, 2009 నుంచి రెండేండ్ల పాటు జరిగిన తవ్వకాల్లో ఇటుకలతో కట్టిన రెండు ఉద్దేశిక స్తూపాలు, స్తూపాలకు చుట్టూ రాతి ముక్కలతో కట్టిన వేదికలు బయటపడ్డాయి. ఈ స్తూపంపై అమర్చిన 59 రాతి ఫలకాలు దొరికాయి. వీటిలో 26 రాతి ఫలకాలపై బ్రాహ్మీ లిపిలో చెక్కిన అక్షరాలున్నాయి. ఈ లిపిని మల్లావజుల నారాయణ శర్మ సహాయంతో ఠాకూర్ రాజారాం సింగ్ మౌర్య కాలపు బ్రాహ్మీ లిపిగా, కొన్నింటిని భట్టిప్రోలు బ్రాహ్మీ లిపిగా గుర్తించారు. ఇక్కడ ఉన్న కొన్ని పదాలను‘గరకస’, ‘ఘరినిధ’, ‘పొధమర’, ‘నాగ గోపనికాయ’గా గుర్తించారు.
అంటే శాతవాహనకాలం నాటి కోటలింగాలలో మౌర్య కాలపు బ్రాహ్మీ లిపి దొరకడం అంటే ఈ స్తూపం తొలి శాతవాహనకాలం నాటిది కానీ ఇంకొంచెం వెనుకకు వెళ్తే మౌర్యుల కాలం నాటిది కానీ కావాలి. ఇంతేగాక స్తూపం దొరికిన దగ్గర్లోనే త్రిరత్న ముద్రలున్న టెర్రకోటతో చేసిన అవశేషాలు దొరికాయి. దీన్ని బట్టి ‘ఘరినిధ’ అనేది అక్కడి బౌద్ధ సంఘానికి దానం చేసిన ఒక స్త్రీ పేరనీ, కోటలింగాలలో ఉన్నది నాగ గోప అనే భిక్షువు నేతృత్వంలోని బౌద్ధ సంఘం ‘నాగ గోపనికాయ’ అని భావిస్తున్నారు. శాతవాహన కోట, బౌద్ధ నిర్మాణాలు, నివాస స్థలాలున్న కోటలింగాల పేరు ఆ కాలంలో ఏమై ఉంటుందనే ప్రశ్నకు దగ్గరలోనే ఉన్న ముక్కట్రావుపేటలో దొరికిన శాసనం ఒక ఆధారాన్నిస్తుంది. అందులో ఉన్న ‘అహిమకా నభతి బాలి(ల)కాయ మహ(హా) పురిస’ అనే వాక్యంలో మహాపురి కోటిలింగాల పేరు కావచ్చనేది ఒక ఊహ.
స్తంభంపల్లి (కంపల్లి): పాశిగాం దగ్గర్లోనే ఉన్న స్తంభంపల్లిలో 1986లో జరిపిన తవ్వకాల్లో ఎనిమిది కమ్మీలతో దాదాపు 9 మీటర్ల వ్యాసంతో ఉన్న స్తూపం, ఆయక స్తంభాల ముక్కలు, ఆయక వేదికలు, విహారానికి చెందిన గదుల గోడలు బయటపడ్డాయి. తవ్వకాల తర్వాత ఇక్కడి నిర్మాణాలను సంరక్షించకపోవడంతో ఇక్కడి ఆధారాలు నాశనమైనాయి.
ధూళికట్ట మహా స్తూపం: శాతవాహన కాలంలోని బౌద్ధాన్ని ప్రతిబింబించే స్తూపం ధూళికట్ట స్తూపం. దీనిని క్రీ.పూ. 3వ శతాబ్దం చివరి నాటిదిగా నిర్ధారించారు. పెద్దపల్లి జిల్లాలోని ఈ గ్రామంలో పెద్ద శాతవాహన కోట ఉన్నది. ధూళికట్ట, వడ్కాపూర్ గ్రామాల మధ్య హుస్సేన్మియా వాగు పక్కన ఉన్న ఈ స్తూపం ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే ప్రత్యేకమైనది. ఇక్కడున్న థేరవాద బౌద్ధాన్ని పూర్తిగా ప్రతిబింబించేది. 1974 నుంచి 77 వరకు, తిరిగి 1984-85లో ఒక మట్టి దిబ్బ మీద పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి మహా స్తూపాన్ని వెలికితీసింది. నాలుగు ఆయక వేదికలున్న ఈ స్తూపం చుట్టూ ఉన్న రాతి ఫలకాలపై శిల్పాల్లో బుద్ధుడి ప్రతిమ ఉండకపోవడం, బుద్ధుడికి సంబంధించిన చిహ్నాలు, అంటే స్థూపం వంటి శిల్పం, బోధివృక్షం, బుద్ధ పాదాలు, ధర్మచక్రం వంటివి మాత్రమే ఉండటం వల్ల ఇది థేరవాద శాఖకు (దీన్నే ముందు హీనయానం అనేవాళ్ళు) సంబంధించినదని నిర్ధారణయింది. ఇక్కడ రాతిఫలకంపై చెక్కిన ఐదు పడగల ముచిలింద నాగశిల్పం శాతవాహన కాలపు శిల్పాల్లోనే ఒక అద్భుతం. దీనిపైన ‘గుహ పతినో పతలస మతూయ సమయ దానం’ అనే బ్రాహ్మీ లిపిలో చెక్కిన ప్రాకృత లఘు శాసనం క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినది. మధ్యభాగంలో అండం, దానిపైన హార్మిక, తవ్వకాల్లో దొరికిన ఛత్రావళి అవశేషాలు, స్తూపం చుట్టూ ప్రదక్షిణ పథం, ఇలా పేరున్న మహా స్తూపాలకు తీసిపోకుండా ఉంటుంది ఈ స్తూపం. దీనిపై అమర్చిన రాతి ఫలకాల్లో ఇద్దరు మగవాళ్లు అంజలి ఘటిస్తూ పూజిస్తున్న ధర్మచక్రం, సింహం, ఇలాంటి శిల్పాల్ని చెక్కారు. స్తూపం పక్కనే భిక్షువుల కోసం బౌద్ధవిహారం ఉండేదని చెప్పడానికి నిదర్శనంగా 3.50X3.60 మీటర్ల కొలతలతో గదుల గోడలు దొరికాయి. పూర్తిస్థాయిలో తవ్వకాలు జరగని ఈ ధూళికట్ట స్తూప ప్రాంతం ఇంకా ఎన్నో విశేషాలను తనలో ఇప్పటికీ దాచుకొని ఉంది.
పాశిగాం: పాయసి అనే బౌద్ధ భిక్షువు పేరిట ఉన్న పాయసి గ్రామం పాశిగాంగా మారిందనేది ఒక ప్రతిపాదన. కోటలింగాలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పాశిగాంలో ఒక గుట్ట మీద 1981లో జరిపిన తవ్వకాల్లో ఒక స్తూప చైత్యం, ఒక చైత్యగృహం బయటపడ్డాయి. గజ పృష్టాకారం (U ఆకారం)లో ఉన్న స్తూపచైత్యంపై అందంగా వివిధ ఆకృతులు చెక్కిన ఆరు రాతి ఫలకాలున్నాయి. స్తూపం చుట్టూ స్వస్తిక, శ్రీవత్స, నందిపాద వంటి బౌద్ధ చిహ్నాలున్న ప్రదక్షిణ పథం ఉంది. ఇక్కడ దొరికిన స్తూపాన్ని కరీంనగర్ మ్యూజియంలో చూడొచ్చు.
– డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000