Ayurvedic | ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్నట్టుగా ‘ఆయుర్వేదమే సర్వరోగ నివారిణి’ అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏది అచ్చమైన ప్రాచీన ఆయుర్వేదమో, ఏది టక్కుటమార చిట్కా వైద్యమో కనిపెట్టడం కష్టమైపోయింది. దీంతో నమ్మేవాడికి నమ్ముకున్నంత, అమ్మేవాడికి అమ్ముకున్నంత అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పైగా ఆయుర్వేదం మంచిది, అల్లోపతి చెడ్డది అనే భావన కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఈ భావన వెర్రితలలు వేస్తే ఏం జరుగుతుందో మనకు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల వివాదంలో తేటతెల్లమైంది. సామాజిక ఉద్యమకారుడిగా, యోగ ప్రచారకుడిగా ప్రసిద్ధుడైన బాబా రాందేవ్ అలోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ముఖ్యంగా కొరోనిల్ ఔషధం చుట్టూ అల్లుకున్న ప్రచారం తీవ్రమైన తలవంపులు తెచ్చిపెట్టింది. చివరికి సర్వోన్నత న్యాయస్థానం తాఖీదుల మేరకు ప్రముఖ పత్రికల్లో క్షమాపణ ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది.
‘వైద్యో నారాయణో హరిః’ అని గౌరవించే దేశం మనది. ప్రాచీనకాలంలోనే శుశ్రుతుడు, చరకుడు ప్రామాణిక వైద్య గ్రంథాలు రాసిపెట్టిన భారతదేశంలో వైద్యం ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితికి పతంజలి వివాదం అద్దం పట్టింది. ఒకప్పుడు ఊరూరా ఓ వైద్యుడు ఉండేవాడు. దేశవాళీ పద్ధతుల్లో చికిత్సలు చేస్తూ రోగాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేవాడు. వలసపాలన పుణ్యమాని ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వంటి స్వదేశీ వైద్యవిధానాలు క్రమంగా వెనుకతట్టు పట్టి అల్లోపతి పైచేయి సాధించడం కొంతవరకు ఈ పరిస్థితికి కారణం. పరిశోధన, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతూ, ఆధునిక ముద్రతో అల్లోపతి ధాటిగా నిలబడగలిగింది.
భారతీయ వైద్యవిధానాల్లో ఆ స్థాయి పరిశోధనలు జరగలేదన్నది వాస్తవం. దీంతో అవి అశాస్త్రీయమైనవనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. ఒక అప నమ్మకం పెంచుతూ పోయారు. అలాగని అల్లోపతి కడిగిన ముత్యంలా తళతళ మెరుస్తున్నదని కాదు. ఔషధాల విషయంలో ఎన్నెన్నో వివాదాలు ఉండనే ఉన్నాయి. వైద్య ప్రమాణాలపై కఠిన నియంత్రణ అమలులో ఉండే పాశ్చాత్య దేశాల్లో అల్లోపతి ఔషధాలపై కుప్పతెప్పలుగా కేసులుండటమే ఇందుకు నిదర్శనం. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన మందులు ఇండియాలో బాహాటంగా వైద్యులు సిఫారసు చేస్తారనే అపప్రథ మొదటినుంచీ ఉండటం తెలిసిందే.
వైద్య విధానాల మధ్య వివక్ష లేదా అంటే అది అర్థరహితమైన విష యం. సమ్మిళితత్వమే శ్రేయస్కరం. అత్యవసర చికిత్సలకు అల్లోపతి, ఉద ర సమస్యలకు ఆయుర్వేదం, దీర్ఘవ్యాధులకు హోమియోపతి.. ఇలా ఒక్కోరకం రుగ్మతలకు ఒక్కో విధానం బాగా పనిచేస్తుందని కొందరు నమ్ముతారు. కానీ అలోపతికి, ఇతర విధానాలకు మధ్య సయోధ్య కుదరదు. ఇతర విధానాలను గుర్తించేందుకు అల్లోపతి నిరాకరించడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో డబ్బులుంటే అల్లోపతి.. లేకపోతే ఆయుర్వేద ముసుగులో సాగే చౌక వైద్యం అన్న తీరుగా వైద్యం నడుస్తున్నది.
భారతదేశానికి ఆచరణాత్మక వైద్య అనుసంధానంపై, ఆరోగ్య పరామితులపై ఇప్పటికీ పెద్దగా ఆలోచన జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. డాటా అందుబాటులో లేకపోవడం మరో సమస్య. దీనివల్ల స్వదేశీ వైద్య పద్ధతులు లెక్కలోకి రాకుండా పోతున్నాయి. పతంజలి వివాదాన్ని ఆసరాగా చేసుకొని వైద్య పరిశోధక సంస్థలు, ప్రభుత్వం ఇకనైనా దిద్దుబాటు చర్య లకు ఉపక్రమించాలి. స్వదేశీ వైద్య విధానాన్ని సమూలంగా సంస్కరించి, సమున్నతంగా నిలబెట్టేందుకు ప్రచార ఆర్భాటాల నుంచి విముక్తి కలిగించి నిజమైన ఆయుర్వేద వైద్యాన్ని వ్యాప్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి.