తమకు ఎంత పెద్ద ఉపద్రవం తలపెట్టిన వారికైనా సరే, తిరిగి కీడు చేయకపోవడం క్షమ. క్షమాగుణం సహజ లక్షణంగా ఉన్నవాళ్లు మాత్రమే తమకు నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని, కాలపరీక్షకు ఎదురు నిలుస్తారు. క్షమాగుణం సహజ లక్షణంగా ఉన్నవాళ్లను గొప్పవాళ్లని మహాభారతం పేర్కొంటున్నది. అయితే తమకు ఆటంకాలు, ఆపదలు కల్పించి జీవితాన్ని కష్టాల ఊబిలోకి నెట్టినవారికి కీడు తలపెట్టకుండా క్షమతో, సహనంతో వ్యవహరించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అలా ఉండాలంటే మనిషికి దృఢచిత్తం అవసరం. తమను ఇబ్బందులకు గురిచేసినవారిని తిరిగి ఇక్కట్లకు గురిచేయవద్దన్న విశాలమైన హృదయం ఉండాలి. అలా ఎదుటివారిని క్షమించి, విడిచిపెట్టేంత సహృదయం కలిగినవాళ్లు మనకు అరుదుగా తారసపడతారు. వారు తమ క్షమాగుణం ద్వారా సాటివారి కరకు మనసులను కరిగించగలుగుతారు. దీనికి నిరూపణగా మహాభారతంలోనే ఒక ఉదాహరణ కనిపిస్తుంది.
భీముడి చేతిలో తొడలు విరిగిన దుర్యోధనుడు జీవిత చరమాంకంలో ఉంటాడు. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుంది. అప్పుడు అతని దగ్గరికి కురు పాండవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ వస్తాడు. తమ బలం, బలగం సర్వనాశనం అయినప్పటికీ అతని హృదయంలో యుద్ధోన్మాదం ఏ మాత్రం తగ్గిపోలేదు. దుర్యోధనుడి ఉప్పు తిన్నాడు కాబట్టి, ఎలాగైనా సరే పాండవులను తుదముట్టించి వస్తానని అంటాడు. ఇంత విధ్వంసం జరిగినా కూడా పాండవుల అంతుచూస్తానని అంటున్నాడు కాబట్టి అశ్వత్థామ మాటలకు దుర్యోధనుడు కొంచెం గర్వపడతాడు. ఇచ్చిన మాటమేరకు పాండవుల శిబిరం దగ్గరికి వెళ్తున్న ద్రోణ పుత్రుడికి ఆ రాత్రివేళ పక్షి పిల్లలపై దాడిచేసి ఒక గుడ్లగూబ చంపిన దృశ్యం కనిపిస్తుంది. దాంతో రాత్రివేళ పాండవుల శిబిరంపై దాడికి పాల్పడతాడు. శిబిరంలో ఆదమరచి నిద్రిస్తున్న ఐదు శరీరాలను చూసి పాండవులుగా పొరబడతాడు. ఆ ఐదుగురి తలలూ నరికివేస్తాడు. వాటిని తీసుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. వాటిని చేతితో తాకిన రారాజుకు అవి చిన్నపిల్లల ముఖాలుగా అనిపిస్తాయి. అశ్వత్థామ చేసిన పనికి బాధపడతాడు. కానీ, అంతలోనే చివరికి కన్న కొడుకులు మరణించేంత హింస జరిగిన తర్వాత లభించిన రాజ్యాన్ని పాండవులు మాత్రం ఏం చేసుకుంటారని తన నైజాన్ని బయటపెట్టుకుంటాడు.
తెల్లవారేసరికి తమ పిల్లలు విగతజీవులై ఉండటాన్ని చూసి ద్రౌపది సహా పాండవులు హృదయవిదారకంగా విలపిస్తారు. దీనంతటికీ కారకుడైన అశ్వత్థామను పట్టి తెచ్చి ద్రౌపది ముందు నిలబెడతారు. తన నెత్తురు పంచుకొని పుట్టిన పసిపిల్లలను చంపిన పాపానికి అతణ్ని ఆమె అప్పుడు ఏదైనా చేయగలదు. కానీ, విచిత్రంగా అశ్వత్థామను క్షమించమని భర్తలకు సూచిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు సహా అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతారు. రాయబారానికి వెళ్తున్నప్పుడు శాంతి ఒప్పందం కంటే, యుద్ధమే ముఖ్యమంటుంది ద్రౌపది. తన కురులను చేతిలో పట్టుకొని, దుశ్శాసనుడి చేతులు తగిలిన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఈ మాటలు అంటున్నది ఆ ద్రౌపదేనా? అనుకుంటారు. నిద్రిస్తున్న పిల్లల్ని చంపిన వ్యక్తిని క్షమించవద్దని అంటారు. దానికి ఆమె వారితో… ‘నా కొడుకులు ఈ బాలఘాతకుని చేతిలో హతులయ్యారు. కానీ, నన్ను చూసుకునేందుకు నా భర్తలున్నారు. ఇతని తండ్రి ద్రోణాచార్యుడు యుద్ధంలో మరణించాడు. ఇప్పుడు మీ చేతిలో ఇతను కూడా మరణిస్తే గురుపత్నికి ఎవ్వరూ ఉండరు. ఒంటరిదైపోతుంది. కాబట్టి, ఇతణ్ని ప్రాణాలతో వదిలిపెట్టండి’ అని అశ్వత్థామకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. తన ఔన్నత్యాన్ని చాటుకుంటుంది. అలా స్త్రీ అంటే క్షమాగుణంలో భూమాతకు సమానంగా నిలుస్తుందని నిరూపిస్తుంది ద్రౌపది.
– చింతలపల్లి హర్షవర్ధన్