లారీ డ్రైవర్ల సమ్మెతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో దేశ రవాణా వ్యవస్థ ఉక్కిరిబిక్కిరైంది. సరుకు రవాణా స్తంభించడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ట్యాంకర్ల మెరుపు సమ్మెతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెట్రోల్ బంకులకు వాహనదారులు ఎగబడటంతో దేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పలు రాష్ర్టాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో డ్రైవర్లు వీధుల్లో ప్రదర్శనలు జరిపారు. భారతీయ శిక్షాస్మృతి స్థానే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ముఖ్యంగా వాహనదారులు మరో వాహనాన్ని గానీ, పాదచారులను గానీ ఢీకొని పోలీసులకు ఆ సమాచారమివ్వకుండా ఉడాయించే ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించిన శిక్షలపై వారు నిరసన తెలియజేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పెచ్చరిల్లుతున్నాయనే ఉద్దేశంతోనే కేంద్రం కఠినమైన చట్టాలను తెచ్చిన మాట వాస్తవమే. అయితే న్యాయసంహితలోని 106/2 నిబంధనలో.. ఇలాంటి నేరాలకు శిక్షాకాలాన్ని ఒక్కుమ్మడిగా రెండేండ్ల నుంచి పదేండ్లకు పెంచడాన్ని లారీల యజమానులు, డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో సుమారు కోటి మంది దాకా డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. వారిలో అత్యధికులు సమ్మెలో పాల్గొన్నారు. దీని ఫలితంగా సోమ, మంగళవారాల్లో 60-70 శాతం లారీలు రోడ్డెక్కలేదు. తాజా నిబంధనను వెనక్కి తీసుకోకపోతే డ్రైవర్ వృత్తిని చాలామంది వదిలేస్తారని, కొత్తవారు రావడానికీ జంకుతారని అఖిల భారత మోటర్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) అంటున్నది. దేహానికి రక్తనాళాల వ్యవస్థ ఎలాంటిదో దేశానికి సరుకు రవాణా వ్యవస్థ అలాంటిది. అందులో డ్రైవర్ పాత్ర చాలా కీలకం. వారు కుటుంబాలకు దూరంగా, సరైన భోజన వసతి లేకుండా, పద్మవ్యూహం లాంటి వాహనాల వలయంలో, విపరీతమైన ఒత్తిడితో పని చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పొరపాట్లు, తప్పులు, ప్రమాదాలు జరగడం సహజమే. కొన్నిసార్లు అవతలివారి తప్పుల వల్ల కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు. నిర్లక్ష్యంగా వాహనం నడపటాన్ని నివారించాలనే ఉద్దేశంతో శిక్షలు వచ్చాయన్నది గమనార్హం. ఇప్పుడు ఒక్కసారిగా శిక్షలను ఐదింతలకు పెంచడం సమ్మెకు కారణమైంది. దీనికి రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. పేదలను బలి చేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కొత్త నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదని, ఏఐఎంటీసీని సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం అంటున్నది.
నిబంధనలు రూపొందించిన తర్వాత సంప్రదింపులు జరపడం విజ్ఞతాయుతం అనిపించుకోదు. పైగా విపక్ష ఎంపీలను పెద్దసంఖ్యలో సస్పెండ్ చేసి, హడావుడిగా చట్టాలు చేసి దేశం మీద వదిలే సంస్కృతి మంచిది కాదు. గత సమావేశాల్లో రికార్డు స్థాయిలో 146 మంది ఎంపీలను సభ నుంచి బయటికి పంపించిన సంగతి తెలిసిందే. మందబలం ఉంది కదా అని వెనుకాముందూ చూడకుండా పాలకపక్షం తనకు ఇష్టం వచ్చిన రీతిలో చట్టాలు చేయడం వల్ల తప్పులు జరిగి.. దేశానికి, ప్రజాస్వామ్యానికీ ముప్పు ఏర్పడుతున్నది. ఫ్యూడల్ ప్రభువుల ఫర్మానాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య చట్టాలకు మధ్య తేడా సంప్రదింపులే. చర్చలు జరపకుండా పాలకపక్షం తన అభీష్టాన్ని దేశం మీద రుద్దడం ‘ప్రజాస్వామిక నియంతృత్వం’ అవుతుంది. ముందుగానే సంబంధిత భాగస్వామ్య పక్షాలను, అన్నిపార్టీలను సంప్రదించి, పార్లమెంటులో లోతుగా చర్చించిన తర్వాతనే నిబంధనలు రూపొందించి ఉంటే దేశ ప్రజలకు ఈ అవస్థలు తప్పేవి.