Telangana History | ఒక జనపదం రాజ్యంగా మారాలంటే, ఒక రాజ్యం సామ్రాజ్యంగా మారాలంటే కావాల్సింది పటిష్టమైన ఆర్థికవ్యవస్థ. అందుకోసం ఏమేం ఉండాలో ఆర్థిక చరిత్ర చెప్తుంది. మూడు ముఖ్యమైన లక్షణాలే సమాజాన్ని లేక రాజ్యాన్ని ఆర్థికంగా పటిష్టం చేస్తాయి. మొదటిది వ్యవసాయం అభివృద్ధి చెంది మిగులు సాధించాలి. అంటే వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల వాడకానికి పోగా దేశీయ, విదేశీ వర్తకం కోసం మిగలాలి. రెండోది వ్యవసాయాధారిత, వ్యవసాయేతర వృత్తులు, చేతిపనులు ఉన్నత స్థితిని చేరుకొని, ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి జరగాలి. దీంతో గ్రామాలు బలోపేతమై నగరాలకు బాటలు పడతాయి. ఇక మూడోది వ్యవసాయంలో, ఇతర వస్తువుల్లో ఉత్పత్తి పెరిగి వర్తకం పెద్ద ఎత్తున సాగడం. దీంతో పట్టణాలు, నగరాలు పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న సమాజం గురించి చెప్తున్నట్టుగా ఉంది కదా. సరిగ్గా ఇది జరగడం వల్లే కోటలింగాల ప్రాంతంలోని శాతవాహన రాజ్యం తూర్పు, పశ్చిమ సముద్రాల మధ్య ఉన్న అధిక భూ భాగంలో సామ్రాజ్యంగా మార్చుకోగలిగింది. పశ్చిమాన గుజరాత్ వరకు, తూర్పున కళింగ పైభాగం వరకు, ఉత్తరంలో అవంతీ రాజ్యం (ఇప్పటి మధ్యప్రదేశ్) వరకు, దక్షిణాన తమిళ తీరం వరకు విస్తరించగలిగింది.
నేల గర్భంలో దాగిన నాణేలు: ఏ రాజ్య ఆర్థిక పరిస్థితి అయినా తెలిపేవి నాణేలు. శాతవాహనుల చరిత్రకు ముఖ్యమైన ఆధారాల్లో నాణేలు ఒకటి. తెలంగాణలో తవ్వకాల్లో దొరికిన నాణేల సంఖ్య అపారం. మిగతా రాష్ర్టాల పురాతత్త్వ స్థలాలలో దొరికిన నాణేల సంఖ్యతో పోలిస్తే, తెలంగాణ భూగర్భంలో శాతవాహన వైభవ నిధి ఎంత ఉన్నదో తెలుస్తున్నది. కోటలింగాలలో 447, పెద్దబంకూరు, ధూళికట్టలలో కలిపి సుమారు 30,000, కొండాపూర్లో 50, ఫణిగిరి, నాగార్జునకొండ, ఏలేశ్వరం వంటి తవ్వకాల్లో పదుల సంఖ్యలో శాతవాహన నాణేలు దొరికినయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, ధరణికోట రెండు ప్రదేశాల తవ్వకాల్లో కలిపి పదుల సంఖ్యలో లభించాయి. అలాగే వడ్డమాను, వీరాపురం, గారపాడు, సాలిహుండంలలో తవ్వకాలు జరిగినప్పటికీ, తెలంగాణలో దొరికినన్ని లభించలేదు. మహారాష్ట్రలో శాతవాహన రాజధానుల్లో ఒకటి అనుకుంటున్న పైఠాన్, నెవాసా, బ్రహ్మపురి, నాసిక్ వంటి 10 తవ్వకాల్లో కూడా నాణేల సంఖ్య వందను మించలేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లలో కూడా దొరికిన నాణేల సంఖ్యను తెలంగాణలో దొరికిన సంఖ్యతో పోల్చలేం. ఇదీ తెలంగాణలో శాతవాహన నిధి.
తెలంగాణలో పురావస్తు తవ్వకాల్లో, నేల ఉపరితలంపై, అప్పుడప్పుడు దొరికే నిధుల్లో వేల సంఖ్యలో శాతవాహన నాణేలు దొరికినయి. వీటి ఆధారంగా శాతవాహన రాజుల పేర్లు మనకు తెలుస్తున్నాయి. నాణేల ఆధారంగా మనకు తెలుస్తున్న పేర్లు చిముక, కృష్ణ, శాతకర్ణి, నాగానిక, సిరిసతస, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞ శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులుమావి, వాసిష్టీపుత్ర శివ శ్రీ పులుమావి, వాసిష్టీపుత్ర స్కంద శాతకర్ణి, స్కంద శాతకర్ణి, విజయ శాతకర్ణి, పులుమావి అనే రాజులవి. ఈ పేర్లన్నీ మనకు లిఖిత ఆధారాలైన పురాణాల్లో కూడా కన్పిస్తున్నాయి. అయితే పురాణాలు పేర్కొనని రుద్ర శాతకర్ణి, కౌశికీపుత్ర శాతకర్ణిల నాణేలు కూడా మనకు దొరికినయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నాణెం శాతకర్ణి భార్య రాణి నాగానిక పేరిట ఉన్న నాణెం.
తల్లి పేరును తమ పేరుతో జతచేసే పద్ధతి శాతవాహనులది. దీన్ని ఇంగ్లీషులో Matronymic అంటారు. అందుకే శాతవాహన రాజుల పేర్లలో వాసిష్టీపుత్ర, గౌతమీపుత్ర, కౌశికీపుత్ర వంటి పదాలు రాజు పేరు ముందుంటాయి. తల్లి పేరుతో కూడిన నాణేన్ని జారీచేసిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణిది. ఇక శాతవాహన సామంతులు లేక అధికారులు అయిన మహాతలవర, మహాసేనాపతి, మహాగ్రామిక పేర్లతో ఉన్న నాణేలు కూడా లెక్కకు మిక్కిలిగా లభ్యమైనాయి. కోటలింగాలలో దొరికిన సెబక అనే పేరుతో ఉన్న నాణెం గురించి ఎక్కువ స్పష్టత లేదు. ఇలాంటి నాణెమే విదర్భ, మరఠ్వాడాలలో కూడా దొరకడం, కొన్నింటిపై రాణో సెబకస అని ఉండటంతో సెబక రాజా లేక సామంతుడా అనేది ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే రాజులైన ప్రతివారి నాణెంపై ‘రాణో’ అనే పదం పేరు ముందుంది కానీ మహాతలవరల వంటి వారి నాణేలపై ఆ పదం లేదు.
ఈ నాణేల తయారీకి పొటిన్, రాగి, సీసం, వెండి వంటి లోహాలను వాడేవాళ్లు. రాగి, సత్తు, సీసంతో చేసిన మిశ్రమ లోహమే పొటిన్. తొలి చారిత్రక యుగంలో ఇక్కడే కాదు రోములోనూ, గ్రీస్లోనూ పొటిన్ను నాణేల తయారీలో వాడేవారు. నాణేలపై ఉండే బొమ్మలు సైతం మనకు నాటి వాణిజ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి నాణెంపై ఉన్న నౌక బొమ్మ సముద్ర వర్తకాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారి నాణేలపై నౌక బొమ్మను ముద్రించిన ఘనత మన శాతవాహనులకే దక్కింది.
నల్గొండ జిల్లా అక్కెనపల్లిలో 1959లో దొరికిన నిధిలో 1,531 రోమన్ నాణేలున్నాయి. తెలంగాణలో దొరికిన రోమన్ నిధుల్లో ఇదే అతిపెద్దది. రోమన్ చక్రవర్తులైన ఆగస్టస్ (క్రీస్తుపూర్వం 27- క్రీస్తుశకం 14), టైబీరియస్ (క్రీ.శ.14-37), కలిగులా (క్రీ.శ. 37-41), క్లాడియస్ (క్రీ.శ. 41-54), నీరో (క్రీ.శ.54-68)ల నాణేలు ఇక్కడ దొరికినయి. ఇదే జిల్లా గూటిపర్తిలో రోమన్ చక్రవర్తులు క్లాడియస్, ప్లోటినా (రోమన్ రాణి), ఆంటోనియస్ పయస్ (క్రీ.శ.131-161) నాణేలు, ఏలేశ్వరంలో సెప్టిమియస్ సెర్వెరస్ (క్రీ.శ.193-211), నుస్తులాపూర్లో ఆగస్టస్, టైబీరియస్ నాణేలు, కొండాపూర్లో ఆగస్టస్ నాణేలు దొరకడం యాదృచ్ఛికం కాదు. ఇదంతా రోమన్ వర్తకం ఏ స్థాయిలో జరిగిందో చెప్తుంది.
ఇంతకూ మన దగ్గర నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఏమేం ఎగుమతి అయ్యేవి? అవే వివరాలు ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే గ్రంథం (తెలుగులో ఎర్ర సముద్రపు నావికుడు దినచర్య)లో ఉంది. వరి, గోధుమ, తేనె, నెయ్యి, నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలు- మూలికలు, తమలపాకులు, వజ్రాలు, పచ్చలు (ఎమెరాల్డ్) కురువిందం (రూబీ), దంతం, పట్టు, పత్తి, బట్టలు… ఇవన్నీ మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించినవే.
దిగుమతుల్లో ద్రాక్షాస్రావం (వైన్), రాగి, తగరం, సీసం, ఆంటిమొనీ (ఒక లోహం), బంగారం, వెండి ఉన్నాయి. ప్రస్తుతం మనం ‘బాలన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎగుమతులు దిగుమతుల్లో సమతౌల్యం గురించి మాట్లాడుకుంటాం. శాతవాహన కాలంలో మన ఎగుమతులదే పైచేయిగా మారి రోమ్ ఖజానాకు నష్టం వస్తున్నదని వాళ్ల సెనేట్ (మన పార్లమెంట్ లాంటిది)లో చర్చించుకున్నారని చరిత్రకారుల రాతలు చెప్తున్నాయి. అందుకే మన దగ్గర ఇన్ని రోము నాణేలు పోగుపడ్డాయి.
క్రీస్తు పూర్వం 27లో అగస్టస్ కాలంలో మొదలైన సముద్ర వర్తకం క్రీ.శ. 5వ శతాబ్దం వరకు, దాదాపు 500 ఏండ్లు సాగింది. ఈ వర్తక బంధానికి శాతవాహనుల కాలంలోనే మార్గం ఏర్పడి ఆ తర్వాత ఇక్ష్వాకులు, ఆ తర్వాత కొంతకాలం సుదూర తీరాల వరకు వాణిజ్యం సాగింది. రోమన్ బంగారు నాణేలు ఎన్ని రకాలుగా ఉపయోగించేవారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదట సరుకుల మారకానికి, ఆ తర్వాత అదే నాణేలపై ఉన్న గుర్తులను రాతలను చెక్కేసి మారకానికి వాడేవాళ్లు. కొన్ని సందర్భాల్లో వాటిమీదో స్థానిక అధికార ముద్రలను, గుర్తులను వేసి స్థానిక నాణేలుగా చలామణి చేసేవాళ్లు. ఇంకా ఆశ్చర్యమేమంటే ఈ రోమన్ బంగారు నాణేలను నెక్లేసులలో వేసుకొని ఆభరణాలుగా వాడుకున్నారు.
నాణేల అధ్యయనం మరింత జరగాలి: శాతవాహన చరిత్రను తెలంగాణ చరిత్రలో భాగంగా మరింత పరిపుష్టం చేయాలంటే భౌతిక ఆధారాల్లో ముఖ్యమైన నాణేల సేకరణ, అధ్యయనం జరగాలి. రాష్ట్ర హెరిటేజ్ శాఖ నిధిలో ఉన్న దాదాపు 30 వేల శాతవాహన నాణేల సరైన వర్గీకరణ, పరిశీలన జరగాలి. ప్రపంచంలో పేరు మోసిన ఏ మ్యూజియంలోనైనా నాణేల విభాగంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, కనిపిస్తుంది. మన నేలలో వెలకట్టలేని చారిత్రక నిధి దాగి ఉన్నది. దాన్ని మనం సరిగ్గా అధ్యయనం చేసి ప్రపంచానికి షోకేస్ చేయగలిగితే, మన శాతవాహన నాణేలు బంగారం కంటే వన్నె మెరిసిపోయి- తెలంగాణ ఘన చరిత్ర గురించి ప్రపంచానికి చాటి చరిత్రకారులనూ, ప్రజలను మురిపిస్తుంది.
శాతవాహన సామ్రాజ్యానికీ, రోమన్ సామ్రాజ్యానికీ మధ్య ఉన్న వర్తక, వాణిజ్య సంబంధాలకు ఆధారం శాతవాహనుల ఏలుబడిలో ఉన్న భూభాగంలో పెద్ద సంఖ్యలో రోమన్ నాణేలు దొరకడం. భారత ఉపఖండానికి విదేశీ వర్తకం ఏమీ కొత్త కాదు. సుమారు 4000 ఏండ్ల ముందే సింధులోయ పట్టణాలకు మెసొపొటేమియా (ఇప్పటి ఇరాక్)తో వ్యాపార సంబంధాలుండేవి. ఇదేకాలంలో మధ్య ఆసియా ప్రాంతం నుంచి రాకపోకలున్నట్టు మన దక్కన్లో సైతం బృహత్ శిలాయుగ (మెగాలిథిక్) ఆధారాలు కనపడుతున్నాయి. ఈ అంశంపై ఎక్కువ పరిశోధనలు జరగకపోవడం ఒక లోటు. అందుకే శాతవాహన కాలానికే తెలంగాణ సముద్ర వర్తకంలో పాలుపంచుకుంది.
తెలంగాణలో రోమన్ నాణేలు దొరికిన ప్రాంతాలు-
వీపనగండ్ల (వనపర్తి జిల్లా), కొండాపూర్ (సంగారెడ్డి), అక్కెనపల్లి (నల్గొండ), గొట్టిపర్తి (సూర్యాపేట), ఏలేశ్వరం (నల్గొండ), నాగార్జునకొండ (కృష్ణా లోయ), నాగవరప్పాడు (ఖమ్మం). నుస్తులాపూర్ (కరీంనగర్), పెద్దబంకూరు (పెద్దపల్లి). ఇవన్నీ కూడా నదీతీరాలకు, లేక జలమార్గాల దగ్గరలో ఉన్న స్థలాలు. కొండాపూర్ మంజీర- మూసీలకు దగ్గరలో, నల్గొండ జిల్లా ప్రాంతంలోని మూసీ, కృష్ణాల పరీవాహక ప్రాంతాల్లో కూడా దొరికాయి. కరీంనగర్ వంటివి మానేరు- గోదావరి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. రోమన్లతో వర్తకం జలమార్గం గుండా సాగినందున ఈ ప్రాంతాల్లోనే రోమన్ నాణేలు లభ్యమవుతున్నాయి.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్ ,81069 35000
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Telangana History | కృష్ణానది గట్టునున్న ఏలేశ్వరంలో వికసించిన రసవిద్య
Telangana History | తెలంగాణ తొలి సామ్రాజ్యానికి పునాది రాయి.. కోటలింగాల
Telangana History | తెలంగాణలో కొత్త మైలు రాళ్లు
Telangana History : మన చరిత్ర.. నత్తలగుట్ట మర్మమేమిటి?