భారతదేశానికి ఓ పిడికెడు నవ్వులు కావాలి. ఓ దోసెడు సంతోషం కావాలి. బస్తాడు భరోసాను ప్రపంచ బ్యాంకు అరువియ్యగలదా? ఓ 150 కోట్ల నవ్వుల్ని ఐఎంఎఫ్ అప్పుగా ఇస్తుందా? అసలేం జరుగుతోంది? భారత్ ముఖానికి మళ్లీ చిరునవ్వులు అతికించేదెవ్వరు? మోదీ గద్దెనెక్కిన పదేండ్లలో మన సంతోషం చాలావరకు హరించుకుపోయింది. సంతోషమే సగం బలమన్నారు పెద్దలు. బలమే కాదు, ఆనందమే జీవిత మకరందమని కూడా చెప్పారు. ఎవరెన్ని చెప్తేనేం.. జీవితానికి అవసరమైన ఈ కీలకమైన ముడిసరుకు విషయంలో భారత్ చాలా వెనుకబడిపోయిందట.
ప్రపంచ సంతోష సూచీ ఈ సంగతి వెల్లడించింది. ఇదేమంత సంతోషం కలిగించే వార్త కాదు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్వర్క్ ఏటా ఈ సూచీని విడుదల చేస్తుంది. ఇదేమీ ఆషామాషీగా తయారు చేసే జాబితా కాదు. దీని వెనుక చాలా లెక్కలుంటాయి. బతుకుకు భరోసా కల్పించే పరిస్థితులను బట్టి సంతోష స్థాయిని అంచనా వేస్తారు. తలసరి జీడీపీ, ఆరోగ్యవంతమైన జీవితం, తోడునీడ లభ్యత, బోలెడన్ని జీవితావకాశాలు అందుబాటులో ఉండటం, ఔదార్యం, అవినీతి నుంచి విముక్తి అనే ఆరు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సంతోషాన్ని లెక్కించి దేశాలవారీగా ర్యాంకులు ఇస్తారు.
ఈ సూచీలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఉత్తర యూరప్ దేశం ఇలా టాప్లో నిలవడం వరుసగా ఇది ఏడోసారి. తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్ల్యాండ్, స్వీడన్ తదితర దేశాలున్నాయి. కొవిడ్-19 మహమ్మారికి ముందూ, తర్వాత తొలి పది దేశాల విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. అగ్రరాజ్యంగా చలామణి అయ్యే అమెరికా ర్యాంకు 16 నుంచి 23కు పడిపోవడం, జర్మనీ ఆ తర్వాతి స్థానంలో సర్దుకోవడం ఆ రెండు దేశాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నదని తెలియజేస్తున్నది. అనునిత్యం ఘర్షణలతో, అల్లకల్లోలంగా కనిపించే ఇజ్రాయెల్ టాప్-10 దేశాల్లో ఉండటం ఆలోచించదగ్గ విషయమే. ఇక మన దేశం విషయానికి వస్తే 146 దేశాల్లో 126వ స్థానంలో ఉండటం ఏమంత గర్వకారణమైన విషయం కాదు. పొరుగు దేశమైన పాకిస్థాన్ 108వ ర్యాంకుతో మనకన్నా మెరుగ్గా, చైనా 60వ ర్యాంకుతో మనకన్నా చాలా ముందుగా ఉండటం విశేషం.
భారత్లో అందరి పరిస్థితి ఒకేలా చెప్పడానికి లేదు. రకరకాల సామాజిక అంతరాలు, సంతోషంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వయోభేదాలు, స్త్రీపురుష అసమానతలు, చదువులో అంతరాలు, సామాజిక కులవివక్ష అనేవి సంతోష స్థాయుల్లో కూడా ప్రతిఫలించాయి. యువజనుల కన్నా వయోవృద్ధుల్లో సంతోష స్థాయి కొంచెం మెరుగ్గా ఉంది. ఆ వృద్ధుల్లోనూ మగవారి కంటే మహిళల్లో, చదువుకున్నవారి కంటే చదువురానివారిలో, ఉన్నత కులాల కంటే ఎస్సీ, ఎస్టీల్లో సంతోషం తక్కువగా నమోదైంది. వయసు మీద పడుతున్న కొద్దీ స్త్రీపురుషుల మధ్య అగాధం పెరగడమనేది ప్రతిదేశంలోనూ కనిపించింది.
భారత్లో ఇటు పిల్లలు, అటు వయోవృద్ధులు సాపేక్షంగా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ యువజనులు, ముఖ్యంగా అప్పుడే జీవిక కోసం అన్వేషించే వయసులో ఉన్నవారు సంతోషంగా లేకపోవడం దేనికి సంకేతం? వీరి విషయంలో మనదేశం ర్యాంకు మరో మెట్టు దిగి 127 వద్ద ఆగింది. అంటే యువతకు బతుకు భరోసా అంతంతమాత్రంగానే ఉందని ఇది సూచిస్తున్నది. రెండో విడత పరిపాలన పూర్తి చేసుకుని మూడో విడత కోసం అంగలు వేస్తున్న భారత పాలకులు దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది. ఆకలి సూచీలో వెనుకబడ్డప్పుడు అవన్నీ పశ్చిమ దేశాల కాకిలెక్కలని కొట్టిపారేసిన నాయకత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందిస్తుందా?