జగిత్యాల కలెక్టరేట్, జనవరి 13: పోలీసులను తప్పించుకొనే క్రమంలో అతివేగంగా వెళ్లిన కారు కరెంట్ స్తంభాన్ని, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది..పోలీసులు దగ్గరికి వెళ్లి పరిశీలించగా కారులో రూ. 3లక్షల విలువైన గుట్కా సంచులు కనిపించడం కలకలం రేపింది..గురువారం జగిత్యాల కేంద్రంలో జరిగిన ఈఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.. జగిత్యాల టౌన్ సీఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ వద్ద నిజామాబాద్- జగిత్యాల ప్రధాన రహదారిపై ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కారు పోలీసులకు చిక్కకుండా వేగంగా వెళ్లింది..కారు డ్రైవర్ వేగంగా నడుపడంతో అదుపు తప్పి కోళ్ల దుకాణంలోకి వెళ్లడంతో పాటు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని, ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పల్టీకొట్టింది. ఈ ఘటనలో కరెంట్ స్తంభం విరిగిపడగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కరెంట్ విద్యుత్ స్తంభం విరుగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కోళ్ల దుకాణంలోని 20 కోళ్లు మరణించాయి. పోలీసులు బోల్తాపడ్డ కారును తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా సంచులు లభ్యమయ్యాయి. స్వయంగా కారును నడుపుకుంటూ గుట్కాను అక్రమంగా తరలిస్తున్న ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఇమ్రాన్ను విచారించగా నిర్మల్కు చెందిన పాన్షాప్ నిర్వాహకుడు షఫీక్ అహ్మద్ నుంచి గుట్కాను కొనుగోలు చేసి జగిత్యాలకు రవాణా చేస్తున్నట్లు తేలింది. పోలీసులు నిర్మల్కు వెళ్లి షఫీక్ అహ్మద్ పాన్షాపులో రూ. 4 లక్షల గుట్కా ప్యాకెట్లు దొరికాయని తెలిపారు. అలాగే ఇమ్రాన్తో పాటు షఫీక్అహ్మద్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.