వనపర్తి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆధారం లేకుండా సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్స్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. జనవరి నెలలో ఒకొక్కరికి పది కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 17,788 మందికి లబ్ధి చేకూరేలా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎటువంటి గుర్తింపుకార్డు అవసరం లేకుండా బియ్యం అందించాలని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వనపర్తి జిల్లాలో 566, జోగుళాంబ గద్వాలలో 288, నాగర్కర్నూల్లో 48, మహబూబ్నగర్లో 56, నారాయణపేటలో 40 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరందరి డేటాను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పౌరసరఫరాలశాఖ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఈ జాబితాను డీసీఎస్వో.. డిస్ట్రిక్ట్ మేనేజర్కు పంపించాలి. సదరు మేనేజర్ తన పరిధిలోని గోదాం ఇన్చార్జి ద్వారా రేషన్ బియ్యాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తారు. వారి నుంచి సంతకాలు స్వీకరించిన పత్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ద్వారా జిల్లా జడ్జికి పంపిస్తారు. దీని ద్వారా సెక్స్వర్కర్ల గుర్తింపుకార్డులు లేదా వ్యక్తిగత వివరాలు తీసుకునే ప్రయత్నం చేయడానికి వీలులేదు. రేషన్ దుకాణాల వద్దకు సెక్క్వర్కర్లను పిలిచి బియ్యాన్ని పంపిణీ చేయరాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా అధికారులు పనిచేయాలి. వనపర్తి జిల్లాలో 5.660 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాలలో 2.880, మహబూబ్నగర్లో 0.560, నారాయణపేటలో 0.400, నాగర్కర్నూల్లో 0.480 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు.