ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు కాన్పుల కోసం క్యూ
16 వస్తువులతోపాటు నాలుగు విడుతల్లో నగదు సాయం
ఇప్పటివరకు జిల్లాలో 16,515 మందికి కిట్ల అందజేత
జిల్లాలో గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించే మహిళలకు ‘కేసీఆర్ కిట్’ వరంగా మారింది. నాలుగున్నరేండ్లుగా జిల్లాలో ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతున్నది. ఎంతోమంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలకు ప్రసవ సమయంలో అత్యుత్తమ సేవలతో పాటు ప్రసవానంతరం
16 వస్తువులతో కూడిన కిట్ను అందిస్తున్నారు. దీంతో అత్యధిక శాతం గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 19,667 ప్రసవాలు జరుగగా 16,515 మందికి కేసీఆర్ కిట్లను అందించారు.
ఈ పథకం ద్వారా మాతా శిశు మరణాల రేటు కూడా తగ్గింది.
బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు ఆరోగ్య భవిష్యత్ను కల్పించేందుకు సీఎం కేసీఆర్ వినూత్న పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ‘కేసీఆర్ కిట్’ పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. 2017 జూన్ 4 నుంచి ఇది అమలులోకి రాగా.. జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నది. భువనగిరి ఏరియా దవాఖానాతో పాటు జిల్లాలోని 23 పీహెచ్సీలు, సీహెచ్సీల పరిధిలో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు భువనగిరి మండలంలో అత్యధికంగా కిట్లను అందజేశారు.
నాలుగు విడుతల్లో సాయం…
గర్భిణీకి తొమ్మిదో నెల వచ్చే వరకు ప్రభుత్వం నాలుగు విడుతలుగా ఆర్థిక సాయాన్ని నేరుగా వారివారి ఖాతాల్లో జమచేస్తోంది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, బాబు జన్మిస్తే రూ.12వేల చొప్పున అందిస్తున్నది. కాస్త ఆలస్యంగానైనా పక్కాగా తల్లి ఖాతాలో సాయాన్ని జమచేస్తుండడంతో కేసీఆర్ కిట్ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ దవాఖానాల్లో 2,175(48శాతం) ప్రసవాలు జరుగగా.. సహజ ప్రసవాలు 810(39 శాతం) జరిగాయి. అలాగే సిజేరియన్ ప్రసవాలు 1,325(62శాతం) వరకు ఉన్నాయి. కాన్పుల అనంతరం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉంటుండడంతో ప్రభుత్వ దవాఖానకు గర్భిణులు క్యూ కడుతున్నారు.
పుట్టింట్లో కాన్పు అయిన సంబురం
ఈమె పేరు పైళ్ల మానస. ఊరు యాదగిరిగుట్ట మండలంలోని రాళ్లజనగాం. ప్రసవం కోసం భువనగిరి ఏరియా దవాఖానకి రాగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దవాఖానకు వచ్చినప్పటి నుంచి వైద్యులు, నర్సులు దగ్గరుండి సేవలు అందించడంతో తొలి కాన్పు నార్మల్గానే అయ్యింది. ఈ సందర్భంగా దవాఖాన వైద్యులు మానసకు కేసీఆర్ కిట్ను అందజేశారు. బిడ్డ కేకలతో ఆ తల్లి మనసు ఉప్పొంగిపోతుండగా.. పుట్టింట్లో కాన్పు అయిన సంబురంగా ఉందని మానస సంతోషంగా చెబుతోంది.
కేసీఆర్ కిట్టు చాలా బాగుంది
కేసీఆర్ కిట్టు చాలా బాగుంది. పిల్లలకు ఉపయోగపడే అన్ని వస్తువులు కిట్టులో ఉన్నాయి. దోమతెరలు, సబ్బులు, నూనెలు, పౌడర్, పరుపు, దుస్తులు, తల్లులకు చీరెలు చాలా బాగున్నాయి. కిట్టులో ఎక్కువగా ఖరీదైన వస్తువులే ఉన్నాయి. బాబు పుట్టిన రోజే కిట్టును ఇచ్చారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
కిట్ ఉపయోగకరంగా ఉంది
కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నేను మొదటికాన్పుతో పాటు రెండవ కాన్పును రామన్నపేట ప్రభుత్వ దవాఖానలోనే చేయించుకున్నాను. రెండు సందర్భాలలోను కిట్ను అందించారు. కిట్లోని వస్తువుల ద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైన సపర్యాలు చేస్తున్నాం. కేసీఆర్కిట్ ఇవ్వాలనే ఆలోచన రావడం మాలాంటి పేదల అదృష్టం.