జడ్చర్లటౌన్, నవంబర్ 19: కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకొన్నారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక సంతోషిమాత ఆలయంలో లక్షాదీపార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల్లో శివుడికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఇండ్ల వద్ద గౌరీనోములు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని పూజలు చేశారు. దంపతులు సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, నవంబర్ 19: మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, వాడ్యాల్, దోనూర్, కొత్తపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మండలకేంద్రంలోని ఈదమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేకపూజలు చేశారు. శివాలయాల వద్ద ఆధ్మాతిక శోభ సంతరించుకున్నది. కార్తీకశోభతో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. సాయంత్రం వేళలో కార్తీక దీపాలు వెలగించి మొక్కలు చెల్లించుకున్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, నవంబర్ 19: మున్సిపాలిటీలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన, శివలింగానికి అర్చన, అభిషేకం చేశారు. సాయంత్రం ఆకాశదీపాన్ని వెలించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకుడు మంజునాథస్వామి పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, నవంబరు 19: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మండలవ్యాప్తంగా సత్యనారాయణస్వామి వ్రతాలతోపాటు ఆలయాల్లో పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ప్రజలు ఆయా గ్రామాల్లోని శివాలయం, వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలింగించి ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, నవంబర్ 19: మండల కేంద్రంతోపాటు పెద్దాయపల్లి, ఉడిత్యాల, మాచారం, గుండేడ్, మోతిఘణపూర్, తదితర గ్రామాల్లో శుక్రవారం భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. ఇండ్లలో గౌరీనోములు, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి వత్రాలను జరుపుకొన్నారు.
కందూరులో లక్ష దీపోత్సవం
మూసాపేట(అడ్డాకుల), నవంబర్19: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి రామలింగేశ్వరుడి సన్నిధికి చేరుకొని అభిషేకాలు, అర్చన చేశారు. అనంతరం కల్పవృక్షాల నీడలో సేదతీరారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా అడ్డాకుల, మూసాపేట మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వ్రతాలు ఆచరించడంతోపాటు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.