జరిగిన కథ
వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోతాడు రామభట్టు. దట్టమైన అడవి మధ్యలో, ఓ కొండ మీది ప్రాచీన ఆలయంలో వెలిసిన స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు. అదే సమయంలో రారాజు ్రత్రిభువన మల్లుడు మంత్రి, సామంత, దండనాయకులతో తన మనసులోని భయాలను పంచుకుంటూ ఉంటాడు. అంతలోనే, రామభట్టును సభలో ప్రవేశపెడతారు సైనికులు. అప్పుడో అనూహ్యమైన సంఘటన జరుగుతుంది.
ఆ తర్వాత?
తెల్లవారక ముందే ఊరు ఊరంతా మేల్కొన్నది. వ్యవసాయ పనులపై మసక వెలుతురులోనే పంట పొలాల దగ్గరకు వెళ్తున్నారు రైతులు. భూమిని ప్రాణంగా ప్రేమించే వ్యవసాయదారులు సూర్యచంద్రులతో పోటీపడి శ్రమిస్తారు. సూర్యుడింకా రాకముందే ఇంటినుంచి వెళ్లిపోయి, చంద్రుడు వచ్చాక ఇంటికొస్తారు. శ్రమజీవుల గ్రామీణ సౌందర్యం ఇది!
తెల్లవారు జామున పొలాల గట్లు చర్చావేదికలయ్యాయి. అందరిలో ఒకటే ఆందోళన, ఒకటే భయం.‘మళ్లా యుద్ధమొస్తదట గదా?’యుద్ధ్దాలు ఎవరిని గెలిపిస్తాయో, ఎవరిని ఓడిస్తాయో తెలియదు. కానీ ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా నష్టపోయేది సామాన్య పౌరులే. అందుకే అంత భయం. అయితే, త్రిభువన చక్రవర్తి పాలన యుద్ధ ప్రభావం సామాన్యులపై పడకుండా చూసుకొనేది. శాంతిభద్రతలకు, వ్యవసాయ-వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టేవారు. మరొక వార్త బలంగా నలుదిశలా వ్యాపిస్తున్నది. వేదమూర్తిగా అందరి మన్ననలనూ అందుకొన్న రామభట్టును చక్రవర్తి సైనికులు పట్టుకొని నిర్భందించారని. ‘ఇదెక్కడి అన్యాయం?’ అని అడిగితే.. వారిని కూడా దేశద్రోహులుగా ప్రకటిస్తారని. ఈ వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా.. ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తున్నది. దానికి కారణం ఉంది. ‘మేము చూస్తుండగానే రాజభటులు వచ్చి, అ వృద్ధుణ్ని చుట్టుముట్టి బలవంతంగా తీసుకుపోయినారు’ అని కళ్లారా ఆ సంఘటనను చూసిన వారు చెప్పడం!అయితే, రామభట్టును బంధించి తీసుకుపోయిన రాజభటులు అయనను చెరసాలలో ఉంచలేదు. ప్రభువుల సమక్షానికి తీసుకొచ్చారు.
‘ఎంత ధైర్యం నీకు?’ త్రిభువనమల్లుడు తన ఎదుట నిలబడిన రామభట్టును చూస్తూ కోపంగా ప్రశ్నించాడు. ఏదో ద్యాసలో కలవరించి, ఆ కలను నిజమని భ్రమించి, మతి చెడి మా కోటకొచ్చి, మా దర్శనం కోసం పట్టు పట్టావ్. వస్త్రంపైన నీకు తోచింది రాసి, మాకు పంపే దుస్సాహసం చేశావ్? నీకు ఏ శిక్ష విధించాలి.. నువ్వే చెప్పు?’ ప్రభువుల వారి కోపతాపాలను చూసి భయపడలేదు రామభట్టు. నిర్వికారంగా చూశాడు. ‘ప్రభూ! నేను చూసింది కలలో కాదు. ఇలలోనే, ఇక్కడే, ఈ రాజ్యంలోనే. అదిగో ఆ కొండపైన వెలసిన నా స్వామిని, శ్రీ నారసింహావతార మూర్తిని కనులారా చూశాను’
‘ఓహో.. మరి అక్కడికి వెళ్లలేకపోయావా?’వ్యంగ్యంగా అన్నాడు చక్రవర్తి. ‘లేదు’ అన్నట్టుగా తలూపాడు.‘నువ్వు వెళ్లలేని ప్రదేశానికి మమ్మల్ని వెళ్లమంటున్నావా?’మౌనం సమాధానం.‘శ్రీ నారసింహుని దర్శనం మాకు లభిస్తుందని నమ్మకమేమిటి, దానికి నిదర్శనమేమిటి?’ రామభట్టు కండ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు త్రిభువనమల్లుడు.‘నేను మీకు పంపిన వస్ర్తాన్ని తెప్పించండి మహా ప్రభూ’ తక్షణమే, ప్రభువుల కనుసైగతో వస్త్రం ఆయన ముందుకు తీసుకొచ్చారు సైనికులు. రామభట్టు ఆ వస్ర్తాన్ని కళ్లకద్దుకొని చెప్పాడు.. ‘నరసింహావతారం సద్యోజాతం. గర్భవాసక్లేశం లేకుండా, అంటే తల్లి కడుపున పుట్టకుండా.. అప్పటికప్పుడు సంభవించిన ప్రచండ అవతారం. అవతార వ్యవధి స్వల్పమయినా అనల్పమయిన శాశ్వతత్వాన్ని సాధించిన మహిమాన్విత రూపం- శ్రీ నారసింహం! సంకల్పమాత్రంతోనే అంతర్ధానమయ్యే మహా మార్మిక మాల- స్వామివారి లీల! మనం కోరితే కాదు. మనల్ని స్వామి పిలిస్తేనే మనకు దర్శన భాగ్యం. శ్రీ నారసింహ దేవుడి క్షణకాల దర్శనం కూడా మనల్ని జీవితాంతం కాపాడే సుదర్శనం అవుతుంది. అధికారం కాదు. అన్వేషణ ఒక్కటే మీ సందేహానికి సమాధానం!’
ఇంక చెప్పవలసిందేమీ లేదన్నట్టు మౌనం వహించాడు. భువనగిరి కోటపైన- సభా ప్రాంగణం కాకుండా.. ప్రభువుల వారు సేదదీరే ఉద్యాన వనంలో శిల్పకళా శోభితమైన నవనాగినీ నాట్య మండపంలో రాతి సింహాసనం పైన కూర్చుని ఉన్న ప్రభువు… రామభట్టు చేతిలో ఉన్న వస్ర్తాన్ని దీక్షగా చూశాడు. తన ముందు నిలబడి ఏదో అపస్మారక స్థితిలో ఉన్నట్టు కనబడుతున్న ఈ వృద్ధ్దుణ్ని ఎంతవరకు నమ్మాలి?అప్పుడు జరిగిందొక అద్భుతం.
చూస్తుండగానే.. ఆ వస్త్రం స్వయం జ్వలితమైంది. ‘ఓం నమో నారసింహాయ’ అక్షరాలు జ్వాలా తోరణంలా ప్రకాశిస్తున్నాయి. ఆ జ్వాలలకు రామభట్టు చేతిలోంచి వస్ర్తాన్ని వొదిలేశాడు.‘ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఎక్కుణ్నించి వచ్చిందో ఒక పెద్ద గరుడ పక్షి ఒక్క ఉదుటున ఆ వస్ర్తాన్ని ముక్కుతో అందుకొని, అంతే వేగంగా ఆకాశంలోకి వెళ్లిపోయింది. అది చూసి త్రిభువన మల్లుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆకాశమార్గంలో అతి వేగంగా పయనిస్తున్న గరుడ పక్షి, తన ముక్కుతో పట్టుకున్న ఆ జ్వాలా వస్త్రం- ఆ పగటి పూట కూడా ఆకాశంలో భగభగ మండుతున్న సుదర్శన చక్రంలా కనిపించింది. త్రిభువన మల్లుడు చూస్తుండగానే, ఆ జ్వాలా చక్రం అడవుల్లోని ఓ కొండమీదకు వెళ్లి అదృశ్యమైంది. అర్థమైంది. ఇది స్పష్టమైన సందేశం.తన దర్శనానికి రారమ్మని ఆ నారసింహుని పిలుపు.. ఆదేశం!‘రామభట్టు గారూ! మీరు కన్నది కల కాదు. మీరు చూసింది భవిష్యత్తు. తగిన సమయంలో మేమే ఆ కొండ ప్రాంతానికి వెళ్తాం. అక్కడున్న స్వామి వారిని దర్శించుకుంటాం. మహామంత్రీ! అందుకు కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేయండి. తక్షణమే మనం ప్రయాణానికి సంసిద్ధం కావాలి’రామభట్టు గారిని సగౌరవంగా వారి స్వగ్రామానికి పంపించారు. శ్రీ నారసింహుని కొండను స్వయంగా దర్శించడానికి కవి పండితుడు, విద్యాపతి ముహూర్తం కూడా నిర్ణయించాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే.. సాధారణ సంఘటన అవుతుంది కానీ, దైవ సంఘటన ఎలా అవుతుంది?
త్రిభువన చక్రవర్తి అన్వేషణా పర్యటనకు అంతా సిద్ధమైంది. పండిత మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ‘అడవిలో కొండ.. ఆ కొండపైన స్వయంభుగా వెలసిన పరమాత్ముడు. స్వప్నాలు, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు. నిజం ఏమిటో చెప్పలేవు. ఈ యాత్ర అభిలషణీయం కాదు. అనివార్యం కాదు. ప్రభువులు మరొక్కమారు ఆలోచించి, నిర్ణయం తీసుకుంటే ఉత్తమమని మా అభిప్రాయం’ పండిత మండలిలో ఒక వృద్ధ పండితుడు కరాఖండిగా వెలిబుచ్చిన అభిప్రాయం.‘ప్రభువులవారు. ఇది కూడా ఆలకించాలె. చతుర్దశ అరణ్యాల గురించి ప్రామాణికాలున్నాయి. వివరణలున్నాయి. నైమిక, బదరిక, దండక, చంపక, కామ్యక, బృందావన, కదళికా, గుహా, దేవతా, కేదార, ఆనంద, దారుక, వీక్ష.. ఇవికాక మహారణ్యం కూడా! కానీ రామభట్టు కలలు కన్న అరణ్యం గురించి మేమెన్నడూ వినలేదు’.. మరొక పండితుడు తాళపత్రాలు చూసి చెప్పాడు. ‘అయితే ప్రభూ! స్కాంద, నారదీయ పురాణాల్లో లక్ష్మీ నారసింహమూర్తుల ప్రశస్తి ఉంది. కానీ అది మన రాజ్యంలో ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు. మరొక విషయం. యువరాజు వారి ఆరోగ్యం అందోళనకరమని విన్నాము. నరసింహావతార మూర్తినే ముందు కనుగొని అర్చించాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయం కూడా ఉంది.’ ఆ పండితుని మాటలకర్థం ఏమిటో తెలియలేదు చక్రవర్తికి. ‘ప్రత్యామ్నాయమా?’ అంటే, నమ్మశక్యం కాని మాట విన్నట్టుగా ప్రశ్నించాడు. ‘అవతార విభజన..ఆరాధన, నవగ్రహాలనుబట్టి కూడా చేయవచ్చునని బృహత్ పరాశర శాస్త్రం చెప్తున్నది. అవేమిటంటే..
‘రామావతార సూర్యస్య
చంద్రస్య యదు నాయకః
నృసింహా భూమి పుత్రస్య’
అనగా రామావతార అంశ సూర్యునిలో, కృష్ణావతారం చంద్రునిలో.. నారసింహావతారం కుజునిలో.. అనుసంధానమై ఉంటుంది. వీరికి సంబంధించిన అవతార స్తోత్రం చేస్తే అదే ఫలితం చేకూరుతుందని, విజ్ఞుల అభిప్రాయం. మీరు పునరాలోచించాలని మా వినయ పూర్వక విన్నపం’.
త్రిభువన మల్లుడు ఆలోచనలో పడ్డాడు. శాస్ర్తాన్ని అనుసరించాలా? స్వామిని అన్వేషించాలా? రాజ్య సంక్షేమం కోసం స్వామి దర్శన భాగ్యాన్ని సాధించాలా? కాలహరణం, శ్రమెందుకని భయపడి రాజీ పడాలా? నారసింహుని దర్శనభాగ్యం అసలు తన జీవితకాలంలో పొందగలడా?
‘లేదు. ప్రభూ! తమ పర్యటనకు,అన్వేషణకు అవకాశం లేదనే అనిపిస్తున్నది. మన్నించాలి’ అప్పుడే సభలోకి ప్రవేశించిన మహామాత్యుడు స్పష్టంగా ప్రకటించాడు.
‘కారణం?’
‘ముంచుకొస్తున్న యుద్ధం ప్రభూ!’ విష్ణువర్ధనుడు తన సర్వ సైన్యాలతో సరిహద్దు దాకా వచ్చాడు. ఉపేక్షిస్తే.. పెద్ద ఉపద్రవమే సంభవిస్తుంది. ప్రభువుల యోచన, కార్యాచరణ కోసం మేమంతా సర్వసన్నద్ధమై ఎదురు చూస్తున్నాం’.. ‘శ్రీనారసింహుని దర్శనం మాకు లభిస్తుందని నమ్మకమేమిటి, దానికి నిదర్శనమేమిటి?’ రామభట్టు కండ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు త్రిభువనమల్లుడు.త్రిభువన మల్లుడు ఆలోచనలో పడ్డాడు. శాస్ర్తాన్ని అనుసరించాలా? స్వామిని అన్వేషించాలా? రాజ్య సంక్షేమం కోసం స్వామి దర్శన భాగ్యాన్ని సాధించాలా? కాలహరణం, శ్రమెందుకని భయపడి రాజీ పడాలా? నారసింహుని దర్శనభాగ్యం అసలు తన జీవితకాలంలో పొందగలడా?
‘అయితే ప్రభూ!
స్కాంద, నారదీయ పురాణాల్లో నారసింహుని ప్రశస్తి ఉంది. కానీ అది మన రాజ్యంలో ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు. మరొక విషయం. యువరాజు వారి ఆరోగ్యం అందోళనకరమని విన్నాము. నరసింహుని ముందు కనుగొని అర్చించాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయం కూడా ఉంది.’ ఆ
పండితుని మాటలకర్థం ఏమిటో తెలియలేదు చక్రవర్తికి. ‘ప్రత్యామ్నాయమా?’ అంటే, నమ్మశక్యం కాని మాట విన్నట్టుగా ప్రశ్నించాడు.
(మిగతా వచ్చేవారం)