Diwali 2023 | పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని అతిథిగా స్వర్గానికి వెళ్తాడు. ఆ ఆతిథ్యానికి మెచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని దేవేంద్రునికి కానుకగా ఇస్తాడు. కానీ, ఇంద్రుడు తిరస్కార భావంతో ఆ హారాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేస్తాడు. హారం మహిమ తెలియని ఐరావతం.. దాన్ని కిందపడేసి కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహంతో దేవేంద్రుణ్ని శపిస్తాడు. దాంతో ఇంద్రుడు స్వర్గంతోపాటు అన్ని సంపదలనూ పోగొట్టుకుంటాడు. దిక్కుతోచని స్థితిలో విష్ణుమూర్తిని ఆశ్రయిస్తాడు. ఇంద్రుని పరిస్థితిని గమనించిన విష్ణువు.. “ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీమహాలక్ష్మి స్వరూపంగా పూజించు!” అని సూచిస్తాడు. దేవేంద్రుడు అలాగే చేస్తాడు. ఆ పూజతో సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో.. దేవేంద్రుడు తిరిగి స్వర్గాన్ని, పోగొట్టుకున్న సంపదలనూ పొందుతాడు.
అప్పుడే లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలుపుతూ.. “తల్లీ! నువ్వు కేవలం శ్రీమహావిష్ణువు దగ్గరే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?” అని అడుగుతాడు. దానికి సమాధానమిస్తూ లక్ష్మీదేవి.. “దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారివారి అభీష్టాలకు అనుగుణంగా.. అంటే మహర్షులకు మోక్షలక్ష్మీగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, నన్ను పూజించే విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మీ దేవిగా ప్రసన్నురాలిని అవుతాను!” అని చెప్పింది. అప్పటినుంచి దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.