‘శ్రీ కైవల్య పదంబుఁజేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవోద్రేకస్తంభకు..’ పోతన భాగవతం ప్రథమ స్కంధం- ప్రార్థనా రూపమైన ఆరుదళాల ఈ ప్రారంభ పద్యపద్మంలోని నాల్గవ దళం అష్టమ స్కంధంలో విశిష్టమైన ‘వామనావతార’ కథను ధ్వనింపజేస్తుంది. గురు వరబలంతో గర్వించి త్రుళ్లిపడుతున్న దానవేంద్రుడు బలి ఉద్రేకానికి కళ్లెం వేసి స్తంభింప చెయ్యడానికి దుష్టశిక్షకుడు, విశ్వరూపుడు అవామనుడైన విష్ణువు వామనుడైనాడు!
‘కాలం అనంతం ఇల-భూమి విశాలం’ అంటారు. కృత, త్రేతా, ద్వాపర, కలి- ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం. ఇలాంటి వెయ్యి మహాయుగాలు ఒక కల్పం. ఇది బ్రహ్మదేవునికి అతి అల్పం- ఒక పగలు. ఈ సుదీర్ఘకాలంలో పదునాలుగు మన్వంతరాలు క్షణాల వలె గడచిపోతాయి. సుమారు డెబ్బది ఒకటి మహాయుగాలకు ఒక మన్వంతరం. పదునల్గురు మనువులు పదవి అధిష్ఠించి, పాలించి, పెదవి విరుస్తూ దిగిపోతారు. ఈ అష్టమ స్కంధంలోనే శుకుడు ఆయా మన్వంతరాల విశేషాలను వివరించాడు. ఈ సందర్భంలో పోతన ప్రాసంగికంగా, మన్వంతరాలు, తరాలు మారినా తీరుమారని మనిషి పదవీ వ్యామోహ పరత్వాన్ని ఏ కాలానికైనా అన్వయించే విధంగా, అమూలకమైన ఈ కంద పద్యంలో అందంగా అభివర్ణించాడు…
కం॥ ‘ఒకపరి సూచిన వెండియు
నొకపరి సూడంగ లేక యుండు సిరులకై
యొక నొకని చేటు వేళకు
నొకఁడొక్కఁడు మనువుఁగాచి యుండు నరేంద్రా!’
శుక ఉవాచ- ‘పరీక్షిన్మహారాజా! ఒకసారి చూస్తే కనిపించి, మరొకసారి చూస్తే కనిపించకుండా- ఉనికి లేకుండా మాయమైపోయే సంపదల కోసం, ఒక్కొక్క మనువు అంతరించిపోయే- దిగిపోయే సమయానికి మరొక మనువు సిద్ధంగా కాచుకొని కూర్చుంటాడు.’ ఇలా సందర్భం దొరికినప్పుడల్లా సందు చేసుకొని భాగవత కథలకు ‘భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రాప్తి’యే చరమగతి అని గుర్తుచేస్తూ ఉంటాడు పరమభక్తుడు పోతన.
‘రాజా! ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పంలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో కశ్యప మహర్షి అర్ధాంగి అదితి గర్భాన మహావిష్ణువు వామనుడై అవతరించాడు. ఇంద్రుడికి తమ్ముడిగా- ఉపేంద్రుడయ్యాడు. పరమ భాగవతుడు ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. రాబోయే అష్టమ సూర్యసావర్ణిక మన్వంతరంలో కాబోయే ఇంద్రుడు. కాని, రాక్షస గురువు శుక్రాచార్యుడి ఆశీస్సులతో బలపడిన బలి తొందరపడి ముందుగానే ఏలుబడి కోసం స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలు దానవారిని శరణువేడగా, విష్ణువు వామనుడై వెళ్లి బలిని మూడడుగులు దానమడిగాడు. దానమిచ్చిన బలిని వనమాలి- విష్ణువు వరుణ పాశంతో బంధించాడు. అనంతరం అతనిపై అమితంగా అనుగ్రహం కురిపించి అతులిత వైభవోపేతమైన అమరావతిని (స్వర్గాన్ని) కూడా తలదన్నే సుతలలోకాన్ని సమకూర్చాడు. అందులో బలి ఎలాంటి వెతలు- ఇతర చింతలు లేక తాత ప్రహ్లాదునితో సుఖంగా ఉన్నాడు’ అని పలికిన శుకముని మాటలు విని అవనీపతి (రాజు) ఇలా అడిగాడు- ‘మహనీయా! మాధవుడు పూర్ణ పురుషుడు, ఆప్తకాముడు (నిష్కాముడు), రమాధవుడు- లక్ష్మీపతి, కదా! అట్టివాడు దరిద్రుని వలె బలిని మూడు అడుగుల భూమిని ఎందుకు అర్థించాడు? అడిగిన దానమిచ్చిన నిరపరాధి బలిని మాయా వడుగు- బ్రహ్మచారి మెచ్చకపోగా ఉపరి ఎందుకు బంధించాడు? ఇది వినాలని ఓ సుధీమణీ! నా మదిలో ఎంతో కుతూహలంగా ఉంది. వివరంగా వినిపించు..’
శుక ఉవాచ.. రాజా! అసుర రాజు బలి అమరేంద్రునితో సమరంలో అసువులు బాసి (మరణించి) శుక్రాచార్యుని సంజీవనీ విద్యతో బతికాడు. భృగు వంశీయులు యజ్ఞయాగాది క్రతు నిర్వహణలో అతి సమర్థులు. శిష్యుని గురుభక్తికి మెచ్చి భార్గవుడు- శుక్రుడు బలితో ‘విశ్వజిత్’ యాగం చేయించాడు. యాగఫలంగా బలికి అనేక శక్తులు లభించాయి. శక్తులు, సిద్ధులు ఉన్నవారు బుద్ధిమంతుల వలె హద్దులు మీరక ఉండలేరు. బల ప్రదర్శనకు, ప్రయోగానికి కూడా వెనుకాడరు. అసురపతికి అమరావతిపై పేరాస పుట్టింది. వెంటనే సమరానికి సిద్ధపడ్డాడు. బలపడి వచ్చి కాలయముని వలె మీదపడ్డ బలికి తాళలేమని గ్రహించి దేవతలు సమయోచితంగా తలలు వంచి నాకం (స్వర్గం) విడిచి ఇష్టమైన అనేక రూపాలలో అనువైన ప్రదేశాలకు వెళ్లిపోయారు. వైరి (శత్రు) వర్గం లేని స్వర్గాన్ని అసురపతి అనాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలను వశపరచుకొని చాలాకాలం పాలించాడు. బలి సంపాదించుకొన్న ఇంద్ర పదవిని స్థిరపరచడానికి శుక్రుడు అతనిచే అశ్వమేథ యాగాలు చేయించాడు.
దేవతలకు, దానవులకు, మానవులకైనా జీవితంలో ఆటుపోట్లు ప్రకృతి సిద్ధం! వేదాలలో వర్ణింపబడిన దేవాసుర యుద్ధాలు కూడా అనాది సిద్ధాలే. మనిషి మనసులో మంచి-చెడులకు సమంచితంగా సాగే సంఘర్షణకు సంకేతాలే ఈ సమరాలు. బలాబలాలను బట్టే జయాపజయాలు. ఒకసారి అమరులది పై చేయి అయితే, మరోసారి అసురులకు ఆధిక్యత!
స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్థానం. అధార్మికులు, దుష్టులు, ప్రాణిద్రోహులు, రహస్యంగా కీడు చేసేవారు, గర్విష్ఠులు, కాముకులు, లోభులు- ఈ ఏడు దోషాలు లేనివారే స్వర్గం చేరగలరు. బలి నాకలోకం పొందగలిగాడంటే ఇట్టి నిందలు అతనియందు లేకపోవడం వల్లనే కదా! ఈ సందర్భంగా విద్వత్కవి పోతన శ్లేషార్థయుతంగా, ముక్తపదగ్రస్తాది శబ్దాలంకార శోభితంగా, అద్భుతమైన స్వర్గలోకాన్ని సుదీర్ఘమైన గద్యలోకూడా పద్య పరిమళం గుబాళించే విధంగా వర్ణించి ప్రకాండ పండిత ప్రశంసలు పొందాడు. ‘ధిక్-ధిక్’- ఛీ! ఛీ! ఈ తుచ్ఛమైన స్వర్గసుఖాలు మీసాలపై తేనెల లాగా అల్పాలు, అనిత్యాలు అని తలచి హఠాత్తుగా అమరావతి విడిచి ఇంద్రాదులు పారిపోయారు కదా!’ అని స్వల్పమైన స్వర్గసుఖాల నుంచి అనల్పమైన అపవర్గ (మోక్ష) ఆనందం వైపు మనస్సు మళ్లేవిధంగా వైరాగ్యం కలగడానికి స్వర్గాన్ని ఇంత చిలవలు పలవలుగా అభివర్ణించడంలో ఆంతర్యమని భాష్యకారుడు శ్రీధరుని అభిప్రాయం. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006