శ్రీ శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! బలి చక్రవర్తి దేశ, కాలాలను కీర్తించి, ధర్మపత్మీ సమేతంగా దాన సంకల్పం చేసి వామనుని అర్చించాడు..
శా॥ ‘విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే
ద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి’ యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి బ్ర
హ్మ ప్రీతమ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁగన్
చేతులు సాచి ప్రీతిపూర్వకంగా ఇలా పలికాడు.. ‘విప్రుడవు, విఖ్యాత- ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల విధి విధానాల ప్రామాణికత విశేషంగా తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేలను దానమిస్తున్నాను’. పరమపురుషుడు పరమాత్మకు ప్రీతి కలుగుగాక!- అంటూ వెంటనే ధారపోశాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది.
శిష్యుని యందు అపారమైన వాత్సల్యం కలిగిన శుక్రుడు అంతిమ ప్రయత్నంగా అంబు (జల)ధార పడకుండా కలశ- కొమ్ము చెంబు రంధ్రానికి అదృశ్యరూపంలో అడ్డుపడి ఆపివేశాడు. అది గ్రహించి వామనుడు దర్భకొనతో పొడవగా శుక్రునికి ఒక కన్ను పోయి ఆయన ఏకాక్షి అయ్యాడు. ఈ సందర్భం సంస్కృత భాగవతంలో లేదు. బృహన్నారదీయ, నృసింహ, వామన పురాణాల నుంచి పోతన స్వీకరించాడు. దొడ్డపని- పుణ్యకార్యానికి అడ్డు తగలడం బహు చెడ్డ దోషమని- కనుగుడ్డు కూడా పగిలిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు చక్కని గుణపా ఠం! బలి అసురుడైనా తన అపూర్వ త్యాగంతో అచ్యుతుని తన అంతఃపుర ద్వారపాలకునిగా చేసుకొన్నాడు. అసుర గురువు పం డితుడైనా తన నిందనీయమైన కర్మతో అందమైన కన్నే పోగొట్టుకున్నాడు! గురువు అసుర గురువైనా శిష్యుడు అమర శిష్యుడయ్యాడు!
శుక ఉవాచ… రాజా! బలి దానానికి దిక్కులన్నీ జయజయ ధ్వానాలతో పిక్కటిల్లాయి. పంచభూతాలు అంచితమై (పూజింపబడి) ‘బళి-బళి’ అని బలిని ప్రస్తుతించాయి. మాయా బ్రహ్మచారి హరి ఇలా నుడివాడు- ‘బలీ! నేనీ దానం ఎందుకు అడిగానని మనస్సులో అలజడి పడకుండా ఇవ్వు. భూదానానికి మరే దానమూ సమానం కాదు. భూమి దాతకు, ప్రతి గ్రహీతకు పాతకాలన్నీ నశించిపోతాయి. ఈ మూడడుగులు ఇస్తే మాకు ముజ్జగాలూ ఇచ్చినట్లే!’ వడుగు నుడువు (మాట)లకు కడు సంతోషించి బలి..
ఆ॥ ‘పుట్టి నేర్చు కొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధులిట్టి పొట్టివడుగుఁ
బొట్టనున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చెనపుడు’
ఈ పొట్టివాడు ఈ చిట్టి బుద్ధులను పుట్టిన పిదప నేర్చాడో! పుట్టక ముందే నేర్చుకొన్నాడో! ఇతని పొట్ట నిండా పుట్టెడు మాయలు గదా! అంటూ ఆనందంగా భూ దానం చేశాడు. బలి ఔదార్యాన్ని పొగుడుతూ దేవతా బృందాలు పూల వానలు కురిపించాయి. విబుధుల (దేవతల) విజయ దుందుభులు మోగాయి.
పరీక్షిన్మహారాజా! పాణి (చేతి)లో పావన దానజలం పడగానే వామనుడు అవామనుడవటం ఆరంభించాడు. వామనుడుగా విశ్వాన్ని ఆవరించలేడు కదా! అందుకే ఈ సంవర్ధనం- పెరుగుదల! అణువు బృహత్ (అనంతం) అవబోతున్నది. సూక్ష్మం స్థూలం కాబోతున్నది. ఉత్తరా కుమారా! బిందువు సింధువుగా మారబోతున్నది. ఒద్దికగా ఉన్న వామనుడు కొద్దికొద్దిగా ఎదిగాడు. హద్దులు మీరాడు..
శా॥ ‘ఇంతింతై, వటుఁడింతయై, మరియుఁ దానింతై, నభోవీధిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై’
‘రాజా! ఇంతవాడు అంతవాడయ్యాడు. అంతవాడు మరింత వాడయ్యాడు. అంతకంతకూ వింతగా అనంతంగా పెరిగిపోతున్నాడు. అవక్ర పరాక్రమంతో క్రమక్రమంగా ఆకాశం కన్నా, అభ్ర (మేఘ) మండలం కన్నా, ఆదిత్య ప్రభా (కాంతి) రాశి కన్నా మిన్నగా పైకెదిగాడు. అవధులు అతిక్రమిస్తూ విధు- చంద్ర మండలం దాకా, ఆపై ధ్రువ నక్షత్రం వరకూ, మహర్లోక, సత్యలోకాల వరకూ మితిమీరి ఇంతా అంతా అనక బలి అహంకారానికి ఇతి శ్రీ పలుకుతూ బ్రహ్మాండమంతా ఆవరించాడు! మూలంలో ‘వామనం రూపమవర్థతాద్భుతం’ (వామనుని రూపం అద్భుతంగా వృద్ధి చెందింది) అని మాత్రమే ఉంది. దానికిది అమాత్యుడు ఇంపుగా చేసిన మనోహరమైన పెంపుదల! ‘ఇంతై, అంతై, ఇంతింతై, అల్లంతై’ అన్న అచ్చతెలుగు కొలమానపు నుడి, పలుకుబడిని వాడి, త్రివిక్రముడు వడివడిగా విక్రమించి విరాడ్రూపం సంతరించుకొన్న వైనాన్ని.. సొంతంగా, అర్థవంతంగా, సమర్థంగా వర్ణించాడు పోతన. పై వృత్తంలో శ్రవ్య కావ్యంగా, శ్రోత్ర పర్వం- వీనుల విందుగా రేఖామాత్రంగా చిత్రీకరింపబడిన వామనుని క్రమవృద్ధిని ఈ క్రింది మత్తేభ వృత్తంలో అమాత్యుడు అద్భుతమైన దృశ్యకావ్యంగా- వర్ణచిత్రంగా తీర్చిదిద్ది మనోనేత్ర పర్వం కావించాడు…
మ॥ ‘రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళా భరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్’
బలి దానానికి దిక్కులన్నీ జయజయ ధ్వానాలతో పిక్కటిల్లాయి. పంచభూతాలు ‘బళి-బళి’ అని బలిని ప్రస్తుతించాయి. మాయా బ్రహ్మచారి హరి ఇలా నుడివాడు- ‘బలీ! నేనీ దానం ఎందుకు అడిగానని మనస్సులో అలజడి పడకుండా ఇవ్వు. భూదానానికి మరే దానమూ సమానం కాదు.’
రాజా! అంబుజాసనా (బ్రహ్మా)ది దేవతల సంబురాల మధ్య అంబుజాక్షుడు వామనుడు అంబరాలను అతిక్రమించి పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో మార్తాండ (సూర్య) బింబం మొదటగా మాయా వడుగుకు గొడుగుగా అమరింది. పిమ్మట శిరోమణిగా, తర్వాత కిందికి దిగి శ్రవణాలంకారం- మకర కుండలంగా, ఆపై కంఠాభరణంగా, అటుపై పటుతరమైన బంగారు భుజకీర్తిగా, అనంతరం కాంతులీనే కర కంకణంగా, తరువాత మేఖలా ఘంటిక- మొలలోని గంటగా, ఆపై మేలైన పుణ్యాల పంట చరణ నూపురం- కాలి అందెగా, చివరకు వేదరూపుడైన మాధవునికి పాదపీఠంగా మారి ఆహ్లాదకరంగా మోదమందుతూ మార్తాండ బింబం సేదతీరింది! పరమాత్మ మాతృ (కొలచేవాడు), మాన (కొలత), మేయ (కొలవబడేది)ములు అనే త్రిపుటి లేనివాడు. అప్రమేయుడు- ఏ ప్రమాణాకికి, కొలతకు అందనివాడు, అనంతుడు. అట్టి త్రివిక్రముని క్రమవృద్ధిని అమాత్యుడు, కమల బాంధవ (సూర్య) బింబాన్ని కొలమానంగా గ్రహించి అమూలకమైన ఈ పద్యంలో అద్భుతంగా అభివర్ణించాడు. రాజా! మాధవుడు మేరలేని తేజస్సుతో మెరిసిపోతున్నాడు. బ్రహ్మాండం ఆయన మేను (దేహాని)కి మేలి ముసుగుగా- బంగారు చేలం గా వెలుగుతున్నది. విష్ణు భగవానుని విరాట్ విశ్వరూపంలో, స్వామి సకల అవయవాలలో బలి, సమస్త చరాచర ప్రాణి వర్గాన్ని అవికలంగా (తారుమారు కాకుం డా) అవలోకించాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006