సోమ (చంద్ర) సూర్య వంశాలలో స్వనామ ధన్యులైన- ప్రసిద్ధులైన మహారాజవర్యుల ప్రాభవ- పరిపాలనా వైభవ గరిమను, పరమ భాగవతుల మహిమను విశదపరచే నవమ స్కంధానికి నమోవాకాలర్పిస్తూ, ఇక భాగవత కల్పతరువుకి మూల స్కంధము, కృష్ణమూలమూ అయిన అసమాన దశమ స్కంధపు సుషమా- శోభా సుగంధాలను ఆఘ్రాణిద్దాం. శ్రీమద్భాగవతం శ్రీ కృష్ణ భగవానుని దివ్య మంగళ వాఙ్మయ విగ్రహం. అందు దశమ స్కంధం గోవిందుని చక్కగా వికసించి విప్పారిన ముఖారవిందం. పరిపూర్ణావతారంగా ప్రశస్తి కన్న శ్రీ కృష్ణ పరమాత్మ దివ్యనామ, రూప, గుణ, లీలా, ధామాల సుధార్ణవం- అమృతసాగరం. భగవత్ భాగవతుల భవ్య కథా కదంబం. బమ్మెర పోతన కావ్యశిల్పి ఇమ్ముగ చెక్కిన భాగవత శిల్పారామంలో దశమస్కంధం, మన భాగ్యం కొద్దీ దక్కిన, భక్తిరసాన్ని కుమ్మరించే చక్కని కళాఖండం. మూల భాగవతంలో మూడు ముప్పదుల (తొంబది) అధ్యాయాలలో శ్రీకృష్ణుని లీలలు ‘గోకుల బృందావన, మధుర, ద్వారక’- ఇలా మూడు విధాలా చాలా కూలంకషంగా వర్ణింపబడినాయి.
దశమ స్కంధ అనువాదానికి శ్రీకారం చుట్టుతూ పోతన పరిపాటి- పద్ధతిని పాటిస్తూ, స్కంధ ప్రారంభంలో తన ఆరాధ్య దైవం అరవింద నేత్రుని రామచంద్రునికి మాకందం లాంటి ఈ కంద పద్యంలో అందంగా ఇలా వందన మాచరించాడు..
కం॥ ‘శ్రీకంఠ చాప ఖండన!
పాకారి ప్రముఖ వినుత భండన! విలసత్
కాకుత్స్థ వంశ మండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!’
శివుని విల్లు విరిచి సీతాదేవిని చేపట్టిన జగజెట్టీ! ఇంద్రాది అమరులచే స్తుతింపబడిన సమర విద్యా వైభవాలు అమరినవాడా! విశదమైన ఖ్యాతితో విరాజిల్లు కాకుత్స్థ వంశానికి విభూషణమైనవాడా! విశ్వమంతా వ్యాపించిన కార్తీక పున్నమి వెన్నెల వంటి కీర్తి ప్రతిష్ఠలు కలవాడా! ప్రజలను ఉద్ధతుడై- గర్వితుడై శాసించక, ఉదాత్తుడై- దయాళువై ఉపాసించిన- రంజిల్ల చేసిన రాజచంద్రమా! రఘురామా! నీకు నీరాజనాలు!
సూతముని శౌనకాదులతో- మహర్షులారా! పరీక్షిన్మహారాజు శుకయోగితో ఇలా విన్నవించాడు- యోగీంద్రా! నీవు చంద్ర, సూర్యుల వంశాల విస్తారాన్ని, వానిలో జన్మించిన రాజచంద్రుల పరమాద్భుత చరిత్రలను చెప్పగా విన్నాం.
కం॥ ‘శీలము గల యదు కులమున
నేలా పుట్టెను మహాత్ముఁడీశుఁడు విష్ణుం
డే లీల మెలఁగె? నెయ్యే
వేళల నే మేమి సేసె? వివరింపు తగన్’
‘జగదీశ్వరుడు, మహాత్ముడు, పన్నగశాయి విష్ణువు శీలవంతమైన యదుకులంలో లీలా మానుష విగ్రహుడై ఏల జన్మించాడు? అలా పుట్టి ఆ వసుదేవ పట్టి (పుత్రుడు) ఎలా ప్రవర్తించాడు? ఏ ఏ వేళల్లో ఎట్టి ఘనకార్యాలు సాధించాడు? ఈ విషయాలన్నీ నాకు కళ్లకు కట్టినట్టుగా ఇంపుగా వినసొంపుగా వివరింపు’. గతంలో సంగ్రహంగా చెప్పావు. తృప్తి కలగలేదు. ఇప్పుడు విపులంగా చెప్పు స్వామీ! అని అర్థించాడు పృథ్వీపతి.
కం॥ ‘భవములకు మందు చిత్త
శ్రవణానందము ముముక్షుజన పదము, హరి
స్తవము పశుఘ్నుఁడు దక్కను,
జెవులకుఁ దని వయ్యెననెడి చెనఁటియు గలఁడే?’
‘గురువరా! కరివరదుడైన శ్రీహరి కీర్తనం భీకర సంసార రోగాన్ని హరించే సరి అయిన మందు. అది వీనులకు విందు. మనసుకు పసందైన పరమానందపు పొందు. ముముక్షువులకు ముక్తి నిధానం- కోరదగిన స్థానం. అలాంటి విష్ణు స్తవం విని ‘ఇక చాలు, మాకు తనివి తీరింది’ అని పలికే వెర్రివాడు ఉంటాడా? కసాయివాడు, కిరాతకుడు తప్ప మరొకడు అలా అంటాడా? శుక మునీ! దేవతలకు కూడా దాటరాని కౌరవసేనా సాగరాన్ని మా పెద్దలు పాండవులు ‘బాలపదము’గా- ఒక పిల్లవాని అడుగును వలె కడు సులభంగా దాట గలిగారు. ఏ నావ సాయంతో? మా తాతలకు మేనబావ అయిన వాసుదేవ భగవానుడే ఆ నావ! పాండవ వంశాంకురంగా నా తల్లి గర్భంలో ఉన్న నన్ను అశ్వత్థామ బాణాగ్నికి గురి కాకుండా ఆమె (ఉత్తర) కావమని వేడగా ఆ దేవ దేవుడే నన్ను కాపాడాడు! హలధర (బలరామ) సోదరుడైన ఆ జలజాత నేత్రుడే నా ఇలవేల్పు. ఆ ఆదిదేవ పద సేవయే ముక్తికి త్రోవ! మహామునీ! అట్టి పురుషోత్తముని పవిత్ర చరిత్రని నాకు సమగ్రంగా వినిపించు’ అని మరలా ఇలాగని అన్నాడు…
ఆ॥ ‘నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథా,
మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదలె,
వంత మానె, నీరువట్టు నాఁకలియును
దూరమయ్యె, మనము దొంగలించె’
‘మహర్షీ! నీ ముఖ పద్మం నుంచి జాలువారుతున్న హరికథ అనే సుధను తాగి తాగి నా తనువు పులకరిస్తోంది. నాకు అంత్యకాలం చెంతకు వస్తోందన్న వంత- దుఃఖం సాంతం అంతరించింది. ఆకలి దప్పుల చింత రవ్వంత కూడా లేకుండా పోయింది. నా మనస్సు పులకింతతో పరవళ్లు తొక్కుతోంది’ అని విన్నవించుకొన్న రాజు మాటలు విని శుకముని ఇలా అన్నాడు…
కం॥ ‘విష్ణు కథా రతుఁడగు నరు,
విష్ణుకథల్ చెప్పు నరుని, వినుచుండు నరున్
విష్ణు కథా సంప్రశ్నము
విష్ణు పదీ జలము భంగి విమలులఁ జేయున్’
‘రాజా! విష్ణు పాదాల నుండి ఉద్భవించిన గంగాజలం దర్శన, స్పర్శన, పానాలచే జనులను పావనం చేయునట్లు, విష్ణు కథా ప్రసంగం కూడా, దాని యందు ఆసక్తి కనబరచే వారిని, అనగా చెప్పమని అర్థించే వారిని, చెప్పే వారిని, శ్రద్ధగా వినేవారిని పునీతులను కావిస్తుంది’. మానవ నాథా! పూర్వం ఎందరో దానవులు పాలకులై నేలను ఆక్రమించారు. ఆ భారం మోయలేక భూదేవి గోరూపాన బ్రహ్మ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరుగా రోదించింది. భూదేవి, దేవతలు వెంట రాగా విధాత విష్ణువును దర్శించి, పురుష సూక్తంతో ప్రస్తుతించగా ఆయనకు సమాధి స్థితి కలిగింది. ఆ ధ్యానంలో విన్న విషయాన్ని విరించి వారికి ఇలా వివరించాడు.. అమరులైన మీరంతా మీ మీ అంశలతో యాదవ వంశంలో మేదిని- భూమిపై జన్మించండి. హరి సేవకై సురకన్యలు- దేవతా స్త్రీలు కూడా సుందర రూపాలతో వసుంధర- పుడమిపై పుడతారు. విష్ణువు వసుదేవుని గృహంలో పుత్రుడుగా అవతరించి, అవనీ భారం తొలగిస్తాడు. ఆదిశేషుడు అచ్యుతుని కళ- అంశతో ఆయన అన్నగారుగా అవనిపై ఆవిర్భవించగలడు.
ఆర్యాదేవి-యోగమాయ కూడా స్వామి కార్యనిర్వహణకై అవతరిస్తుంది! ఇలా భూదేవిని ఓదార్చి, బ్రహ్మ తన లోకానికి వెళ్లిపోయాడు. వసుదేవుని గృహమనగా కంసుని కారాగృహమే. భేద (ద్వైత) బుద్ధి స్వరూపురాలైన దితి పుత్రులే ధరణికి భారం. మేను (దేహము) నే ‘నేను’గా అభిమానించు హీన బుద్ధులే దైత్యులు- అశుభ వాసనలు. అంధకారం అంతరించాలంటే ఆలోకం- వెలుగు రావాలి. అజ్ఞానం తొలగాలంటే జ్ఞాన జ్యోతి వెలగాలి. అలాగే దేహాభిమానమనే దైత్యుడు నశించాలంటే దేవదేవుడు దేహమనే గోకులంలో, హృదయ బృందావనంలో అవతరించక తప్పదు. శుక ఉవాచ- ఆ కాలంలో శూరసేనుడు యాదవులకు శాసకుడు. మధురాపురం అతని రాజధాని. శ్రీహరి అవతరించగా ఈ మధురా నగరియే గిరిధరుని లీలా విభూతులకు ఆలవాలం- కేంద్రమైంది. జీవుల అంతఃకరణాన్ని- మనస్సును తన వైపు ఆకర్షించడమే అచ్యుతుని ఆనందమయ లీలల ప్రదర్శనకు ప్రధాన ప్రయోజనం. జీవునిలో లీనమై- అణగారి ఉన్న అవ్యక్త ఆనందాన్ని వ్యక్తపరచి- వెలికితీసి అనుభవానికి తెప్పించడమే లీలా పరమార్థం- ‘లీనం లాతి ఇతి లీలా!’ (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006