‘వేదాల్లో అన్నీ ఉన్నాయట!’ అని వెక్కిరించారు కొందరు. ‘వేదంలో ఏమీ లేవ’ని చప్పరించారు ఇంకొందరు. వేదాల్లో ఎన్నో ఉన్నాయి. చాలా కచ్చితంగా ఉన్నాయి. స్పష్టంగా ఉన్నాయి. అవి సర్వకాలీనమైనవి. సర్వజనీనమైనవి. సమాజహితమైన సత్యాలెన్నిటినో వేదాలు ప్రవచించాయి. ఆధ్యాత్మిక సాధనకు సోపానాలు నిర్మించిన వేదాలు.. సామాజిక ఉన్నతికీ మార్గాలు చూపాయి. పాలకుడి ధర్మాలను, పాలితుల కర్తవ్యాలను, రైతాంగ విధానాలను ఇలా అన్ని కాలాలకూ అన్వయించుకోగలిగే అత్యున్నత పరిష్కారాలను చూపాయి.
‘విద్’ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైన వేదం అంటే తెలుసుకోవడం అని భావం. దేనిని తెలుసుకోవాలి? దేనిని తెలుసుకుంటే భౌతిక జీవితంలో ప్రేయస్సు, పారలౌకిక జీవితంలో మరుజన్మ లేని శ్రేయస్సు లభిస్తుందో దానిని తెలుసుకోవడం. దేనిని తెలుసుకుంటే మరేదానినీ తెలుసుకోవలసిన అవసరం ఉండదో.. దానిని తెలుసుకోవాలని తపించారు రుషులు. ఆ మహనీయుల దార్శనికతలో వెలుగు చూసిన వేదవిజ్ఞానం మానవుల భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయం చేసింది. జగత్ కల్యాణానికి సారథ్యం వహిస్తున్నది. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు అంగాలతో కూడిన వేద సాహిత్యం సమస్త మానవ ధర్మాలను తెలుసుకునేందుకు మూలమైంది.
వేద సాహిత్యం రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు విభాగాలుగా కనిపిస్తుంది. ప్రతి విభాగంలోనూ కర్మ, తత్వం అని రెండు భాగాలు ఉంటాయి. కర్మ భాగం.. కర్మ స్వరూపమైన ధర్మాన్ని, తత్వ భాగం ఆత్మ తత్వాన్ని బోధిస్తాయి. రెండిటినీ సమన్వయం చేసుకోవడం వల్ల ప్రగతి, సుగతి లభిస్తాయని చెబుతున్నది వేదం. వేదాలు ముఖ్యంగా.. బ్రహ్మతత్వం, ఆధ్యాత్మికత, ఉపాసనా విధానాలు, మానవ నైతిక జీవన విధానం, సామాజిక సమరసత, త్యాగశీలత, మానవ సంబంధాలను గూర్చి ప్రవచించాయి. ధార్మిక చింతనకు అనుసరించాల్సిన విధానం, సామాజిక జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, వాటిని అధిగమించే విధానం, రాజకీయ, ఆర్థిక విధానాలను క్షుణ్నంగా చర్చించాయి.
వేదం మానవ నైజాన్ని తెలుపుతూ.. ‘ఒకడు కష్టపడుతూ బతుకుతాడు, మరొకడు కష్టపెడుతూ బతుకుతాడు, వేరొకడు కష్టమంటే తెలియకుండా బతుకుతాడు, ఇంకొకడు అన్నిటినీ విడిచి బతుకుతాడు’ అని విశ్లేషించింది. కష్టపడే వారిని సాధారణ మానవులుగా, కష్టపెట్టే వాళ్లను అసురులుగా, కష్టమెరుగని వాళ్లను దేవతలుగా, సర్వసంగ పరిత్యాగులను యోగులుగా చెపుతుంది వేదం. బుద్ధి శక్తి, భుజ శక్తి, ధన శక్తి, శ్రమ శక్తి ఈ నాలుగూ సమాజంలో అవసరమనీ అవి వరింపదగినవే కాని హరింపదగినవి కావని చెబుతున్నాయి వేదాలు. రాత్రింబవళ్లు, సుఖదుఃఖాలు.. ఇలా వైవిధ్యాలనేవి మానవ జీవితంలో అన్ని పార్శ్వాలలో మానవులను వెన్నాడుతూనే ఉంటాయి. ఈ ద్వంద్వాల వల్లే మానవ జీవన మధురిమ అనుభవంలోకి వస్తుంది.
నిర్భయం, మనో నిర్మలత, జిజ్ఞాస, జ్ఞానార్జనలో దృఢత్వం, ఏకాగ్రత, శీలసంపద, ఆత్మ నిగ్రహణ, త్యాగం, అవసరమైన చోట కఠినంగా వ్యవహరించడం, అహింస, సత్యనిష్ఠ, క్రోధాన్ని నిగ్రహించుకోవడం, ప్రశాంతత, సన్యసించడం, బలం, క్షమాగుణం, గర్వం లేకపోవడం.. లాంటి లక్షణాలను వేదం దైవీ గుణాలుగా చెప్పింది. అలాగే అహంకారం, ఆడంబరాన్ని ప్రదర్శించడం, మూర్ఖత్వం, హింసా ప్రవృత్తి లాంటి లక్షణాలను ఆసురీ గుణాలుగా విశదీకరించింది.
వేదం వ్యక్తిగత, సామాజిక జీవనంలో ఉండే వైవిధ్యాన్నీ, వాటి సంబంధాన్నీ ప్రవచించింది. సమాజం అనేది వ్యక్తుల సమ్మేళనమే కాబట్టి సమాజ ప్రగతికి ముందుగా వ్యక్తి నిర్మాణం జరగాలని చెపుతుంది వేదం. సామాజిక ప్రగతిలో వ్యష్టి (వ్యక్తి) ప్రగతి కూడా ఉంటుంది. వ్యక్తిగా సాధించే ఫలితాల కన్నా సమష్టిగా సాధించే ఫలితాలు ఎక్కువ అనే సత్యాన్ని వేదం గుర్తించింది. అందుకే సామాజిక చింతనపై దృష్టి పెట్టింది. సమాజంలో విభిన్న మనస్తత్వాల వ్యక్తులు ఉంటారు. వారి వారి అవగాహనలు, అవసరాలు, ఆచరణలు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి అందరినీ ఒక్క తాటిపై నిలిపేందుకు, సమష్టి తత్వాన్ని వారిలో నింపేందుకు.. కొన్ని నిబంధనలు వేద నిర్దేశితమయ్యాయి.
వేదం పారలౌకిక జీవితాన్ని, సామాజిక జీవనాన్ని సమన్వయ పరచుకునే విధానంలో వివాహ వ్యవస్థ ఆవశ్యకతను చెప్పింది. పాలకులు-పాలితులు ఎలా ఉండాలో కూడా స్పష్టంగా నిర్వచించింది. రాజనీతిని, పురోహితుల లక్షణాలను, మంత్రుల నియోగం, ప్రజానీకంలో ఐకమత్యం ఆవశ్యకత, పాలకులు పన్నులు విధించే విధానం గురించి చెప్పింది. అలాగే.. మానవ జీవన నిర్వహణకు ఉత్పత్తి ఉత్పాదకత అవసరం. వాటి నిర్వహణనూ వేదం ప్రస్తావించింది. వ్యవసాయ వివరాలను చెప్పింది. భూమిని ఎప్పుడు దున్నాలి, విత్తనం ఎప్పుడు నాటాలి తదితర అంశాలను ఉన్నతంగా
వివరించింది.
వేదాలలో మానవతా దృష్టి గురించి ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమస్యలు-సంక్షోభాలకు నిలయమైన భౌతిక ప్రపంచంలో జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలో చెబుతూ.. వ్యక్తి సమగ్ర వికాసానికి, సామాజిక సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తులను గుణవంతులుగానూ, వీర్యవంతులుగానూ నిలువమంటుంది. గుణవంతుడైన వ్యక్తి సమాజానికి సహాయకారిగా ఉంటాడు. వీర్యవంతుడు రక్షకుడిగా నిలుస్తాడు.
వేదం జీవితంలో నిరాశకూడదని, ఆశావాదంతో జీవించాలని, ఆశయాలను కలిగి ఉండటం, వాటిని సాకారం చేసుకునే మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమించాలని ప్రబోధిస్తుంది. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను దైవాన్ని నమ్ముకోవడం ద్వారా తొలగించుకోవచ్చని చెపుతుంది. పాలకులు, ప్రజలూ పరస్పర సహకార ప్రాతిపదికన ఒక్కటిగా జీవిస్తూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడమే ప్రగతిగా చెప్పుకోవాలి. తద్వారా దేశ అభ్యుదయం సాధ్యపడుతుందని చెపుతుంది. ‘భిన్నత్వంలో ఏకత్వం‘ వేదం ప్రబోధించే విధానం. సర్వ మానవ సమానత్వాన్ని సాధించేందుకు వేదం జాతీయ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగాలను ముఖ్యమైన వేదికగా గుర్తించింది.
మానవులకు స్వేచ్ఛ, రక్షణ ఈ రెండూ అవసరమైనవే! రక్షణ లేని స్వేచ్ఛకు ఉనికిలేదు. ఆ రక్షణ వ్యవస్థకు పాలన ప్రాణం లాంటిది. పాలకులు సమర్థులైన మంత్రులను, పురోహితులను, ఇతర అధికారులను నియమించుకొని పరిపాలించాలి. పాలకులు-పాలితుల మధ్య ఐకమత్యాన్ని సాధించడం అత్యంత ఆవశ్యకమని రాజధర్మం ఎలా ఉండాలో వివరించింది వేదం. రాజ్యం నడవాలి అంటే ధనం అవసరం. దానికి ప్రజలపై పన్నులు విధించాలి. ఆ పన్నులు ఎలా వేయాలి అనే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజలకు తాగునీరు, సాగునీరు సౌకర్యాలను కల్పించి పన్నులు వసూలు చేయాలని పాలకులకు నిర్దేశించింది.
అభివృద్ధికి వ్యవసాయం ప్రధాన వనరుగా భావించేవారు. సామాజిక భద్రత భౌతిక సంపదతో మాత్రమే సాధ్యమని నమ్మేవారు. వ్యవసాయం, వాణిజ్యం, వర్తకం, అప్పులు ఇవ్వడం తీసుకోవడం, వివిధమైన గృహ పరిశ్రమలు ప్రజల ఉన్నతికి దోహదపడతాయనే నమ్మకం ఆనాటి సమాజంలో ఉండేది. భూమిని సస్యశ్యామలం చేయకపోతే.. అది ఎడారిగా మారుతుందని వేదం చెపుతుంది. క్షేత్రం, కృషి, నాగలి, కొడవలి, భూమిని దున్నడం, విత్తనాలు నాటడం, ఎరువులు వేయడం, సమయానికి పంటను కోయడం, జాగ్రత్తగా భద్రపరచడం, శుభ్రపరచడం, అవసరాలకు వినియోగించుకోవడం… నదుల నుంచి కాలువలు తవ్వి పంటలకు అందించే విధానం వేదాలలో ఉన్నది. తాగునీరు, సాగునీరు అవసరానికి ఎలా వినియోగించాలో వేదం అత్యంత శాస్త్రీయంగా తెలియజేసింది. ఏనాటికైనా ఉపయుక్తమైన పలు సామాజికాంశాలను వేదం ఉదహరించింది. అందుకే వేదం సమకాలీనమూ, సార్వకాలికమూ అంటారు పెద్దలు.
…? పాలకుర్తి రామమూర్తి