రామలక్ష్మణ ద్వాదశి ప్రాధాన్యం ఏమిటో తెలియజేయగలరు?
– వై.ప్రాజ్ఞిక్ దత్త, హైదరాబాద్
Ekadashi | జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అనీ, చంపక ద్వాదశి అనీ అంటారు. వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడిని పూజించాలని సూత మహర్షి చెప్పినట్టుగా వరాహ పురాణ కథనం. ఈ సందర్భంగా జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన (శక్తి ఉన్నవారు) రామలక్ష్మణ విగ్రహాలను పూజించి, మర్నాడు అంటే ద్వాదశి నాడు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. ఆర్థికంగా శక్తిలేని వారు మట్టి ప్రతిమలను పూజించి కూడా దానమివ్వొచ్చు. శ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే, లక్ష్మణుడు ఆదిశేషుడి రూపం.
ఈ ఉభయులను ప్రత్యేకంగా ఆవాహన చేసి పూజించడం వల్ల గవామయన యాగం చేసిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట. ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చేయడాన్ని గవామయన యాగం అంటారు. కేవలం రామలక్ష్మణ ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల అంతటి గొప్ప పుణ్యం లభిస్తుందని ప్రతీతి. జగద్గురువు ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి గావించింది కూడా ఈ రోజునే! ఈ క్రమంలో ద్వాదశి నాడు ఆదిశంకరుల ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది.
…?శాస్ర్తుల రఘుపతి, 73867 58370