శుకుడు పరీక్షిత్తుతో… రాజా! ఒకనాడు తల్లి యశోద పెల్లుబికిన ప్రేమతో చేపు వచ్చిన పాలను ఒడిలో పరున్న నల్లనయ్యకు తాగించింది. ఆ కల్లిబొల్లి పిల్లవాడు అల్లరిగా చిరునవ్వుతో నిద్ర వస్తున్నట్టు మెల్లన లీలగా ఆవులించాడు. కొండగుహ వంటి వాని నోటిలో- అవని, ఆకాశం, జ్యోతిర్మండలం, సూర్యచంద్రులు, పంచభూతాలు, పయోధులు, పర్వతాలు, సర్వనదులు, చరాచర బ్రహ్మాండమంతా కనిపించింది. యశోద అరమోడ్పు కళ్లతో నివ్వెరపోయింది. ‘అమ్మా! నేను పాలు తాగుతున్నానంటే నాలో ఉన్న, ‘అంతస్థ్సం యస్య విశ్వం సురనర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః’- (విష్ణు సహస్ర నామ స్తోత్రం) నేనే అయిన విశ్వమంతా కూడా నీ స్తన్యాన్ని పానం చేస్తోంది’ అని సూచించడమే ఈ లీలా పరమార్థం.
జా! బలరామకృష్ణులు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నారు. తన ఈడు బాలురతో బాల్యక్రీడలు మరగి గోకులంలోని ఆ బాలగోపాలన్నీ చాలా చక్కగా ఆనంద డోలికలలో ఓలలాడిస్తున్నారు. వచ్చీరాని ముద్దుమాటల ముచ్చట్లతో పరమ సుఖానికి ఉన్న సరిహద్దులను చెరిపేస్తున్నారు. ‘నాన్నలూ! ఏదీ! నాట్యమాడండి’ అని ఇందు వదనలు- గోపికలు అంటే చాలు, వెంటనే కందువ- చతురతతో చేతులు, కాళ్లు అందంగా కదుపుతారు. వారిని ఆలోకించే- చూచే కొద్దీ గోకులంలోని లోకులందరికీ ఒక నిరాకుల- స్వస్థమైన తన్మయత్వం కలుగుతోంది. ఈ బాలలీలా వర్ణనంలో పోతన, భగవత్ వాసుదేవ తత్తాన్ని భాసురంగా ద్యోతన పరచే- ప్రకాశింపజేసే నూతన స్ఫురణ కల అమూలకాలైన అనేక అమూల్య కందాలను ఎంతో అందంగా వెలయించాడు…
క॥ ‘నగవుల నవిద్య పోఁడిమి
నగుబాటుగఁ జేయనేర్చు నగవరి యంతన్
నగు మొగము తోడ మెల్లన
నగుమొగముల సతులఁజూచి నగనేర్చె నృపా!’
రాజా! బాలకృష్ణుడు చిరునవ్వు చిందిస్తే జన్మజన్మల చాల దట్టమైన అజ్ఞానం ఒక్కపెట్టున నవ్వుల పాలైపోతుంది. విజ్ఞానం పుట్టుకొస్తుంది. అట్టి లోకాంతరంగుడు- సర్వజీవ అంతర్యామి అయిన శ్రీకాంతుడు ఇంతటి వింత బాలకుడై తనను చూచి నవ్వే- ఆనందించే గోపకాంతలను గాంచి రవ్వంత నవ్వడం నేర్చాడు. మాధవుడు మందహాసం చేస్తే ఏదో మాయ చేస్తాడని అర్థం! ‘ప్రసన్న వదనం ధ్యాయేత్’- స్వామి నగుమోమును, ముదా-మోదంతో సదాస్మరించాలి. ముకుందుని మందహాసం ‘శోకార్త శోషణం’- శోకాశ్రువులను శుష్కింపజేసేది- ఎండగట్టేది!
కం॥ ‘అవ్వల నెరుఁగక మువ్వురి
కవ్వల వెలుగొందు పరము డర్భకుఁడై యా
యవ్వలకు సంతసంబుగ
నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్’
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు- అనగా పరమార్థంలో క్రమంగా రజః, సత్త్వ, తమో గుణాలకు అతీతంగా విరాజిల్లే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు కాన తనకు ‘అమ్మ’ అని కూడా ఎవరూ లేనివాడు. అట్టి పరమపురుషుడు ఇప్పుడు రోహిణీ యశోదలకు గారాబు పట్టియై, వారికి ఆనందం కలిగిస్తూ, ఆ ముద్దుగుమ్మలను ‘అమ్మా! అమ్మా!’ అని పిలవడం నేర్చుకున్నాడు. పరమాత్మకు గర్భవాసం లేదని కృష్ణావతార సందర్భంలో చెప్పుకొన్నాం.
కం॥ ‘అడుగులు వేగలిగియు రెం
డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్’
శ్రీమహావిష్ణువు ‘సహస్రాక్ష స్సహస్రపాత్’- సహస్రపాదుడు. అనగా వేయి అడుగులు కలిగినవాడు. అయినా వామనుడు (పొట్టివాని)గా వచ్చి అవామనుడై రెండే అడుగులలో అవని (భూమి)నీ, ఆకాశాన్నీ ఆవరించినవాడు. అట్టి జగజెట్టి ఇప్పుడు నందుని పట్టియై- పుత్రుడై వచ్చి తప్పటడుగులు వేయడం నేర్చాడు. ఆ చిట్టివాడు గట్టిగా అడుగులు వేయడం చూచి దుష్టులు వంకర మాటలు కట్టిపెట్టి కడు భీతులై అడుగున పడి (అడుగంటి) పోయారు. ఈ సందర్భంలో శ్రీకృష్ణ కర్ణామృతంలోని లీలాశుకుని ముగ్ధమనోహరమై రసస్నిగ్ధమైన ఆలాపాన్ని- సూక్తిని తప్పక ఆలకించాలి… ‘శృణు సఖి కౌతుక మేకం నందనిఖేతాంగణే మయాదృష్టం, గోధూళి ధూసరాఙ్గో నృత్యతి వేదాంత సిద్ధాంతః’.. ఓ చెలీ! నందప్రభువు గేహ ప్రాంగణంలో- ఇంటి ముంగిట నేను భలేవింతను కనుగొన్నా. ఏమిటో తెలుసా? గోధూళిచే ధూసరితమైన దేహంతో నిగమాంతాలు- ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మ తత్త్వం నాట్యమాడుతోంది.
బలరామకృష్ణుల బాల్య క్రీడలు- లీలలు గోపాల సతులకు చాలా మధురంగా తోచేవి. ఆ తీపులు- మాధుర్యాలు మరగి అప్పాటల గంధలు (గోపికలు) ఇంటిని, ఒంటిని- మనసుకంటిన అన్ని బంధాలను మరచి ఆ చంటివారి ఆటలనే మక్కువతో కంటూ ఉండిపోయేవారు. ‘భజతే తాదృశీః క్రీడా యా శ్శ్రుత్వా తత్పరో భవేత్’ (రాజా! తన ఎట్టి క్రీడలను విని- విమర్శించి భక్తుడు అందు పారవశ్యాన్ని పొంది జ్ఞాని అగునో, భగవంతుడు అట్టి క్రీడ-లీలలతో కనువిందు చేస్తాడు) అని శుకముని వచనం. ప్రపంచ విస్మరణం, పరమాత్ముని అనుస్మరణం- ఇదే భగవల్లీలా శ్రవణానికి ఫలం! పూతనారి బాలశౌరి రోజురోజుకి నడవడం, మాట్లాడటంలో ఆరితేరాడు. తల్లులు రోహిణీ యశోదలు గోళ్లు, కొమ్ములు గల జంతువుల నుంచి, నీళ్లు నిప్పు ముళ్లు మొదలైన వాటి నుంచి పిల్లలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఎప్పటికప్పుడు కాపాడుకొనేవారు.
ఒకనాడు ముద్దుల కొడుకు కన్నయ్య వద్దు వద్దంటున్నా వినకుండా తిన్నగా వెళ్లి ఒక ఎద్దు కొమ్ములు పట్టుకున్నాడు. బంగారుని అది ఎక్కడ పొడుస్తుందో అని యశోదకు కంగారు! ‘భవిష్యత్తులో వృషభాసురుణ్ని అవలీలగా నిలవరించడానికి చేసే అభ్యాసమే ఇది’ (అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణచ గృహ్యతే-గీత) అని లీలా పరమార్థం! ఆ చిన్నివాని నీలి వన్నెలు చూచి వల్లవ (గోప) కన్నెలు తమ పున్నెముల పంటగా భావించి అన్య చింతలు మరచిపోయేవారు ఆ ధన్య జీవనలు.
కం॥ ‘వల్లవ గృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెరుఁగని భంగిం
దల్లిఁ గదిసి చిట్టాడుచు
నల్లన చను బువ్వఁబెట్టు మవ్వా! యనుచున్’
కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన, రాజ, హఠ యోగాదుల మాట ఎలా ఉన్నా గోకులంలో ప్రస్తుతం, పైకి హేయంగా తోచినా భావుక భక్తులకు, తత్తవిదులకు అత్యంత ధ్యేయ (ధ్యానించ తగిన)మైన స్తేయయోగం- చౌర్యలీల మాత్రం దిగ్విజయంగా సాగుతోంది. వ్రేత (గోపిక)ల ఇళ్లల్లో నవనీతాలు- వెన్నలన్నీ దొంగతనంగా తిని ఇంటికి వచ్చి ఏమీ ఎరుగనట్లు బుడిబుడి నడకలతో సవ్వడి చేయక తల్లివద్దకు వచ్చి నెమ్మదిగా ‘అవ్వా! (అమ్మా) ఆకలివేస్తోంది, బువ్వపెట్టవా?’ అని అడుగుతాడు.
రాజా! ఆ బాలగోపాలుడు గోపబాలకులతో కలిసి చాలా ఆటలు ఆడేవాడు. పూత చరిత్రుడైన పోతన రససిద్ధుడై అమలిన భక్తితో ఈ సీసపద్యంలో కమలేశుని- శ్రీకృష్ణుని తత్తాన్ని- స్వరూప స్వభావాలను ప్రజాయాస (భాషారీతి)లో పూసగుచ్చినట్లు అనాయాసంగా వర్ణించాడు…
సీ॥ ‘గోవల్లభుడ నేను, గోవుల మీరని
వడి రంకెవైచుచు వంగియాడు
రాజనే భటులు మీరలు, రండురండని
ప్రాభవంబునఁబెక్కు పనులు పనుచు
నేఁదస్కరుండ, మీరింటి వారని నిద్ర
పుచ్చి సొమ్ములు గొని పోయిడాఁగు
నే సూత్రధారి, మీరందరు బహురూపులని
చెలంగుచు నాటలాడఁబెట్టు
తే॥ మూల లురుకును, డాఁగిలి మూతలాడు
నుయ్యెలల నూఁగు జేబంతు లొనరవైచు
జారచోరుల జాడలఁ జాలనిగుడు
శౌరి బాలురతో నాడు సమయమందు…
‘మీరందరూ ఆవులు, నేను గోవల్లభుడను- ఆబోతుని’ అంటూ ఆబోతులా వంగి రంకెవేస్తాడు. ‘నేను రాజును, మీరు భటులు’ అంటూ వాల్లభ్యం- ఆధిపత్యం చూపుతూ వారిచేత ఎన్నో పనులు చెప్పి చేయిస్తూంటాడు. ‘నేను దొంగను, మీరు ఇంటి యజమానులు’ అంటూ వారి కంటిమీద కునుకు- నిద్ర నటింపజేస్తూ వారి ఉపకరణాలు- సొమ్ములను అపహరించి పారిపోయి దాక్కుంటాడు. ‘మీరు వివిధ పాత్రధారులు, నేను సూత్రధారిని’ అంటూ వారందరిచే అనేక వేషాలు వేసి ఆడించేవాడు. తాను మూలమూలల్లో దూరుతూ వారితో దాగుడు మూతలు ఆడించేవాడు. ఉయ్యెలలూగేవాడు. చేబంతులెగరేసేవాడు. జారుడుగా, చోరుడుగా నటిస్తూ, వారిముందు అవ్వారి- నిరంకుశంగా పలు పోకడలు పోయేవాడు’. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006