TTD news | సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను తలపించిన విధంగా నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయ భానుడి రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆధ్వర్యంలో భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల ఎస్వీబీసీ ట్రస్ట్కు ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. సంస్థ తరఫున ప్రతినిధి వై రాఘవేంద్ర ఈ విరాళంను అందజేశారు. విరాళం డీడీని తిరుమల బోర్డు కార్యాలయంలో ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. గతంలో కూడా ఈ సంస్థ తిరుమల ఆలయానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చింది.