జీవితం అంటే పరస్పర సంబంధాలు, కార్యాచరణ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి సాగేదే జీవుడి గమనం. కర్మానుభవాన్ని పొందడం కోసం అవ్యక్తమైన అపరిమితత్వం నుంచి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం ‘పుట్టుక’. భౌతిక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడం ‘మరణం’. గమ్యం, గమనం నిర్ణయమయ్యాక జరిగేది పుట్టుక. గమ్యం చేరాక పొందేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవచైతన్యం తన లక్ష్య నిర్దేశం కోసం పరితపిస్తుంది.
భారతీయ జీవన విధానం వ్యక్తులను ఉన్నతీకరించేందుకు ఉద్దేశించినది. ప్రతివ్యక్తి జీవితానికీ అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండటమే. ఆనందం జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ‘ఎలా ఉన్నదో అలా’ తీసుకోవడంలో ఉంటుందే కాని, ‘ఇలా ఉండాలి’ అనుకోవడంలో ఉండదు. ఎవరైతే జీవితంలో ఎదురయ్యే బాధాకర సన్నివేశాలను కూడా శక్తిమంతంగా పరివర్తన చెందించుకోగలరో వారే ఆనందంగా ఉంటారు.
ప్రతి వ్యక్తి జీవితానికీ ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తికీ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఎవరైతే తమ జీవిత ప్రయోజనాన్ని గుర్తించి దానిని సాధించేందుకు తమ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ప్రయత్నిస్తారో వారి జీవితం సార్థకమవుతుంది. ఇతరుల కోసం జీవించేవారే చిరంజీవులు. అలాకాకుండా ఇష్టాయిష్టాలకు బందీలై జీవన ప్రయోజనాలకు దూరమైన వారు రసహీనమైన బతుకులీడుస్తూ మృతప్రాయులు అనిపించుకుంటారు. నిజానికి ఎవరి జీవితమూ నల్లేరు మీది బండి నడక కాదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏవేవో సమస్యలు, అనుమానాలు, అనిశ్చయాలు, దుఃఖం, దుర్దశ, కంగారు, కలవరపాటు .. ఇలాంటివి ఎన్నో అనునిత్యం పలకరిస్తూనే ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో అధిగమించగలిగిన వ్యక్తి తన గమ్యాన్ని చేరుకుంటాడు. అలాంటి వారే జీవితాన్ని రసమయంగా తీర్చిదిద్దుకుంటారు.
వ్యక్తుల సమాహారమే సమాజం. జీవించడం అంటేనే పరస్పర సంబంధాలతో పయనించడం. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఏ ఒక్కరూ ఈ ప్రపంచంలో జీవించలేరు. ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం.. ఆ సంబంధాన్ని అన్వయించుకొని నిర్వహించే పనులే కర్మాచరణలు. అయితే, మన ఆలోచనలను బట్టి మనదంటూ ఒక సమాజాన్ని మనమే నిర్మించుకుంటాం! అసూయాపరులు, నిరాశావాదులు, ఉద్రేకస్వభావం కలిగిన వారు, హింసావాదులు.. వారివారి ఆలోచనల ప్రకారం వారు అలాంటి వ్యక్తులను ఆకర్షించి అలాంటి సమాజాన్నే నిర్మిస్తారు. మహాభారతంలో దుర్యోధనుడు తన చుట్టూ ఏర్పరుచుకున్న సమాజం అలాంటిదే! ధర్మరాజు నిర్మించుకున్న సమాజం ధార్మిక చింతనులైన వారిని ఆకర్షించింది. అలాగే రామాయణంలో కుంభకర్ణుడు, విభీషణుడు రావణుడి తమ్ములే అయినా కుంభకర్ణుడు అధర్మాభిముఖుడైన రావణుడిని అనుసరించగా, విభీషణుడు ధర్మాభిముఖుడైన శ్రీరాముడిని అనుసరించాడు.
‘నేను నాది’ అనే సంకుచిత ఆలోచనలకు బందీ అయిన ధృతరాష్ర్టుడు గుడ్డివాడైనా రాజ్యాధికారాన్ని తన కుమారులకు అందించాలని ఆశించాడు. అలా అనుకోవడం తప్పు కాదు! కానీ, అర్హత లేని వారికి కట్టబెట్టాలని భావించడం తప్పు. రాజ్యాధికారాన్ని ఆశించిన దుర్యోధనుడు ఈర్ష్య, అసూయలకు పుట్టినిల్లు లాంటివాడు. పాండవులను చంపి రాజ్యాధికారాన్ని సాధించాలని చూశాడే కాని తన ప్రతిభ, వ్యుత్పత్తులను పెంచుకొని రాజ్యాన్ని చేపట్టాలని చూడలేదు. అతని పక్కన చేరిందీ అసమర్థుడైన దుశ్శాసనుడు, మోసకారి అయిన శకుని, స్నేహధర్మమనే ముసుగులో అధర్మానికి వంతపాడిన కర్ణుడు తదితరులు. ఫలితంగా నిండు సభలో ద్రౌపదిని అవమానించడం.. తద్వారా మహాయుద్ధానికి తెరదీయడం జరిగింది.
దుర్యోధనుడు ఒక రాజు. అతని జీవితానికి ప్రయోజనం ప్రజల ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన నందించడం. కానీ, దుర్యోధనుడు పాండవులను అవమానించడమే పరమావధిగా భావించాడు! దానికి అతను ఎన్నుకున్న మార్గం నిండు సభలో ద్రౌపది వస్ర్తాపహరణ. ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఇష్టాయిష్టాలకు పెద్దపీట వేయడం వల్ల అపారమైన జన నష్టమైంది, వంశనాశనమూ జరిగింది.
ధర్మరాజు కూడా వ్యసనశీలత వల్ల సర్వస్వమూ కోల్పోయాడు. కానీ, తనలో వెలుగుచూసిన వివేచన కార్యాచరణకు మార్గం చూపింది. ధార్మిక చర్చలు, శక్తి సామర్థ్యాలను ఉన్నతీకరించుకునే విధానం, ఉన్న వనరులను వసతులను సద్వినియోగం చేసుకోవడం, సహనం, సౌశీల్యం, గతంలో సంపాదించిన అనుభవం, తద్వారా కలిగిన జ్ఞానం… దాని వల్ల కలిగే స్మృతి వెరసి సన్మార్గాన్ని చూపాయి. దాంతో అతను కృష్ణుడి వంటి ఉత్తమ నాయకుడిని, నారదాది మహామునులను ఆకర్షించగలిగాడు. కాబట్టి ఆ మార్గం అతణ్ని లక్ష్యానికి చేర్చింది.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అంటారు. అర్థకామాలు వ్యక్తి జీవితానికి అవసరమైనవే అయినా అవి ఎక్కడ ఆగిపోవాలో తెలుసుకోవడమే విజ్ఞత. ముక్తి (మోక్షం) అంటే సంపూర్ణంగా జ్ఞానం వికసించిన దశ. ధర్మాభిముఖమైన అర్థకామాల సాధనలోనే జీవితం సార్థకమవుతుంది. నిజానికి భౌతిక జీవన ప్రస్థానంలో అర్థకామాల సాధన మోక్షానికి దోహదకారే కానీ ఆటంకం కాదు. రావణుడు అధర్మంగా ఎందరినో భయపెట్టి వారి సంపదను హరించాడు. ఎందరో స్త్రీలను చెరపట్టాడు. స్వప్రయోజనాలకై అతని ఇష్టాయిష్టాలను సమర్థించుకుంటూ అధర్మచిత్తులైన రాక్షసులు రావణుడిని అనుసరించారు. తుదకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతమైన జీవన విలువల ఆధారంగా బతికిన వారు, జీవన లక్ష్యానికి అవసరమైన వనరులను ఆకర్షిస్తారు. విలువలతో కూడిన రాముడి జీవన విధానమే సుగ్రీవ, ఆంజనేయాది వానరుల స్నేహాన్ని సమకూర్చింది. అధర్మానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి రాముడి కోసం ఉద్యమించేందుకు సన్నద్ధులను చేసింది.
అనంతమైన కాలంలో పరిమితమైన జీవితకాలాన్ని సద్వియోగం చేసుకోలేకపోతే వ్యక్తి జీవితకాలం వృథా! కాలం అంటే గతం నుంచి వర్తమానం ద్వారా భవిష్యత్తుకు ప్రయాణం చేయడమే. వ్యక్తిలో ఆలోచనలు కూడా మన భావనలకు అనుగుణమైన మార్గాల ద్వారా పయనించి ఆచరణాత్మకం అవుతాయి. జీవిత ప్రయోజనాన్ని సాధించాలి అంటే శీలం, మానసిక పరిపక్వత, సమగ్రత, స్నేహం, ప్రేమ లాంటి లక్షణాలు మనలో ఉండాలి. ఇవన్నీ సాధారణ స్థితిలో ఉంటాయేమో కాని కష్టకాలంలో వీటిని నిలుపుకోవడంలోనే వ్యక్తి స్థితప్రజ్ఞత వెలుగుచూస్తుంది. బుద్ధితో ఆలోచించి, హృదయంతో పనిచేసేవారు జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటారు.
…? పాలకుర్తి రామమూర్తి