మేను చెలువం- అందంగా ఉండి మనసు మలినంగా ఉన్న మగువే పూతన. వేదాంత పరంగా స్వరూప జ్ఞాన విస్మృతికి కారణమైన అవిద్య- మాయే పూతన. ఈమెకు రామాయణంలోని తాటకతో పోలిక. రాగద్వేషాలే పూతన స్తనద్వయం. శబ్దస్పర్శరూపరస గంధాలనే విషయ వాసనా- సుఖభ్రాంతే అందలి విషం. అవిద్య- అజ్ఞానం నశించగానే దాని వల్ల కలిగిన అన్ని అనర్థాలు- వికారాలు, వాసనలు అంతమొందుతాయి.
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! నూతనంగా విచ్చిన జలజాతాల- కమలాల వంటి కన్నులు గల ఆలీలా బాల వెన్నుడు (విష్ణువు) కేవల విషాన్ని అపథ్యంగా భావించి, పాలు కుడిచే నెపంతో… దేవతలను, మునులను, పసికూనలను యాతనల పాలు చేసిన ఆ పూతన ప్రాణాలను అవలీలగా పానం చేశాడు. ఈ పూతనా మోక్షణ ప్రసంగంలో అనిమిషుని- బాలకృష్ణుని విషపానమనే మిషతో (నెపంతో) పోతన మహాకవి అందించిన, సాహితీ పరుల డెందాలను అలరించే ఈ కింది అందమైన కందపద్యం అతని స్వరంకష- విశేషమైన, కావ్యమనీష (ప్రతిభ)కు నికషోపలం-గీటురాయి.
కం॥ ‘విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికిని, విమల విష శయనునికిన్
విషభవ భవ జనకునికిని
విషకుచ చను విషముఁగొనుట విషమే తలపన్’
శుకుడు.. రాజా! విషసర్పాల దర్పాన్ని హరించే వైనతేయుని- గరుత్మంతునిపై విహరించేవాడు, గరళాన్ని గళంలో అనర్గళంగా నిలుపుకొన్న సర్వమంగళాపతి శర్వునికి (శివునికి) నిత్య సఖుడు, స్వచ్ఛమైన విషం- జలంపై స్వేచ్ఛగా శయనించువాడు. విషముల (నీళ్ల) నుంచి పుట్టిన పద్మంలో ప్రభవించిన పరమేష్ఠి- బ్రహ్మదేవునికి తండ్రి అయిన శ్రీహరికి ఒక దుష్టరాక్షసి చన్నులలోని విషాన్ని హరించడం ఒక పెద్ద విషమ- కష్టమైన విషయమా?
ప్రాణాలు కోల్పోయి నేల కూలిన ఆ పాడు రాకాసి పెన్నురము- విశాల వక్షఃస్థలంపై నిర్భయంగా ఆడుకుంటున్నాడు కన్నయ్య. గోపికలు ఆ చిన్నివాణ్ని ఎత్తుకొని పీడ వదలిపోవడానికి ఆ పాపడి చుట్టూ ఆవు తోక తిప్పారు. కేశవాది నామాలతో లోకేశునికి రక్ష కట్టారు. భావుక భక్తుడు ఇలా చమత్కరిస్తాడు… కన్నతండ్రీ! నీ కన్నా నీ చిన్ని నామంలో ఉన్న శక్తి ఎంతో మిన్న! నీవు మూడు లోకాలనూ రక్షిస్తున్నా నీ నామం నిన్నే కాపాడుతున్నది కదా!
మథుర నుంచి మరలి వచ్చిన నందాదులు నివ్వెర పోయారు. ఆ మాయావి కఠినమైన కాయాన్ని (దేహాన్ని) కుఠారాల (గొడ్డళ్ల)తో ముక్కలు చేసి, చందనపు చెక్కలు పేర్చి దహించారు. రాజా! అక్కజం! ఆ మగువ దేహం రగిలి పొగిలి కాలుతుంటే.. దాని నుంచి అగరు సుగంధాలు వెదజల్లే పొగలు వెలువడ్డాయి. ఎందుకో తెలుసా? బాలముకుందుడు దాని పాలతోపాటు కందువ (సామర్థ్యం)తో దారుణమైన విషాన్ని, ప్రాణాన్నే గాక దేహంలోని కల్మషాన్ని (మాలిన్యాన్ని) కూడా తాగేశాడు. వ్యాసపుత్రుడు శుకుడు ప్రాసంగికంగా భక్తి వైభవాన్ని పునరుక్తిగ పలుకుతున్నాడు…
కం॥ ‘వెన్నుని కొకమరి విషమగు
చన్నిచ్చిన బాలహంత్రి చనెనఁట దివికిన్
వెన్నునిగని పెంచుచుఁదన
చన్నిచ్చిన సతికి మరియు జన్మముగలదే?’
గోపాల బాలునికి ఒక్కమారు విసపు పాలు ఇచ్చిన ఆ పసిపాపల హంతకురాలు తిన్నగా స్వర్గానికి వెళ్లిందట! మరి వెన్నుని కన్నతల్లికి, చన్నిచ్చి పెంచిన తల్లి యశోదకు అపవర్గమే- మోక్షమే కాని మరల రూక్షమైన (పరుషమైన) జన్మ ఉంటుందా?
పూతనా మోక్షణం భగవంతుని వీర్య, ఔదార్యాలను నిరూపించే లీల! పూతన జాతిరీత్యా రక్కసి. చేతరీత్యా బాలఘాతిని. ఆహారమా పసిపిల్లల పచ్చినెత్తురు. కనీసం దాని నీతి- ఉద్దేశమన్నా మంచిదా? అంటే ఇంపైన వేషంతో చంపడానికి వచ్చింది. ఎలా? కాంచన (బంగారు) చాయ కలిగిన కామినిగా! పరమార్థం? ఈ కులమా? ఆ కులమా? అనికాక అనాదిగా అందరి గోకులాన్ని- ఇంద్రియ సమూహాన్నీ వ్యాకుల- క్షోభ పరచేవి రెండే- కామినీ కాంచనాలు! అంతవరకు నేత్రాలు తెరచి చూస్తున్న నవజాత- నూతన శిశువు- బాలకృష్ణుని కన్నులు పూతన రాగానే మూతపడ్డాయి. ఎందుకని? దీనికి వ్యాఖ్యాతలు అనేక హేతువులు ఊహించి, వర్ణించి ఆనందింపజేశారు. ‘నా దృష్టి సోకితే అవిద్య నిలువలేదు. అట్టిచో లీలా ప్రదర్శన ఎలా సాగగలదు?’ అని కాలరూపుడైన బాలకృష్ణుడు- ‘కాలుంగేలు నెరుంగకున్న కరణింగన్మోడ్చి గుర్పెట్టఁగన్’- కాలేదో కేలేదో (చెయ్యేదో) ఎరుగనంతగా నిద్రిస్తున్నట్లు కళ్లు మూసుకున్నాడు! ‘తల్లిగా వచ్చినదానిని చూస్తే (మాతృదేవోభవ! అని కదా వేదాజ్ఞ) ఇక చంపలేను. అందువల్ల లీలాసిద్ధి కల్ల కదా!’ అని కళ్లు మూశాడు. ఆలి (భార్య) రూపంతో పాలివ్వడానికి వచ్చిన ఈ మూర్ఖురాలిని చూడనని కావాలని కళ్లు మూసుకొన్నాడు. నీలకంఠుని ధ్యానించి, ‘స్వామీ! ఫాలాక్షా! నేను పాలు తాగుతాను. నీవు వచ్చి నీ పాలైన- భాగమైన కాలకూట విషాన్ని ఆరగించు’ అని అర్థిస్తున్నట్లు బాలకృష్ణుడు కన్నులు మూశాడు. శేష శయనుడు దాది వేషంలో వచ్చిన పూతనను విష రహితం గానే కాక, విషయ రహితంగా కూడా చేశాడు. (రసోవై సః) రసస్వరూపుని ఆశ్రయించిన విషం కూడా రస (అమృత)మయమైంది.
పూతన దేహం రగిలి పొగిలి కాలుతుంటే.. దాని నుంచి అగరు సుగంధాలు వెదజల్లే పొగలు వెలువడ్డాయి. ఎందుకో తెలుసా? బాలముకుందుడు దాని పాలతోపాటు కందువ (సామర్థ్యం)తో దారుణమైన విషాన్ని, ప్రాణాన్నే గాక దేహంలోని కల్మషాన్ని (మాలిన్యాన్ని) కూడా తాగేశాడు.
పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి తనయ (కుమార్తె) రత్నమాల. యాచనకై యజ్ఞశాలకు వచ్చిన వామన వటువుని చూచి ఆ భామ ‘ఇలాంటి తనయుడు తనకుంటే అతనికి పాలిచ్చి నేను ఆనందించగలను గదా’ అని పుత్రభావాన్ని పొందింది. భగవంతుడు తన భక్తుని పుత్రిక ఆంతర్యం గ్రహించి, ఆమె మనోరథం ఈడేరు గాక అని అనుగ్రహించాడు. ఆమే ద్వాపర యుగంలో రక్కస కులంలో పూతనగా జన్మించింది. టక్కరి వామనుడు తన తండ్రిని బంధించాడనే అక్కసుతో- అశుభవాసనతో ‘మాయా పసికూనను గుక్కెడు విసపు పాలతో చక్కచేస్తా- కడతేరుస్తా’ అని చన్నిచ్చి వెన్నుని ప్రసన్నుని గావించి ముక్తి పొందింది. భగవంతుడు భక్తుని అపరాధాలను కన్నెత్తి కూడా చూడడు. ఆయనకెప్పుడూ తన ‘భక్తవత్సల’ బిరుదే జ్ఞాపకముంటుంది. పూతన మనస్సులో కపటముంది. కపటియే కపటాన్ని కనుగొనగలడు. ఆదిదేవుడు నిష్కపటి. దాదిగా తన వద్దకు వచ్చిన ఆ వెలదిని సవతి తల్లిగా భావించి శ్రీపతి ఆమెకు అతి ఉత్తమగతిని ఇచ్చాడు.
పరమాత్మ… ఇనుమును బంగారంగా మార్చే ‘స్పర్శమణి’ లాంటివాడు. ఆ మణిని ఖండిస్తాననే- నడ్డి విరుస్తాననే దురుద్దేశంతో బలమైన ఒక ఇనుప కడ్డీ ఆ మణి మీద అడ్డంగా విరుచుకుపడ్డా, తన దివ్య స్పర్శచే ఆ మణి ఇనుప కడ్డీని కూడా బంగారుగా సింగారిస్తుంది కదా! ‘ద్వేషాదపి విద్విషాం తథా ప్రాప్తిః’- ఆదిశంకరులు. అలాగే దామోదరునితో ఎవడైనా ద్వేష- వైర మూలకంగానైనా సంబంధం పెట్టుకొంటే దానిని మోదంతో ఆమోదించి వానికి కూడా ముక్తినిస్తాడు ముకుందుడు! (సశేషం) పూతన దేహం రగిలి పొగిలి కాలుతుంటే.. దాని నుంచి అగరు సుగంధాలు వెదజల్లే పొగలు వెలువడ్డాయి. ఎందుకో తెలుసా? బాలముకుందుడు దాని పాలతోపాటు కందువ (సామర్థ్యం)తో దారుణమైన విషాన్ని, ప్రాణాన్నే గాక దేహంలోని కల్మషాన్ని (మాలిన్యాన్ని) కూడా తాగేశాడు.