మనిషి తరించాలంటే మూడు రుణాలు తీర్చుకోవాలంటుంది శాస్త్రం. అవే దేవ, పితృ, రుషి రుణాలు. దేవతలను ఆరాధించడం అంటే యజ్ఞయాగాదులు, జపతపాదులు చేయడం ద్వారా దేవరుణం తీరుతుంది. అలాగే వేద శాస్ర్తాల అధ్యయనంతో రుషి రుణం తీరుతుంది. మన పూర్వికులైన తండ్రి, తాత, ముత్తాతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం ద్వారా పితృ రుణం తీరుతుంది.
మరణించిన వ్యక్తి తిథి నాడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. తండ్రి మరణించిన తిథినాడు కొడుకు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతేమిటి? వారి కోసం శాస్త్రం ఓ మార్గాన్ని నిర్దేశించింది. కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదరి, సోదరులు మరణించి ఉండవచ్చు. పెళ్లయినా.. సంతానం లేక మరణించిన దంపతులూ ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు, యుద్ధాలలో ప్రాణాలు వదిలిన వాళ్లు, ఆత్మహత్య చేసుకున్నవాళ్లు, ప్రకృతి వైపరీత్యాల్లో కన్నుమూసిన వాళ్లు ఉండవచ్చు. అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చి.. వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం నిర్దేశించినవే మహాలయపక్షాలు.
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షాలు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని వారి వారసులు శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి వీటిని నిర్దేశించారు. వీటినే పితృపక్షాలు అనీ, అపరపక్షాలు అనీ పిలుస్తారు. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షాల ప్రధాన ఉద్దేశం.
మరణించిన వ్యక్తులను పూజించాల్సిన అవసరం ఉన్నదా? వారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మృతుని ఆత్మకు మనకు సంబంధం ఉన్నదా? జీవాత్మ ఏకకాలంలో మూడు శరీరాలను ఒకదానిపై ఒకటిగా ధరిస్తుంది. లోక వ్యవహారంలో మనకు కనిపించే శరీరాకృతులన్నీ స్థూల శరీరాలు. దీనిలోపల సూక్ష్మ శరీరం, దానిలోపల కారణ శరీరం ఉంటాయి. మరణించిన వ్యక్తి జీవాత్మ సూక్ష్మ కారణ శరీర సహితంగా ఏడాదిపాటు ఊర్ధముఖంగా పయనించి వసులోకాన్ని చేరుకుంటుంది. ఏడాదిపాటు విశ్రాంతి లేకుండా పయనించే ఆత్మను ప్రేతాత్మ అంటారు. ప్రయాణంలోని శ్రమ కారణంగా ప్రేతాత్మకు ఆకలిదప్పులు అధికంగా ఉంటాయి.
మాసికాలలో పెట్టే ఆహారంతో వారి ఆకలిదప్పులు తీరుతాయి. తృప్తి చెందిన ప్రేతాత్మ తన సంతానం తరతరాలు బాగుండాలని ఆశీర్వదిస్తుంది. సంవత్సరీకం కార్యక్రమంలో సపిండీకరణం జరుగుతుంది. తద్వారా ప్రేతాత్మ వసురూపాన్ని ధరించి వసులోకంలోకి ప్రవేశించగలుగుతుంది. పితృకార్యాన్ని చేసే కర్త శాస్ర్తోక్త నిష్ఠను ఏడాదిపాటు పాటించే అవకాశాలు ఈనాటి సమాజంలో లేవు కాబట్టి సపిండీకరణను పదకొండో రోజునే పూర్తి చేస్తున్నారు. మానవలోక ప్రమాణంలో ఒక సంవత్సర కాలం పితృలోక ప్రమాణంలో ఒక దినం అవుతుంది. మనం ఏడాదికి ఒక రోజున పెట్టే తద్దిన భోజనం పితృదేవతలకు అనుదినం పెట్టినట్లు అవుతుంది. ఈ విధంగా మరణించిన మన పూర్వికులు అందరినీ పూజించుకునే భాగ్యాన్ని కలిగించే పితృపక్షాలు నిజంగా పుణ్యదినాలే కదా!
సర్వ కారుణ్యం…
కాలం చేసిన వంశస్థులతో పాటు, పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా మహాలయ పక్షాల్లో తిలోదకాలతో పిండప్రదానం చేసే అర్హత, అధికారం కర్తకు ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణంతోనైనా తద్దినం పెట్టకపోతే.. ఆ దోషం మహాలయ పక్షాల్లో పితృవిధి నిర్వర్తిస్తే తొలగిపోతుందంటారు. ఈ పక్షాల్లో పితృదేవతలు ఆశతో తమ వారసుని ఇంటిని ఆవహించి ఉంటారని నమ్ముతారు. పితృవిధి నిర్వర్తించిన వారసుడిని మనసారా ఆశీర్వదించి, పిల్లాపాపలతో సంతోషంగా జీవించమని దీవిస్తారట.
…? శ్రీ