Yadadri Vaibhavam | జరిగిన కథ : శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే ఎన్నో మలుపులు. శత్రు రాజ్యం నుంచి కవ్వింపులు. పోరు తప్పదని అర్థమైపోతుంది. ఆ సంక్షోభ సమయంలో నారసింహుడు తన భక్తుడిని రక్షించుకున్న తీరు అమోఘం.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
యాదగిరీశుడి కొండ కోలాహలంగా ఉన్నది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. అందరికీ ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉన్నది.
త్రిభువనమల్ల చక్రవర్తి తన అజేయమైన భక్తితో శ్రీ నరసింహుడి అనుగ్రహం పొందడం, మృత్యుముఖం నుంచి తాను బయటపడటమే కాక యువరాజు సోమేశ్వరునికి దుష్టగ్రహదోషాలు అంటకుండా చూడటం.. ఇదంతా ఒక జరిగిన కథలాగా గాక, ఒక పురాణేతిహాసంగా నిలిచిపోయింది.
స్వామివారు కలలో కనిపించి..
“ఇదిగో ఈ గుహలో నేనున్నాను. మీ క్షేమం కోసమే భూమి మీద వెలిశాను.. నిలిచాను” అని తన దర్శనానికి నిదర్శనం చూపించిన భక్తుడు రామభట్టు కూడా భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి నిలబడి ఉన్నాడు.
‘ఇదంతా కలయా? శ్రీ లక్ష్మీ నరసింహుడి లీలయా?’ అనిపిస్తున్నది రామభట్టుకి. తను కలలో మాత్రమే స్వామిని దర్శించుకోగలిగాడు. కానీ, రాజ్యాన్నేలే రాజు కనుక భక్తుడైతే.. సాధ్యపడనిది ఏముంటుంది?
స్వామి మూలవిరాట్టును ఆశ్రయించుకొనే భక్తుల సౌకర్యార్థం ఒక ఆశ్రయం – ఆలయం ఏర్పడింది. ఆగ్రహజ్వాలా రూపం నుంచి అనుగ్రహ ప్రసన్న రూపానికి వచ్చి, వచ్చిన భక్తులను, వారి కోరికలను తీర్చేట్టుగా ఆశీర్వదిస్తున్నాడు స్వామి.
త్రిభువనమల్లుడు, ఆయన పట్టపురాణి చంద్రలేఖ, హొయసల రాజ్యాధీశుడు, భువనగిరి సామంతుడు విష్ణువర్ధనుడు, అనంతపాలుడు అందరూ అక్కడే ఉన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయింది.
ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం, ఆ తదుపరి ఆలయ ప్రవేశ శుభలగ్నం వేదమూర్తులైన పండితోత్తములచేత గణించబడి, నిర్ణయమైనాయి.
జ్ఞానేశ్వరుడు.. “నమో శ్రీ నారసింహా” అని బిగ్గరగా పలికాడు. అందరూ పరవశులై నరసింహనామం పలుకుతుంటే.. సముద్రఘోష లాంటి స్వర స్వలోమం అన్ని దిక్కులా ప్రతిధ్వనించింది.
ఎదురుగా స్వామివారి నూతన ఆలయం.
స్వామివారి అభయహస్తం లాంటి గోపురం.
ఆపైన సుదర్శనం!
వింతవింత వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి విస్మయంతో అడిగాడు యువరాజు సోమేశ్వరుడు.
“గురుదేవా! ఏమిటీ వింతచక్రం? ఎందుకీ కొండపైన ఉన్నది?”.
అడిగినవాడు సోమేశ్వరుడే అయినా, అందరిలోనూ ఆ సుదర్శన చక్రం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది.
విజ్ఞానేశ్వరుడు ఒక్కసారి కనులు మూసుకొని యాదర్షిని స్మరించుకున్నాడు.
ఆనాడు యాదర్షి స్వామివారి దర్శనం కోరి కొండపైన తీవ్రమైన తపస్సు చేశాడు. ఒక ఏకాదశి రోజు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి, పూజాదికాలు పూర్తి చేసుకొని, కొద్దిదూరం నడిచాడు. ఎప్పుడూ స్వామినే తలుచుకుంటూ ఉండేవాడు కనుక, యాదర్షి..
‘బయట నాకు దర్శనం ఆలస్యం చేస్తున్నాడు కనుక, కనీసం కలలోనైనా చూద్దాం’ అనుకొని కనులు మూసుకున్నాడు. అప్పుడే ఒక మహారాక్షసుడు చూశాడు.
‘ఎలాగైనా చంపి తినాలి’ అనుకుంటూ, అరుస్తూ ముందుకు ఉరికొచ్చాడు. భయంకరమైన అరుపు విని, కండ్లు తెరిచిన యాదర్షి.. రాక్షసుణ్ని చూసి.. “శరణు నారసింహా! శరణు” అన్నాడు. ఆయన ప్రార్థన దేవదేవుణ్ని చేరిందా అన్నట్లు ఒక పెను అలజడి ఏర్పడింది. మహావిష్ణువు చేతినుంచి సుదర్శన చక్రం బయల్వెడలి.. వేగంగా ఆ రాక్షసుడి తల నరికేసింది.
జ్వాలా చక్రమై యాదర్షికి దర్శనమిచ్చింది సుదర్శన చక్రం. సాష్టాంగపడ్డాడు యాదర్షి.
“నాయనా యాదర్షీ! స్వామిని మనసులో నిలుపుకొన్న మహాభక్తాగ్రేసరా! నీకేం వరం కావాలో కోరుకో” అన్న మాటలు వినిపించాయి. వెలుగులీనుతున్న ఆ సుదర్శన జ్వాలా చక్రం నుంచి!
“నాకు దివ్య దర్శనం ఇచ్చావు చాలు.. ఇకపైన స్వామి దర్శనం కోసం వచ్చేవారికి సుదర్శనం అభయమిచ్చి ఆదుకోవాలి. వారికి పట్టిన బాధల నుంచి విముక్తుల్ని చేయాలి” అని ప్రార్థించాడు.
“తథాస్తు”..
సుదర్శన చక్రం స్వామివారి పాదాలను స్పృశించి ఆకాశంలో నిలిచింది. ఆనాటి నుంచి దృశ్యాదృశ్యంగా ఈ ప్రాంతాన్ని సుశ్యామలము, సురక్షితమూ చేస్తున్నది. త్రిభువనమల్ల చక్రవర్తులవారికి దారిచూపిన దివ్యజ్యోతి కూడా ఇదే!” అన్నాడు విజ్ఞానేశ్వరుడు.
అందరూ సుదర్శన చక్రానికి నమస్కరించారు.
యాదర్షిణైవ ముక్తం – తద్విష్ణుచక్రం సుదర్శనమ్
తనూహపరయా ప్రీత్యా – ప్రీణయన్నివ చక్షుషా
* * *
విజ్ఞానేశ్వరుడు భక్తజనుల హర్షధ్వానాల మధ్య స్వామిని కీర్తించాడు.
సోమేశ్వరుడు గర్భాలయంలోకి ప్రవేశించి నరసింహుడి రాతి విగ్రహాన్ని చూశాడు.
నిప్పు కణికల్లాంటి తీక్షణమైన కనులు, జ్వాలలై ఎగిసిపడుతున్న కేసరాలు, భయంకరమైన ఆ మూర్తిని చూసి భయకంపితుడై, గట్టిగా అరిచి కనులు మూసుకున్నాడు సోమేశ్వరుడు.
అది చూసిన చంద్రలేఖ కొడుకును దగ్గరకు తీసుకున్నది.
“ప్రభూ!” అంటూ త్రిభువనమల్లుణ్ని చూసింది.
ఆమె ఆందోళన అర్థం చేసుకున్న త్రిభువనుడు, అర్చక స్వాములను చూస్తూ చేతులు జోడించాడు.
అర్చక స్వాములు స్తోత్ర పఠనం చేశారు.
నారసింహో, మహాసింహో దివ్యసింహో మహాబలః
ఉగ్రసింహో మహాదేవ స్తంభజశ్చోగ్రలోచనః
సర్వమంత్రైంక రూపశ్చ సర్వయంత్ర విదారణః
సర్వతంత్రాత్మ అవ్యక్త సువ్యక్తో భక్తవత్సలః
ఆ గర్భగుడిలో, గుహాంతరాలయంలో ఆ మంత్రాలు మరల మరల మార్మోగాయి. స్వామివారి పాదాల వద్ద ఒక వెండి బెత్తం కనిపించింది. దాన్ని దివ్య దండంగా భావించి, శరీరాన్ని ఆవహించిన భయ కల్లోలాన్ని పారదోలడానికి సోమేశ్వరుని మెడ వెనుక భాగంలో ఆ వెండి బెత్తంతో మూడుసార్లు కొట్టారు. ఒక్కసారిగా తనలోంచి అదృశ్య దుష్టశక్తి ఎగిరిపోయి, ఆవిరైనట్టు కనిపించింది సోమేశ్వరుడికి.
ఇంతలో మరొక దృశ్యం కూడా కనిపించింది.
హారతి వెలుగుల్లో స్వామివారి వదనం.. ఉగ్రంగా కాక ప్రసన్నంగా, మనోహరంగా కనిపిస్తున్నది.
“గురువర్యా! నా నరసింహస్వామి ఎంత బాగున్నాడో చూడండి. ‘నువ్వేది అడిగినా ఇప్పుడే ఇస్తాను’ అన్నట్టుగా అనిపిస్తున్నది” పట్టరాని సంతోషంతో పలికాడు సోమేశ్వరుడు.
“ప్రహ్లాదుడు ముందు అదే అనుకున్నాడు. వజ్రాల్లాంటి గోళ్లతో మహా ఉగ్రంగా ఉన్న స్వామిని నేను చూడలేకపోతున్నా. కానీ, ఎవరు చెప్తారు స్వామికి పరమ భయంకర ఆకారం నుంచి ప్రసన్న రూపానికి రమ్మని? అమ్మవారు లక్ష్మీదేవినే అడిగారు దేవతలూ, రుషులూ! అంతటి ఉగ్రరూపాన్ని చూసి, అమ్మవారే సంశయపడి, దూరంగా నిలబడి పోయింది. దేవతలు అమ్మవారిని సమీపించి..
“అమ్మా.. మీరే స్వామివారిని శాంతింపచేయగలరు” అంటే ముందుకు కదిలింది. మెల్లగా స్వామిని సమీపించి, సాష్టాంగ ప్రణామం చేసి, ప్రసన్నుడవు కమ్మని వేడుకున్నది. అభయప్రదాత అయిన స్వామివారు తన హృదయలక్ష్మిని చూసి, ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. తనలో సగమైన శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకొని బిగ్గరగా కౌగలించుకున్నాడు. తర్వాత దేవతలను, రుషులను చూసి చిరునవ్వు నవ్వి, తన భక్తుడైన ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకున్నాడు.
హారనూపుర కేయూర భూషణద్వైలంకృతః
నవ్యాంకస్థ శ్రియాయుక్తో రాజతే.. నరకేసరీ
హార – నూపుర – కేయూరాద్యపరిమిత భూషణాలతో అలంకృతుడై, తన అంకంపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని శ్రీ లక్ష్మీ ప్రసన్న నరసింహుడై అందరినీ అనుగ్రహించాడు. అంతేకాదు ఆయన శ్రీవత్స కౌస్తుభముగల వక్షస్థలం, వనమాలాలంకృతులతో అప్పుడే ఉదయించిన సూర్యకాంతి వంటి మకర కుండలాలతో అతి శోభాయమానంగా కనిపిస్తున్నాడు.
ఇటువంటి అద్భుతమూర్తిని పూజించినవాడు.. పుణ్య కార్యముల చేత పునీతుడై, ఈ లోకంలో అష్టయిశ్వర్యాలు, ఆ లోకంలో పరమపదమైన విష్ణు సాయుజ్యాన్ని అనుభవిస్తారు”.
విజ్ఞానేశ్వరుని మాటలకు అందరూ పులకించిపోయారు.
అదే శుభ సమయంలో విష్ణువర్ధనుడు, శాంతలాదేవి దంపతులు నరసింహుడికి మొక్కుతూ కోరికలు కోరుకున్నారు.
తమకు పండంటి బిడ్డ కావాలని.. ఆ బిడ్డ మగ పిల్లవాడైతే నరసింహుడి నామకరణ చేస్తామని, త్రాసులో తాము సరితూగే బంగారం స్వామి సేవకై సమర్పిస్తామని మనసులో అనుకున్నారు.
“ప్రహ్లాదుడు ముందు అదే అనుకున్నాడు. వజ్రాల్లాంటి గోళ్లతో మహా ఉగ్రంగా ఉన్న స్వామిని నేను చూడలేకపోతున్నా. కానీ, ఎవరు చెప్తారు స్వామికి పరమ భయంకర ఆకారం నుంచి ప్రసన్న రూపానికి రమ్మని? అమ్మవారు లక్ష్మీదేవినే అడిగారు దేవతలూ, రుషులూ! అంతటి ఉగ్రరూపాన్ని చూసి, అమ్మవారే సంశయపడి, దూరంగా నిలబడి పోయింది. దేవతలు అమ్మవారిని సమీపించి.. “అమ్మా.. మీరే స్వామివారిని శాంతింపచేయగలరు” అంటే ముందుకు కదిలింది. మెల్లగా స్వామిని సమీపించి, సాష్టాంగ ప్రణామం చేసి, ప్రసన్నుడవు కమ్మని వేడుకున్నది. అభయప్రదాత అయిన స్వామివారు తన హృదయలక్ష్మిని చూసి, ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. తనలో సగమైన శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకొని బిగ్గరగా కౌగలించుకున్నాడు. తర్వాత దేవతలను, రుషులను చూసి చిరునవ్వు నవ్వి, తన భక్తుడైన ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకున్నాడు.
తమ రాజ్యం మరింత అభివృద్ధిలోకి రావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని పంచ నారసింహుణ్ని ప్రార్థించారు.
ఆ తదుపరి వారి కోరికలు నెరవేరాయని చరిత్ర చెబుతున్నది. విష్ణువర్ధనుని భార్య శాంతలాదేవి సరిగ్గా సంవత్సరం తిరక్కుండానే మగ బిడ్డను కన్నది. రాజదంపతులు ఆ బిడ్డకు నరసింహుడని నామకరణం చేశారు. హొయసల శకంలో నరసింహునిదో ప్రత్యేక సమయం! దేవాలయాలు, ధర్మనిరతి, ధార్మిక ప్రవృత్తి ఇబ్బడి ముబ్బడిగా వెల్లివిరిసిన బంగారులమది.
యాదాద్రి దేవుడి అనుగ్రహంతో ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగాయి.
నమ్మకున్న ప్రతివాడూ నమ్మశక్యం కాని విజయాలే సాధించారు. వారిలో తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలు, కాకలు తీరిన యోధులు కాకతీయులు, ఎందరో మహారాజులు, చక్రవర్తులూ, కవులూ, కళాకారులు, వివిధ కాలాల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సేవించుకొని అత్యుత్తమ ఫలితాలు పొందినవారే!
ఎందరో వాగ్గేయకారులూ స్వామి నామాన్ని, మహిమలనూ గళమెత్తి గానం చేసినవారే. అందులో ఎన్నదగ్గ ఆధునిక గాయకుడు బుచ్చిదాసు.
యాదాద్రి విషయంలో చరిత్రను అవలోకిస్తే, కొన్ని విచిత్రమైన సంఘటనలు కనిపిస్తాయి. నరసింహుడి నిజవాసమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని నాటి భక్తుడు త్రిభువనమల్లుడు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ ప్రభువులు, సర్వజ్ఞ సింగ భూపాలుని వంటి సచ్చరిత్రులూ సంకల్పమూ, ప్రయత్నాలూ చేశారు.
కానీ, ఒక విషయం ఇక్కడ స్పష్టం.
‘ఏ గుడిని నిర్మాణం చేయాలా? ఏ గుడిని అభివృద్ధి చేయాలా?’ అని ఏ శ్రీమంతుడో, శక్తిమంతుడో అనుకోవచ్చు. కానీ అనుకున్నంత మాత్రాన అది ఆచరణలోకి రాదు.
దేవుడికి సంబంధించిన ఏ కార్యమైనా దైవానుగ్రహం లేకుండా ఆరంభమూ కాదు.. సంపూర్ణమూ కాదు. ఎంతవరకు దైవబలం ఉన్నదో అంతవరకే చేయగలిగాడు త్రిభువనుడు. తర్వాత వచ్చిన రాజులు కొంతకొంత చేయగలిగారేమో.. కానీ, పరిపూర్ణంగా చేయలేకపోయారు.
అంటే.. దాత దేవుడిని ఎంచుకొని దానం చేయలేడు. శక్తి ఉన్నా సరే!
దేవుడే.. తనకు సరిపోయిన జాతకుడైన దాతను ఎంచుకుంటాడు. ఆయనకే సంకల్పం కల్పించి, శక్తి యుక్తులను ప్రసాదించి అది ఫలించేటట్టు చూస్తాడు.
అందుకే, యాదాద్రి పునర్వైభవయోగానికి త్రిభువనమల్లుని అనంతరం వెయ్యేళ్లు పట్టింది.
ఇటువంటి సంకల్పయోగం ఉన్న భక్తాగ్రేసరులు, ఏఏ కాలాల్లో జీవించి ఉన్నా.. కాలం వారి సత్సంకల్పాలను ఏకం చేసి కొనసాగింపుగా చరిత్రలో వారిని సమస్థానంలో నిలుపుతుంది.
ఒక జ్వాలా తోరణంలాగా..
ఒక ముత్యాల సరం లాగా..
స్వామిని కీర్తించే శ్లోకంలోని పాదాల్లాగా, అక్షరాల వరుసలాగా!
ధీర్ఘకాలాల వ్యవధిలో కాలం కలిపిన సంకల్పయోగులు.. త్రిభువనమల్లుడు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ చక్రవర్తులూ, సర్వజ్ఞ సింగ భూపాలుడు. వీళ్లు ప్రజలకోసం పనిచేసిన రాజులు!
ఆధునిక కాలంలో ప్రజల కోసం పనిచేసి, వారి హృదయాల్లో స్థానం సంపాదించుకొని.. ప్రజలతో ఎన్నుకోబడిన పాలకుడు చంద్రశేఖరుడు!
అత్యద్భుత నిర్మాణాన్ని సంకల్పించి, నభూతో న భవిష్యత్ అనే విధంగా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతూ, శ్రీ నారసింహతత్వాన్ని చాటుతూ, వైభవోపేతమైన గొప్ప ఆలయాన్ని భక్త కోటికి అందిస్తున్న మన పాలకుడికీ, యాదాద్రి స్వామిని సేవించుకొనే ప్రతివారికీ అష్టయిశ్వర్యాలు, ఆయురారోగ్యాలు శ్రీ లక్ష్మీ నరసింహుడు ప్రసాదిస్తాడు. సామాజిక స్థాయిలో ఎలాంటి తారతమ్యం లేకుండా!
అందరికీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడి అనుగ్రహం లభించుగాక!
సర్వపాప ప్రశమనం సర్వదారిద్య్రనాశనమ్
అకాల మృత్యు హరణం – సర్వరోగ నివారణమ్
మంగళం నరసింహాయ యాదాచల నివాసినే
యాదర్షి భాగ్యలబ్ధాయ నిత్యశ్రీ నిత్యమంగళమ్
-:శుభం:-
…?అల్లాణి శ్రీధర్