చాలామంది ప్రపంచం మారాలని కోరుకుంటుంటారు. కానీ, వారు మారితే ప్రపంచం మారుతుందనే సత్యాన్ని గుర్తించరు. వ్యక్తి మార్పు సమష్టిని మారుస్తుంది. వ్యక్తి ఆలోచనా విధానం, వైఖరి, ప్రవర్తన, భావ వ్యక్తీకరణలు, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మార్చుకోగలిగితే ప్రపంచమూ మారుతుంది. నేను చేయలేననే ఆత్మన్యూనతా భావన, నేను సామర్థ ్యహీనుడననే అల్పత్వ భావన వ్యక్తిని నిర్వీర్యుడిని చేస్తుంది. తాను అనంత శక్తికి ప్రతినిధిననే భావన కలిగిన వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు.
వ్యక్తి జీవితం నాలుగు పార్శ్వాలలో సాగుతుంది. మొదటిది భౌతికం, రెండోది మానసికం, మూడోది భావోద్వేగం, నాలుగోది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికతలో త్యాగశీలత, నైతికత, సామాజిక సమరసత, మానవ సంబంధాల లాంటివి ప్రాధాన్యం వహిస్తాయి. శరీరం ఉంటేనే ఏ ధర్మాన్నైనా ఆచరించగలం కాబట్టి శారీరకంగా పటుత్వంతో ఉండాలి. అలాగే మానసిక సమతుల్యతను కలిగి ఉండాలి. సకారాత్మక ఆలోచనలు చేయాలి. భావోద్వేగపరంగా సమతుల్యతను సాధించ గలిగితేనే బంధాలు గట్టిపడతాయి. ఆధ్యాత్మిక పరంగా పరిణతి సాధించాలి. ఎలాంటి విపరీత పరిస్థితులు ఎదురైనా జీవితంలో పురోగతిని కలిగించే శక్తిని సంతరించుకునే అంతర్గత పార్శ్వమే ఆధ్యాత్మికత. నిజానికి ఈ నాలుగు సమాన స్థాయిలో సాధిస్తేనే భౌతిక జీవనంలో ప్రగతి, ఆధ్యాత్మిక జీవితంలో సుగతి సాధించగలుగుతాం.
ప్రతివ్యక్తీ విజయం కోరుకుంటాడు. విజయం అంటే సంపదను గడించడం కాదు. చేసే పనిలో సఫలతా కాదు. విజయం అనేది పరిపూర్ణత. బుద్ధిశక్తి, భుజశక్తి, ధనశక్తి, శ్రమశక్తి.. ఈ నాలుగింటి సమష్టితత్త్వమే భౌతిక జీవనంలో అభ్యుదయం. బాహ్యంగా సాధించిన అభ్యుదయానికి అంతర్గతమైన సంతృప్తి తోడైనప్పుడు లభించేదే విజయం. అభ్యుదయం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. సంతృప్తివల్ల అనంతమైన ఆనందాన్ని ఆస్వాదించే మానసిక సన్నద్ధత లభిస్తుంది. దానివల్ల జీవన గమనంలో అభివృద్ధి, అభ్యుదయం, విజయం లభిస్తాయి. దాని సాధనలో వ్యక్తిత్వం, శీలం రెండూ ఉన్నతమవుతాయి. అననుకూల సమయాలలో కూడా సకారాత్మక వైఖరిని కలిగి ఉండటం పరిణత వ్యక్తిత్వం కాగా… ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా స్వభావాన్ని మార్చుకోకుండా ధార్మికవర్తనతో ముందుకు సాగడం శీలం. ఈ రెండిటికీ విలువలు తోడైతే సంతృప్తికరమైన విజయాన్ని ఇస్తుంది. ‘సకారాత్మక వైఖరి’ తప్పకుండా విజయాన్ని ఇస్తుందని చెప్పలేం. కానీ, ‘నకారాత్మక వైఖరి’ మాత్రం ఓటమిని తప్పనిసరిగా బహూకరిస్తుంది. బాధలు వ్యక్తిలోని అంతర్గత శక్తిసామర్థ్యాలను ఉన్నతీకరించుకునేందుకు ఉపకరించేవే కానీ, నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశించినవి కావు. ఓడిపోకూడదని చేసే ప్రయత్నం కన్నా విజయం సాధించాలనే పట్టుదలతో చేసే ప్రయత్నం వ్యక్తి స్థాయిని పెంచుతుంది.
ఒక బెలూన్ ఆకాశంలో ఎగరాలి అంటే.. బాహ్యంగా దాని రంగు, రూపం ముఖ్యం కాదు కదా! అందులో నింపిన ‘గాలి’ శక్తి, సామర్థ్యాలు మాత్రమే. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన బాహ్య ప్రవర్తన సమున్నతంగా ఉంటుంది. మనలోని ఆధ్యాత్మిక పార్శ్వాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనలో సృజనాత్మకత, సమయస్ఫూర్తి, దార్శనికత, సమస్యలను అధిగమించే సామర్థ్యం, కష్ట సహిష్ణుత (ఓర్పు) పెరుగుతాయి. శాంతియుత మానసిక స్థితిని పొందగలుగుతాం. దాని సాధనలో ఆధ్యాత్మికవేత్తలు ఎనిమిది లక్షణాలను గుర్తించారు. అవేంటంటే..
1. సరళమైన ప్రవర్తన.. జీవన గమనంలో అనివార్యంగా మార్పును ఆహ్వానించడం. అననుకూల సమయంలో కూడా సకారాత్మకంగా ఆలోచించడం.
2. తన గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం.. ఆత్మపరిశీలన వల్ల తానేం చేయగలడో తెలుస్తుంది. తన పరిమితులు, పరిధులపై అవగాహన సాధ్యపడుతుంది. ఆత్మ పరిశీలన శక్తి చాలా గొప్పది.
3. జీవితంలో ఎదురయ్యే బాధలను, కష్టాలను ఎదిరించి వాటిని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం. దానినే మానసిక సమతుల్యతను సాధించడమని చెప్పుకొంటాం. మథనం లేక అమృతం లేదు. విషయాన్ని లోతుగా, విశాలంగా ఆలోచించి, మంచి చెడులు, సాధ్యాసాధ్యాలను, అడ్డంకులను, అనుకూలతలను పరిశీలించి సరైన కార్య నిర్వహణ ప్రణాళికతో ముందుకు సాగే వ్యక్తి మాత్రమే విజయ సాధకుడు అవుతాడు. ఈ ప్రక్రియలో ఎన్నో అవరోధాలు ఎదురవ్వొచ్చు. అవహేళనలను ఎదుర్కొనాల్సి రావొచ్చు, ప్రతిఘటనలు ఎదురుకావొచ్చు. వాటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన వ్యక్తి ఉదాత్తమతియై సంపూర్ణ విజయ సాధకుడిగా పరిణతి చెందుతాడు.
4. దార్శనికతను పెంచుకోవడం.. విలువలతో జీవించడం. తన గమ్యాన్ని లక్ష్యాన్ని ఎంత స్పష్టంగా దర్శించగలిగితే గమ్యాన్ని అంత త్వరగా చేరగలం. అలాగే విలువలు లేని జీవితం వలువలు లేని శరీరంలాంటిది.
5. ఇతరులకు వీలైనంత తక్కువ హాని కలిగేట్లుగా జీవించడం. ‘అహింసాపరమో ధర్మః’ అన్నారు. కానీ, మన జీవన గమనంలో మన వల్ల తెలిసీ తెలియక ఇతరులకు హాని కలగవచ్చు. దానిని ఎంత తక్కువగా చేయగలిగితే ఆధ్యాత్మిక ప్రయాణం అంత సౌకర్యవంతంగా సాగుతుంది.
6. సుఖదుఃఖాలను ద్వంద్వాలు అంటారు. అవి సహజమైనవి. జ్ఞానం, అజ్ఞానం కూడా ద్వంద్వాలే. జ్ఞాన సాధన వల్ల అజ్ఞానం నశించాలి.. జ్ఞాన సాధన ‘తెలివి’గా పరివర్తన చెందాలి. దాని వల్ల ‘ఎరుక’ కలగాలి. అలాకాక, ఎక్కడైతే జ్ఞాన సాధన అజ్ఞానాన్ని రక్షిస్తుందో అది ప్రమాదానికి దారితీస్తుంది. ఉత్తర దక్షిణ ధృవాలుగా కనిపించే ద్వంద్వాలను సమన్వయం చేసుకోవడమే ఆధ్యాత్మికత.
7. ప్రతి అంశాన్ని అనుమాన రహితంగా, మూలాల నుంచి సంపూర్ణంగా, సమగ్రంగా, వివరంగా తెలుసుకోవడం. సుప్తమైన బుద్ధిని జాగృతపరచుకోవడం ద్వారా మూలాలను అవగాహన చేసుకోగలం.
8. అవసరమైన వేళ సంప్రదాయాలకు భిన్నంగా పనిచేసే ధైర్యాన్ని కలిగి ఉండటం. ఆ ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకుల పట్ల అనుక్రియ కావాలే కాని ప్రతిక్రియ కూడదు. ఇలా ఆధ్యాత్మిక పార్శ్వాన్ని అవగాహన చేసుకొని సమర్థవంతంగా ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో విజయ సాధకులు అవుతారు… తరువాతి తరానికి మార్గదర్శకులుగా నిలుస్తారు….?
పాలకుర్తి రామమూర్తి