Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి వైకుంఠనాథుని అలంకారంలో పెదశేవ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగనీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. వాహనసేవ సందర్భంగా నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.