Maha Shivaratri | ఆ నామమే కాదు ఆ రూపమూ అపురూపమే. ఆ వేషంలో ఎంతో వైరుధ్యం. అంతలోనే వైవిధ్యం. పరమశివుడి ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం. ప్రతి అంశంలో ఓ సందేశం. మరెంతో పరమార్థం. అందుకే శివ రూపమే కాదు… ఆ భావమూ అపురూపమే. సాకారుడైనా, నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే.
పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ, ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. విభూది ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. వయసుడిగిన వృషభం.. వాహనం. మెడలో కపాలమాల. చేతిలో త్రిశూలం.
ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. ఇంతకన్నా సొగసైన వస్తువులేవీ స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది. లోతుగా ఆలోచిస్తే అసలు తత్వం బోధపడుతుంది. పైపైకి… మామూలు కండ్లతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కండ్లు మూసుకుని మనసు తెరచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.
పరమశివుణ్ని చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసులను అంతం చేసి, భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ మూడు కొనలు సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడు కొనలు పిడి దగ్గర కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం. యోగపరంగా చూస్తే త్రిశూలంలోని మూడుకొనలు మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు.
ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం దగ్గర కలుస్తాయి. ఇదే త్రివేణీ సంగమం. మూడుకొనలు మూడు నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది. వాటి ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది. త్రిగుణాల ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు ‘నేనీ త్రిగుణాలకు అతీతుడను’ అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు.. భూత, భవిష్యత్, వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్, స్వప్న, సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా పరమశివుడు తెలియజేస్తాడు. ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధి ఆత్మిక (ఆధ్యాత్మిక) తాపాలను త్రిశూలం పోగొడుతుంది.
మరొక అర్థంలో త్రిశూలంలోని మూడు కొనలూ కోరిక, చర్య, జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. ఇవే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. త్రిశూలానికి సంబంధించి ఆసక్తికరమైన పురాణగాథలూ ఎన్నో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడట. మొత్తం ప్రపంచం నాశనమైనా, ప్రళయం వచ్చినా కాశీకి ఎటువంటి ఆపదా కలగదని వరమిచ్చాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. అంతేకాదు అంధకాసురుడిని సంహరించే సమయంలోనూ త్రిశూలానిదే ప్రధాన పాత్ర. శివుడు రాక్షసుడిని సంహరించకుండా త్రిశూలానికి గుచ్చి ఉంచాడు. త్రిశూలానికి వేలాడుతున్న అంధకుడికి జ్ఞానోదయమైంది. శివుడు ఆ అసురుణ్ని క్షమించి తన ప్రమథగణాల్లో చేర్చుకున్నాడు.
హస్తసాముద్రికంలోనూ త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని ఆ శాస్త్రం చెబుతున్నది. శుక్ర స్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉంటారు. అంగారక స్థానంలో ఉన్న వ్యక్తులు విజయాలు సాధిస్తారు. చంద్ర స్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు శక్తిమంతమైన ఊహలు, సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలా మరెన్నో ఫలితాలను హస్త సాముద్రిక శాస్త్రం చెబుతుంది.
పరమేశ్వరుణ్ని చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన మూడో నేత్రం. నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో మూడోకన్ను అంటారు. ఈ త్రినేత్రం సాధారణ కన్నులా కనిపిస్తున్నప్పటికీ.. ఇది చూసేందుకు ఉపయోగించేది కాదు. ఇది జ్ఞాన నేత్రం. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది. ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం.
శివుడు మూడోకన్ను తెరిస్తే అంతా భస్మమే అంటారు. పార్వతీ కల్యాణం విషయంలో మన్మథుడు చేసిన పనికి కోపించిన శివుడు మూడోకన్ను తెరుస్తాడు. క్షణంలో బూడిద కుప్పగా మారిపోతాడు మన్మథుడు. ఇంతటి శక్తి మూడోనేత్రానికి ఉంది. ఇక్కడ కాలిపోయింది మన్మథుడనే వ్యక్తి కాదు అరిషడ్వర్గంలో ఒకటైన కామం. ఎప్పుడైతే మనలోని అజ్ఞానం దహనమవుతుందో అప్పుడు మిగిలేది జ్ఞానమే. అటువంటి జ్ఞాననేత్రాలకు మాత్రమే పరమేశ్వరుడి దర్శనం పొందే యోగ్యత కలుగుతుంది.
శివుడి సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్ధ చంద్రుడిని ధరించటమే శివుడి ఔదార్యాన్ని ప్రకటిస్తుంది. దక్షప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి భర్తపై ఫిర్యాదు చేస్తారు. దక్షుడు కోపంతో అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం పొందిన చంద్రుడు.. ఫాలనేత్రుడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటినుంచి శివుడు చంద్రశేఖరుడయ్యాడు.
పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండటం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశస్త్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధిష్ఠాన దైవం అని గ్రహించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. మనిషి సుఖ సంతోషాలన్నీ జాతక చక్రంలో చంద్రుడి సంచారం మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. కాబట్టి శివారాధకులకు అయాచితంగా చంద్రుడి అనుగ్రహం కూడా దక్కుతుంది. ఫలితంగా మనోైస్థెర్యం కలుగుతుంది. మంచి మనసు ధర్మకార్యాల మీద నిమగ్నమవుతుంది. అంతిమంగా దైవపదం చేరుకునేందుకు ఇదే పునాదిగా నిలుస్తుంది.
శివుడి చేతిలోని డమరుకం కేవలం వాద్యం మాత్రమే కాదు. తత్వ చింతనకు అదొక వేదిక. మనం రాస్తున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానమని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ఘటన ఒకటుంది. ఓసారి పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తున్నాడట.
నృత్తావసానే నటరాజరాజో నినాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శే శివసూత్ర జాలం॥
తాను చేస్తున్న తాండవ నృత్యం చివరలో శివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ సమయంలో 14 రకాలైన ధ్వనులు వెలువడ్డాయి. సనకాది మహర్షులు వీటిని గ్రహించారు. ఈ విధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని పై శ్లోకానికి భావం. నర్తనం చివర్లో చేసిన డమరుక ధ్వని సాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం వేశాడు. ఆ పద్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసుకొని ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉండటం వల్ల ఈ గ్రంథం ‘అష్టాధ్యాయి’గా ప్రసిద్ధి పొందింది. ఈ 14 సూత్రాలనే మహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుక దరువుల నుంచి ఉద్భవించిన మహేశ్వర సూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధం ఇదే. అందువల్లే శివాలయాలలో వ్యాకరణ మంటపాలు ఉంటాయి.
డమరుకం వాయించటానికి ముందుగా డమరుకం మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు. దానిని మణి అంటారు. డమరుకాన్ని కదిలించినపుడు మణి డమరుకానికి అటు ఇటు తగలటం ద్వారా డమరుకం నుంచి శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఆ శబ్దం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది.
ఆకాశంలో శబ్ద గుణకాలు ప్రయాణిస్తాయి. మనం ఏదైనా మంత్రాన్ని జపం చేస్తున్నా, స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నా వాటి నుంచి ఏర్పడే శబ్ద ప్రకంపనలు తరంగాలుగా మారి ఆకాశానికి చేరుకుంటాయి. అనంత ఆకాశంలో సంచారం చేసే శివ డమరుక ధ్వనులతో అవి సంయోగం చెందుతాయి. ఆవిధంగా సాధకుడికి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.
పరమేశ్వరుణ్ని చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న వాసుకి కనిపిస్తుంది. సర్పరాజు వాసుకి తపస్సు చేసి శివుణ్ని మెప్పించి ఆయనకు కంఠహారంగా మారాడు. నిరంతరం స్వామిసేవలో తరిస్తుంటాడు. కశ్యప ప్రజాపతికి ఉన్న పద్నాలుగు మంది పత్నుల్లో వినత, కద్రువలు కూడా ఉన్నారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం.
వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాల సముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని (గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యేండ్లు పరిచారికగా ఉండాలనీ, తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది.
ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే ఉండటంతో పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో పడుతుంది కద్రువ. తన కుమారులను పిలిచి ‘నల్లగా ఉన్న మీరు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాల’ని కోరుతుంది. దానికి వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదంటారు. దీంతో ఆగ్రహం చెందిన కద్రువ ‘భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు’ అని పుత్రులను శపిస్తుంది.
శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. గరుత్మంతుడు తన తల్లిని బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. కద్రువ మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన తల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోతుంది. రెండోవాడైన వాసుకి మహాశివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడలో ఆభరణంగా ధరించినవాడు కాబట్టి పరమేశ్వరుడు నాగాభరణుడు, నాగభూషణుడు అయ్యాడు.
శివుడు సర్పాల్ని ధరించటం వెనుక లోతైన సందేశం దాగి ఉంది. పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. శివారాధకులు కూడా అంత జాగరూకతతో ఉండాలనే సందేశం ఇందులో దాగుంది. శివుడి మెడలో మూడు చుట్టలు తిరిగి ఉండే సర్పం కాలచక్రానికి సంకేతం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే ఈ మూడు చుట్టలు. ఈ మూడు కాలాలతోనే సమస్తమైన ప్రపంచ చర్య జరుగుతుంటుంది. కుండలిని శక్తి సర్పాకృతిని పోలి ఉంటుంది. పాము గర్వానికి సూచిక. తన గర్వాన్ని ఎవరైతే గెలుస్తారో వారే తనకు ఆభరణాలు అవుతారనేది సర్పాభరణాలు ధరించడం వెనుక ఉండే సందేశాల్లో ఒకటిగా గుర్తించాలి.
శివుడి వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు… భక్తులకు శివయ్యకు మధ్య వారధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం. నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టినదని అర్థం. మనమందరమూ పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నందిలా నిరంతరం శివ సాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇదే.
– డా॥ కప్పగంతు రామకృష్ణ