భక్తిరస ఝరి అయిన పోతనగారి భాగవతంలోని నిరవద్యా (నిర్దోషా)లైన కందపద్యాలు అద్యావధి- నేటి వరకు అధ్యాత్మ చందన సుగంధాలను గుబాళిస్తూ పాఠకుల డెందాలను మాటలకందని రసానందంలో కందళింప చేస్తున్నాయి. గరిమ- భక్తి మహిమతో భాసిల్లు నవమ స్కంధంలో పరమ రమణీయమైన శ్రీరామ చరిత్ర సంగ్రహంగా వినిపించిన శుకముని చివరిలో కృష్ణచంద్రుని చరిత్రను ఇంకా క్లుప్తంగా చెప్పాడు. సూర్య, సోమ- చంద్రవంశాలలో ఆవిర్భవించిన అవతార పురుషులిద్దరి శౌర్యభరిత కథలను అద్భుత కవితారీతిలో అతి కమనీయంగా అనువదించిన అమాత్యుడు, స్కంధాంతంలో ఈ ప్రధాన అవతారాలైన రెంటికి మూల విరాట్టయిన శ్రీమహావిష్ణువుని చంపక- సంపెగ మాలతో ఇంపుగ అలంకరించి ఇలా వినసొంపుగా అభిలషించాడు.
చ॥ ‘నగుమొగమున్ సమధ్యమును నల్లని దేహము లచ్చికాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండల కర్ణముల్ మదే
భగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁడి
మ్ముగఁ బొడసూపుఁ గాతఁగను మూసిన యప్పుడు విచ్చునప్పుడున్’
‘మందస్మితం- చిరునవ్వుతో విరాజిల్లే అందమైన మోము, సన్నని నడుము, నల్లనైన దేహము, ఇల్లాలు లక్ష్మికి నెలవైన రొమ్ము, ఎగు భుజాలు, కుండలాలతో శోభిల్లు గండభాగాలు- చెక్కిళ్లు, చెవులు, మత్తవేదండపు (మదపుటేనుగు) నడక, నీలవర్ణ కుంతలాలు- కేశాలు, దయారసం కురిపించే దృక్కులు- చూపులు కలిగిన ఆపన్న శరణ్యుడు, పన్నగశాయి శ్రీమహావిష్ణువు- వెన్నుడు కన్నుమూసినా, తెరిచినా నాకు కన్నులపండువుగ కడదాకా పొడచూపు- కనిపించు గాక?’ అనగా ఇహ జన్మలోనే సహజ సమాధి సుఖాన్ని అనుగ్రహించు గాక!
కం॥ ‘జనక సుతా హృచ్చోరా
జనక వచోలబ్ధ విపిన శైల విహారా!
జన కామిత మందారా!
జనకాది మహేశ్వరాతిశయ సంచారా!’
సర్వ మంగళ దాత్రి జనక పుత్రి జానకి హృదయాన్ని దొంగిలించినవాడా! జనకుడైన దశరథుని మాట జవదాటక మోదంతో పాదరక్షలు లేకనే అటవులలో- గిరి కాననాలలో తిరిగి తాటక సంహర్తా! భక్తుల కామిత (కోరిక)లను తీర్చే కల్పతరువా! జనకాది రాజర్షులను కూడా అతిశయించిన- మించిన సమంచిత (సుపూజ్యమైన) ప్రవర్తన కల రఘునందనా! నీకు వందన చందనాలు!
పోతన తన పరిపాటిని పాటిస్తూ స్కంధ సమాప్తిలో భావ బంధురమైన ‘మాలినీ’ పద్య మాలికతో, లీలగా ఒకే కోల (బాణం)తో మహా బలశాలి వాలిని కూల్చిన నయశాలి, తన ఏలిక అయిన రామచంద్రుని అలంకృతుని చేసి ఇలా ఆలపించాడు..
మా॥ ‘జగదవన విహారీ! శత్రులోక ప్రహారీ!
సుగుణ ఘన (వన) విహారీ! సుందరీ మానహారీ!
విగత కలుష పోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురు హృదయ తోషీ! సర్వదా సత్యభాషీ!’
‘లోక రక్షణ, ధర్మ శిక్షణకై అవతరించి పావన భారతావనిలో సంచరించిన వాడా! ఉద్దండులైన విరోధి సమూహాన్ని దండించి నిరోధించిన వాడా! సుగుణాలతో శోభించే ఘనమైన ప్రవర్తన కలిగిన వాడా! లేక సుగుణాలనే వనంలో విహరిస్తూ దానికి వసంత శోభను సమకూర్చువాడా! అందగత్తెల సౌభగ మదాన్ని- సౌందర్య అభిమానాన్ని అపహరించే వాడా! (‘పుంసాం మోహన రూపాయ’- పురుషులను కూడా పరవశింపజేసే రూపం కలవాడు కదా రాముడు) పుణ్యపురుషులను పోషించువాడా! ధర్మ పరిరక్షణలో కర్కశమైన రణ కౌశలం కలవాడా! వశిష్ఠ విశ్వామిత్రాది ఆచార్యుల హృదయాలను ఆహ్లాదపరచిన గురుసేవా ధురంధరా! లేక కన్నతండ్రి దశరథుని మనసును ప్రసన్న పరచిన త్రిజగన్నుతా! సత్య భాషణాన్నే వ్రతంగా వరించిన రఘువరా! నీకు నిత్య నీరాజనాలు!
‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట నేఁ బలికిన భవహరమగునఁట’- అని అన్నాడు కాన, ఇలా భావగతమైన భాగవతాన్ని భక్తి కవితా విపంచి (వీణ)పై తనచేత భవహరమగునట్లు రసోదంచితంగా పలికించిన రామచంద్రుని సంభావించి, నవమంలో ఇక అంతిమంగా నందనందనుడు గోవిందుని కథను అందమైన కందాలలో ఇలా సంగ్రహంగా వినిపించాడు..
శుక ఉవాచ..
కం॥ ‘ఎప్పుడు ధర్మక్షయమగు
నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో
నప్పుడు విశ్వేశుఁడు హరి
దప్పక విభుడయ్యుఁ దన్ను దా సృజయించున్’
‘పరీక్షిన్మహారాజా! ఈ లోకంలో ధర్మం సన్నగిల్లి, అధర్మం- పాపం ఎప్పుడు పెచ్చరిల్లుతుందో అప్పుడు విశ్వానికి ప్రభువైన హరి, తాను విభుడు- సర్వత్ర వ్యాపకుడై ఉండికూడా తప్పక అవతరిస్తాడు- తన్ను తాను సృష్టించుకుంటాడు’. ‘సర్వమయుడు- అంతా తానే అయిన భగవంతుడు అంతటికీ సాక్షి. నిజానికి తాను అసంగ- దేనికీ అంటీముట్టని ఆత్మయే, కాన ఆయన స్వరూప భూత- ఆయనకంటే భిన్నం కాని మాయ (శక్తి) తప్ప భగవంతుని జన్మ, కర్మలకు మరో కారణం లేదు’. భగవల్లీల రెండు విధాలు- మాయా లీల, అనుగ్రహ లీల. మాయాలీల సృష్టి, స్థితి, లయ కారిణి. సంసార ప్రవృత్తికి కారణభూతురాలు. అనుగ్రహ లీల అవిద్యను- అజ్ఞానాన్ని అంతమొందించి ఆత్మ సాక్షాత్కారం కలిగించేది, కాన సంసార నివృత్తికి హేతువు.
కం॥ ‘దుష్ట జన నిగ్రహంబును
శిష్టజనాగ్రహంబు సేయుట కొరకై
యష్టమ గర్భమున గుణో
త్కృష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్’
‘రాజా! అనంత కల్యాణ గుణ విశిష్టుడైన భగవంతుడు- విష్ణుదేవుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకై తనకు ఇష్టుడైన వసుదేవుని భార్య దేవకికి అష్టమ గర్భంలో ఆవిర్భవించాడు’. అవ్యక్తుడు వ్యక్తమవడమే ఆవిర్భావం- అవతారం. అలా కృష్ణుడు జన్మించాక ఆ దేవకి భద్రమూర్తి అయిన సుభద్రనుకన్నది. ఆ అవ్వే- పూజ్యురాలే కవ్వడి- సవ్యసాచి అయిన అర్జునుని భార్య ఐనందున నీకు ముత్తవ్వ- నాయనమ్మ అయింది. రాజా! వసుదేవుని ఇంట- మథుర కారాగృహంలో పుట్టిన ఆ హరి- కృష్ణుడు వ్రేపల్లెలో పెరిగి, అరి- శత్రువీరులను సంహరించాడు. తమంత తాము వరించి వచ్చిన ఎందరో సుందరీ మణులను పెండ్లాడి వందల కొలదిగా నందను (పుత్రు)లను పొందాడు. స్వయం యజ్ఞ స్వరూపుడు, యజ్ఞేశ్వరుడు, ఫలభోక్త అయిన తన్నుగూర్చి తానే అనేక యజ్ఞాలు చేశాడు. కురుపాండవ సంగ్రామంలో తన చూపులనే తూపుల (బాణాల)తోనే శత్రువులందరినీ రూపుమాపి అర్జునుని గెలిపించాడు. తత్తం బోధించి ఉద్ధవుని ఉద్ధరించాడు. సర్వయాదవ వంశీయులచే పూజితుడై ఆ తేజోమూర్తి భూ భారం తొలగించి తన పరంధామం చేరుకొన్నాడు.
కం॥ ‘మంగళహరి కీర్తి మహా
గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్
సంగతము సేసి ద్రావఁ దొ
లంగును గర్మంబు లావిలంబగుచు నృపా!’
‘రాజా! మంగళకరమై ఆ హరికీర్తి అనే గంగామృతాన్ని చెవులనే దోసిళ్లతో చెలువు మీర కొంచెమైనా తాగితే సమస్త కామములు, కలుషములు నశిస్తాయి’. మూలంలో ‘యశస్తీర్థవరే’ అని ఉన్నదాన్ని మన పోతన ‘మంగళహరి కీర్తి మహాగంగామృత’మని అనువదించి మూలానికి వన్నెతెచ్చాడు.
కం॥ ‘వనజాక్షుని మందస్మిత
ఘనకుండల దీప్తి గండ కలితాననమున్
వనితలుఁ బురుషులుఁ జూచుచు
ననిమిష భావంబు లేమి కలయుదు రధిపా!’
‘రాజా! చిరునవ్వులతోను, ఉరు- ఘనమైన (గొప్ప) కుండలాల కాంతులతోను కూడిన వనజాక్షుని ముఖాన్ని కనుచున్న ఇంతులు- స్త్రీలు, పురుషులు తమకు అనిమిష భావం (రెప్పపాటు లక్షణం)- లేకుండా రెప్పపాటు ఉన్నందుకు ఎంతగానో కుందు- దుఃఖించు చుండిరట!’.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006