హైదరాబాద్ : సామవేద ఖష్ముఖ రచించిన ‘శ్రీలలితావిద్య’ పుస్తకాన్ని కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్లో ఆదివారం ఆవిష్కరించారు. ఋషిపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ జరిగింది. జ్యోతి ప్రజ్వలన, గ్రంధ పూజతో ప్రారంభం కాగా.. అనంతరం నూతి లక్ష్మిప్రసూన బృందం ‘వందే శ్రీ మాతరం’ నృత్య రూపకాన్ని ప్రదర్శించగా.. చూపరులను ఆకట్టుకున్నది. రాజమహేంద్రవరానికి చెందిన ‘భాగవత విరించి’ డాక్టర్ టీవీ నారాయణ రావు అధ్యక్షత వహించగా.. కాంచీపురం కంచి కామకోటిపీఠం శ్రీకార్యం ఏజెంట్ చల్లా విశ్వనాథశాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని ‘శ్రీ లలితావిద్య’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మొదటి కాపీని చెన్నైకి చెందిన ‘జ్ఞానానందనాథ’ గోటేటి శ్రీనివాసరావు అందజేశారు. అంతకు ముందు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ.. లలితా సహస్ర నామ స్తోత్రం అనేది ఓ శాస్త్రమని, ఉపాసనా రహస్యాలతో కూడుకున్న ఉపనిషద్విజ్ఞానమన్నారు. అనేక భాష్యాలు, శాస్త్రాలను అధ్యయనం చేసి ‘శ్రీ లలితావిద్య’ను రచించినట్లు పేర్కొన్నారు. పుస్తక రచనకు గురువుల కృపతోనూ, దేవీ ప్రేరణతోనూ స్ఫురించిన భావాలను మేళవించినట్లు తెలిపారు. ధర్మ, భక్తి, జ్ఞాన సంస్కారాలతో అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా టీవీ నారాయణరావు మాట్లాడుతూ ‘శ్రీ లలితావిద్య’ అందుబాటులోకి రావడం తెలుగువారి అదృష్టమని చెప్పారు. లలిత సహస్ర నామాలకు అనేక మంది అనేక భాష్యాలను రచించారని.. లలితా దేవీ వైభవాన్ని వివరించడంలో అవన్నీ వేటికవే ప్రత్యేకమైనవన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రాసిన ‘శ్రీ లలితావిద్య’ విలక్షణమైనదని తెలిపారు. వాగ్దేవతలు పలికిన రహస్య నామాల్లోని గూఢార్థాలు మస్తిష్కంలోకి వెళ్లి, హృదయాలను తాకి, అమ్మవారి భావనలో లీనమయ్యే విధంగా ఈ పుస్తకం ఉందన్నారు.
విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ గ్రంథాన్ని సాక్షాత్తూ లలితా దేవికి అక్షర రూపంగా వర్ణించారు. అమ్మవారి అరుణ ప్రభలు పుస్తకంపై ముఖచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క నామాన్ని చదువుతూ, భావిస్తూ అమ్మవారి భక్తిలో ఓలలాడవచ్చునన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ గ్రంథం లలితా దేవి చరిత్ర, నామ వైశిష్ట్యంతో అద్భుతంగా ఉందన్నారు. లలితా దేవి రహస్య నామాలలో దాగి ఉన్న శ్రీ విద్య రహస్యాలు సామాన్యుడి నుంచి పండితుల వరకు అర్థం చేసుకునేలా ఉన్నదని పేర్కొన్నారు.