Bhishma Ashtami | మహాభారతంలో మణిపూస భీష్ముడు. శాపవశాన భూమ్మీద పుట్టాడు. వర ప్రభావంతో స్వచ్ఛంద మరణం పొందాడు. ఈ పుట్టుక, ఆ చావు మధ్య అంతులేని అనుభవాలు ఆయన జీవితంలో కోకొల్లలు. శస్త్రాస్త్ర ప్రయోగాల్లో గురువును మించిన శిష్యుడు. శాస్త్ర విషయాలు సానబెట్టి చెప్పడంలో గురువరేణ్యుడు. రాజధర్మం, రాజనీతి గురించి పాండవులకు ఆయన బోధించిన సూత్రాలు.. సర్వకాలాలకూ ఆచరణ యోగ్యాలు. భీష్మాష్టమి సందర్భంగా ఆ పురాణ పురుషుడు ప్రవచించిన ధర్మాలను ప్రస్తావించుకుందాం..
అంపశయ్యపై ఉన్నాడు భీష్ముడు. ఆయన అస్తమిస్తే.. సకల జ్ఞాన సంపదలూ అక్కడితో ఆవిరి అవుతాయి. కాబోయే రాజుకు ధర్మసూక్ష్మాలు తెలిసేదెలా? అందుకే, పాండవులను పితామహుడి దగ్గరికి పంపాడు శ్రీకృష్ణుడు. పాండు పుత్రులను వాత్సల్యంతో ఆదరించాడు భీష్ముడు. కృష్ణ భగవానుడి ఆదేశం మేరకు, కర్తవ్య నిర్వహణ, ప్రజా పాలనపై పాండవులకు చక్కని బోధ చేశాడు. రాజనీతిని ఉద్బోధించాడు. మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజలను ఎలా పరిపాలించాలో సూచించాడు. దుష్టపాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించాడు.
ఏడింటిని కాపాడాలి..
అధికారంలో ఉన్నవాళ్లు ధర్మపరులై ఉండాలి. నీతి తప్పనివాళ్లయి ఉండాలి. కార్య సాఫల్యంకోసం విడవకుండా ప్రయత్నం చేయాలి. ప్రయత్నవంతుడికి దైవం కూడా తోడ్పడతాడు. శాంతి, ఉత్తమశీలం గల రాజు సౌఖ్యం పొందుతాడు. రాజు, మంత్రి, రాష్ట్రం, దుర్గం, ధనాగారం, స్నేహితులు, సైన్యం అనే ఏడింటినీ ప్రకృతులనీ, సప్తాంగాలనీ అంటారు. వీటికి హాని రాకుండా చూసుకోవాలి. సత్ప్రవర్తన, సత్యవాక్పరిపాలన కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అన్నిటికీ రక్ష దండనీతి! మెలకువతో దండనీతిని అనుసరించాలి. ప్రజలందరినీ రాజు సమానంగా చూసుకోవాలి. అందరిపట్ల దయ కలిగి ఉండాలి. కేవలం శాంతిమంతుడుగా కూడా ఉండకూడదు. పాలకుడు అతి మృదువుగా ఉంటే మావటివాడు ఏనుగును ఎక్కినట్టు దిగువ ఉద్యోగులూ, ప్రజలూ నెత్తికెక్కి కూర్చుంటారు. క్రూరుడైతే అందరూ తిడతారు. కనుక వసంతకాలపు సూర్యుడిలా తగిన మార్దవం, కాఠిన్యం కూడా చూపించాలి. రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యం. దండించేటప్పుడు జాగ్రత్తగా విచారించి మరీ శిక్షించాలి. తన ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు నొప్పి కలిగించకూడదు. బిడ్డను కనబోయే తల్లి తన సంతానానికి అనువైన ఆహారం తిన్నట్టే రాజు కూడా తొందరపడక ప్రజలకెలా అనుకూలమో అలా నడుచుకోవాలి. రాజన్నవాడు సంధి, విగ్రహం(విరోధం), యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయం అనే ఆరు గుణాలనూ జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన పద్ధతిలో ధనం సంపాదించాలి. అవినీతిపరులను ఒక కంట గమనిస్తూ ఉండాలి. ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. అలా అని అసలు నమ్మకుండానూ ఉండకూడదు. ఎవరినీ నమ్మకపోవడం మృత్యువుతో సమానం. ఎక్కువగా నమ్మడం అకాల మృత్యువుతో సమానం. నమ్మీనమ్మకుండా పనులు చేయించుకోవడం తెలివైనవాళ్ల లక్షణం.
బలహీనులకు బలమై..
పాలకులందరూ మంచి గృహస్థులై ఉండాలి. సాధారణ గృహస్థులు పెరట్లో నాటిన చెట్లలాంటి వాళ్లయితే, పాలకులు నాలుగు బజార్ల కూడలిలో పెరిగిన మహావృక్షాల్లాంటి వాళ్లు. సాధారణ గృహస్థు తమ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆదరిస్తే, ప్రభువు తన ఏలుబడిలోని నిరుపేదలను, నిరాధారులను, నిరాశ్రయులను, వృద్ధులను, వితంతువులను ఆద రించాలి. అగ్నిపురాణం, మత్స్యపురాణం, విష్ణుధర్మోత్తర పురాణాల్లో కూడా పాలకుల
ధర్మాలను చెబుతూ వీటినే ప్రధానంగా పేర్కొన్నారు. రాజన్నవాడు బలహీనుల బలం కావాలి. అనాథలకు అండగా నిలవాలి. అంధులకు కంటిచూపు కావాలి. నడవలేనివారికి నడిచే కాళ్లు కావాలి. సూర్యుడు భూమి నుంచి జీవరసాయనాన్ని గ్రహించి వేనవేల బాహువులతో మళ్లీ ఎలా దాన్ని సువృష్టిగా నేలమీద కురిపిస్తాడో, అలాగే ప్రభువు కూడా ప్రజల సంపదల్లో తమవంతు భాగాన్ని న్యాయంగా స్వీకరిస్తూ అంతకంటే ఎక్కువగా ప్రజలకు మేలు కలిగించాలి. బడుగు ప్రజలను నిరంతరం ఆదుకోవాలనుకునే రాజు ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకోవాలి. ప్రజల జీవనోపాధి కుంటుపడకుండా జాగ్రత్త పడాలి అని చెబుతూ భీష్ముడు ధర్మరాజుతో ‘వర్తకులు తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవలసి వచ్చినప్పుడు నువ్వు విధించే ఆంక్షలు, షరతుల మూలంగా వారు ఇబ్బందులకు గురి కాకూడదు. కర్షక కార్మికులను ఇక్కట్లకు గురిచేస్తే వారు ఇతర దేశాలకు వలసపోయే ప్రమాదం ఉంది. దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు, పశుపక్ష్యాదులకు, జంతువులకు అందరికీ వాళ్లే ఇంత అన్నం పెడుతున్నారు. వాళ్లనేమీ బాధించకు!’ అని సూచిస్తాడు.
పుణ్యం కొద్దీ వానలు
పాలకులు మంచివాళ్లయితే రుతువులన్నీ సక్రమంగా వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. భూమి సమృద్ధిగా పంటలనిస్తుంది. మనుషులు సుఖసంతోషాలతో ఉంటారు. పూర్ణాయుష్కులవుతారు. పాలకులు దుర్మార్గులూ, దుష్టులూ అయితే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది. రుతువులు వాటి ధర్మాలను విడిచిపెడతాయి. వర్షాలు ఉండవు. పంటలు పండవు. మనుషులందరూ ఆకలిదప్పులతో, అనారోగ్యంతో ఈసురోమంటూ ఉంటారు. పాలకులు యజ్ఞయాగాలు నిర్వహించడంవల్ల యాగధూమం సూర్యమండలంలోని అమృతకిరణాలను స్పందింపజేస్తుంది. అప్పుడు ఆ అమృత కిరణాలద్వారా అమృత రూపమైన సువృష్టి కలిగి, చక్కని ఓషధులు పుట్టి, వాటివల్ల సుప్రజోత్పత్తి కలుగుతుంది. పాలకులు చేసే పుణ్యాలు, యజ్ఞయాగాది క్రతువులకు దేవతలు సంతోషించి దివ్య వర్షాన్ని, దివ్యమైన అన్నాన్ని ప్రసాదిస్తారు.
రైతుబంధువై..
సుఖానికి మూలం ధర్మం. ధర్మానికి మూలం ధనం. ధనానికి మూలం రాజ్యం. అర్థసంపద ఉంటే చాలు. అదే ప్రకృతి సంపదను కూడా ఇస్తుంది. అంటే రాజ్యపాలనకు కావల్సిన శక్తిని ఇస్తుందన్నమాట. కనుక ధనాగారాన్ని వృద్ధి చేసుకునే విధానాలేమిటో నిరంతరం పాలకులు అన్వేషిస్తుండాలి. అయితే, మనకు తిండిగింజలు ఎలా వస్తున్నాయో, ఈ నేలను ఎవరు దున్నుతున్నారో, ఈ మట్టిని ఎవరు బంగారం చేస్తున్నారో, మనకూ మన ప్రజలకూ ఎవరు ప్రతిపూటా పట్టెడన్నం పెడుతూ ప్రాణదానం చేస్తున్నారో వాళ్లపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ముఖ్యంగా కర్షకులు, కార్మికులు, వర్తకులు, గోరక్షకుల నుంచే రాజుకు ధనం లభిస్తుంది. ధనధాన్యాలకు ఉత్పత్తిస్థానాలు వారు. వాళ్లను పీడించకూడదు. వాళ్లకు హాని కలిగించకూడదు. వాళ్లు పొలాల్నీ, నదుల్నీ, అడవుల్నీ, ప్రకృతిని నమ్ముకుని బతుకుతూ, మనల్ని బతికిస్తున్నారు. వాళ్లను దయతో చూడాలి. అధికారం ఉన్నది కదా అని మనబలాన్ని సంపదలను చూసి మిడిసి పడకూడదు. రైతులు లోకబాంధవులు. వాళ్లకు నాగలి, కాడి, ఎడ్లు, బండ్లు ఉచితంగా ఇవ్వాలి. సకాలంలో వానలు కురవక పంటలకు నీరు అందక పోయినా, వానలు మిక్కుటమై వాగులూ వంకలూ పొంగి పంటచేలన్నీ నీట మునిగినా, ప్రకృతి కన్నెర్ర చేసినా.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడే పాలకులు ప్రజలకు అండగా నిలబడాలి.
– ప్రయాగ రామకృష్ణ
భీష్మ@ మేనేజ్మెంట్ & గవర్నెన్స్ రచయిత
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!
అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం