తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు. కానీ, మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్తాడు. తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తానంటాడు శిష్యుడు. ఇదీ గురుశిష్యుల సంబంధం. ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధం అది.
వేదవ్యాస మహర్షి పంచమ వేదంగా లోకానికి అందించిన మహాభారతంలో గురు వైభవాన్ని ప్రకటించే ఇతివృత్తాలు ఎన్నో కనిపిస్తాయి. జగద్గురువైన శ్రీకృష్ణుడే స్వయంగా సాందీపుని దగ్గర శిష్యునిగా విద్యాభ్యాసం చేయడం, కురు కుమారులు ద్రోణాచార్యుడి శిష్యరికంలో సాటిలేని యోధులుగా తయారవ్వడం, కేవలం గురుభక్తితో ఏకలవ్యుడు సాటిలేని మేటి విలుకాడుగా ప్రసిద్ధిపొందడం… ఇవన్నీ ప్రాచుర్యం పొందిన కథలు. గురువైభవాన్ని ప్రకటించే మరో వృత్తాంతం మహాభారతం అరణ్యపర్వంలో ఉంది.
యవక్రీతుడి వృత్తాంతం
భరద్వాజుడు, రైభ్యుడు ఇద్దరూ సహాధ్యాయులు. ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేసి, సకల విద్యల్లోను పాండిత్యం సంపాదించారు. తపస్సుతో ఇద్దరూ మహర్షిత్వాన్ని సాధించారు. రైభ్యుడి కుమారులు కూడా తండ్రి చూపిన మార్గంలో సద్గురువును ఆశ్రయించి, వేదవేదాంగాలు అభ్యసించి, ఉత్తమ గుణాలతో శోభిల్లుతూ, అందరి ప్రశంసలు అందుకున్నారు. భరద్వాజుని కుమారుడు యవక్రీతుడు. ఉపనయనం జరిగిన క్షణం నుంచి, యవక్రీతుడు కేవలం తపస్సు ద్వారా సకల విద్యల్లో పాండిత్యం సంపాదించాలని భావిస్తుంటాడు. గురు శుశ్రూష ద్వారా విద్యాభ్యాసం చేయాలంటే ఎంతో సమయం పడుతుంది కాబట్టి, తపస్సు ద్వారా తేలికగా జ్ఞానం పొందవచ్చని అతని ఆలోచన. రైభ్యుడి కుమారులకు సమాజంలో దక్కుతున్న ఆదరణ ఇతనిలో మరింత మాత్సర్యాన్ని కలిగిస్తుంది. దీంతో యవక్రీతుడు ఇంద్రుడి గురించి, ఘోర తపస్సు చేశాడు.
‘గురూపదేశం లేని విద్య మాత్సర్యాన్ని, అహంకారాన్ని పెంచుతుందని, ఈ ప్రయత్నం విడిచిపెట్టమని’ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఇంద్రుడు యవక్రీతుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా, అతను పట్టు విడిచిపెట్టడు. దీంతో, చేసేదిలేక ఇంద్రుడు యవక్రీతుడికి వేదాలను భాసింపజేస్తాడు. అహంకారం తగదంటూ భరద్వాజుడు యవక్రీతుడికి ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు. కానీ, వర గర్వంతో విర్రవీగుతున్న యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమంలోకి ప్రవేశించి, మహర్షి కోడలిని చెరబట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో కోపించిన రైభ్యుడు యవక్రీతుడిని వధిస్తాడు. కొంతకాలం తర్వాత రైభ్యుని రెండో కుమారుడు దయతలచి, తన తపశ్శక్తితో యవక్రీతుడిని పునర్జీవితుణ్ని చేస్తాడు.
తన విద్యలు ఎందుకు నిష్ప్రయోజనం అయ్యాయని యవక్రీతుడు దేవతల్ని ప్రశ్నిస్తాడు. ‘గురుముఖంగా నేర్చుకోకపోవటం వల్లే నీ విద్యలు ఫలించలేద’ని దేవతలు స్పష్టం చేస్తారు. ఇదీ గురువైభవం. ఈ భావాన్నే ప్రకటిస్తూ శ్రీనాథ మహాకవి ‘గురువు నేర్పని విద్య గుడ్డివిద్య’ అన్నాడు. మహాకవి కాళిదాసు ‘శుశ్రూష స్వగురూన్’ అంటూ ‘గురు శుశ్రూష ద్వారానే విద్యలు నేర్చుకోవాల’ని చెప్పాడు.
దీపకుడి గురుభక్తి
కేవలం నిశ్చలమైన గురుభక్తితో శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం పొందిన శిష్యలోక చక్రవర్తి దీపకుడు. వేదధర్యుడనే గురువు దగ్గర దీపకుడు విద్యాభ్యాసం చేస్తుంటాడు. వినయంతో, సకల శుభ లక్షణాలతో గురువుకు అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. ఒకరోజు వేదధర్యుడు దీపకుడిని పిలిచి ‘దీపకా! పూర్వజన్మలో నేను చేసిన రెండు పాపాలను పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంది. ఇందుకు కాశీ క్షేత్రానికి వెళ్లాలి. ఆ పాపాలను ఆవహింపజేసుకున్నప్పుడు నా స్వభావం పూర్తిగా మారిపోతుంది. అత్యంత కఠినుడిగా మారిపోతాను. కుష్ఠు రోగం వస్తుంది. జుగుప్స కలిగించే రూపంతోపాటు అంధత్వం కూడా వస్తుంది’ అంటాడు.
దీపకుడు ‘మహానుభావా! ఆ సమయంలో తమకు సేవ చేసుకునే భాగ్యం నాకు అనుగ్రహించండి’ అని గురువును వేడుకుంటాడు. ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి చేరుకుంటారు. వేదధర్యుడు పాపాలను ఆవహింపజేసుకుంటాడు. అతిభయంకరమైన రూపం, కఠిన స్వభావం అతనికి సంప్రాప్తిస్తాయి. అన్నిటినీ తట్టుకుంటూ గురుసేవ చేస్తుంటాడు దీపకుడు. ఆ శిష్యుడు చేస్తున్న అనితర సాధ్యమైన గురుసేవకు మహదానందం పొందిన కాశీ విశ్వనాథుడు దీపకుడికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న గురువుకు పాదసేవ చేస్తుంటాడు దీపకుడు. ‘తనకేమీ తెలియదని, గురువుగారు నిద్ర నుంచి మేల్కొనగానే, వారిని అడిగి చెబుతాన’ని విశ్వనాథుడికి బదులిస్తాడు.
వేదధర్యుడు నిద్ర నుంచి మేల్కొనగానే జరిగిందంతా వివరిస్తాడు దీపకుడు. ‘మీ పాపాలు పోగొట్టమని విశ్వనాథుడిని అడుగుతానని, అందుకు అనుమతించమ’ని అభ్యర్థిస్తాడు. ఇందుకు వేదధర్యుడు ఒప్పుకోడు. ఎవరి పాపాలు వారే అనుభవించాలని, అప్పుడే పూర్తిగా కర్మఫలితం నశిస్తుందంటాడు. మర్నాడు దీపకుడు శివుడి సన్నిధికి వెళ్తాడు. కానీ, ఏ వరం కోరుకోడు. నిశ్చలంగా దైవాన్ని చూస్తూ నిల్చుంటాడు. దీపకుడి ఉన్నతమైన సాధనను మెచ్చుకున్న విశ్వనాథుడు, శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్లి, దీపకుని వృత్తాంతం చెబుతాడు. హరిహరులిద్దరూ దీపకుడికి ప్రత్యక్షమవుతారు.
‘నారాయణా! మిమ్మల్ని నేనెప్పుడూ దర్శించలేదు. కనీసం స్మరించలేదు కూడా. నాకు ఎందుకు ప్రత్యక్షమయ్యార’ని దీపకుడు విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు. అందుకు నారాయణుడు ‘దీపకా! నీవు అచంచలమైన భక్తితో గురుసేవ చేస్తున్నావు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. కాబట్టి, నన్ను అర్చించినట్టే. ఏం వరం కావాలో కోరుకో’ అని స్వామి దీపకుడిని అడుగుతాడు. ‘స్వామీ! ఎన్నటికీ తరగని అచంచలమైన గురుభక్తి నాకు ప్రసాదించమ’ని దీపకుడు నారాయణుడిని వేడుకుంటాడు. అతని గురుభక్తికి మెచ్చిన నారాయణుడు అనేక వరాలు అనుగ్రహిస్తాడు. నిశ్చలమైన గురుభక్తితో తనతోపాటు తన గురువును కూడా తరింపజేసిన ఘనతను దీపకుడు సాధించాడు. గురువైభవానికి అసలైన నిదర్శనం ఇది.
…? డా॥ కప్పగంతు రామకృష్ణ
90320 44115