ఒక ఆశ్రమంలో ఇద్దరు రుషులు వాయుదేవోపాసన అప్పుడే ముగించారు. భోజనానికి సిద్ధమవుతుండగా గుమ్మం నుంచి ‘నారాయణ హరి’ అంటూ ఎవరో భిక్ష కోరారు. చూస్తే బ్రహ్మచారి. ‘ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు. వెళ్లిరా!’ అన్నాడు ఒక రుషి. యథార్థమైన దేవతోపాసన అంటే ఏమిటో రుషులకు తెలియజేయాలని సంకల్పించాడు బ్రహ్మచారి.
‘మీరు ఏ దేవతను ఉసాసిస్తారు?’ అని అడిగాడు. ‘మేం వాయుదేవత ఉపాసకులం’ అన్నారు రుషులు. ‘వాయువు నుంచే లోకం ఉద్భవించి.. వాయువులోనే లయమవుతుంది కదా!’ అన్నాడు బ్రహ్మచారి. రుషులు అవునన్నట్టు తలలు ఊపారు. ‘భోజనం ఏ దేవత కోసం తయారుచేశారు?’ అన్నాడు బ్రహ్మచారి.
‘వాయుదేవత కోసం’ అన్నారు రుషులు. ‘సమస్త ప్రపంచమూ వాయువు వ్యాపించి ఉన్నది కదా!’ అని మళ్లీ అడిగాడు బ్రహ్మచారి. ‘అవును’ అన్నారు రుషులు. ‘ఆ వాయువు నాలోనూ వ్యాపించి ఉన్నట్టే కదా!’ అన్నాడు బ్రహ్మచారి. రుషులు ఇంకేం మాట్లాడలేదు. ‘అజ్ఞానులైనవారు అనేక రీతులుగా ఉండే దివ్యతత్తాన్ని గ్రహించలేకపోతారు. ప్రపంచమంతా ఏ దేవత కోసం అన్నంగా మారి ఉన్నదో.. ఆ దేవతకు అన్నం సమర్పించం అనడం అజ్ఞానం అవుతుంది కదా’ అన్నాడు బ్రహ్మచారి. రుషులకు జ్ఞానోదయం అయింది. ఆ బ్రహ్మచారిలో తమ ఉపాస్య దైవాన్ని దర్శించారు. అతిథి సత్కారాలు చేసి, భోజనం పెట్టారు. ‘అతిథి దేవోభవ’ అని లోకానికి చాటిచెప్పారు. ఈ కథ ఛాందోగ్య ఉపనిషత్తులోనిది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863