ఒక ముక్కు పచ్చలారని బాలబ్రహ్మచారి.. ముఖంలో మూర్తీభవించిన బ్రహ్మ తేజం.. ఒకపూరి పాక ముందు నిలిచి ‘భవతీ భిక్షాం దేహి’ అన్నాడు. పాకలోంచి బయటికివచ్చిన ఆ ఇల్లాలు ముఖంలో కంగారు. బ్రహ్మ తేజస్వి బ్రహ్మచారికి భిక్ష ఇద్దామంటే ఇంట్లో ఏమీ లేవు. కనీసం ధరించిన ఆమెకు వస్ర్తాలైనా సరిగా లేవు. రెండోసారి ‘భిక్షాందేహి’ అన్నాడా బాలవటువు. మూడోసారి అడిగి భిక్ష తీసుకోకుండానే వెళ్లి పోతాడు. ‘ఆగండి .. ఇప్పుడే వస్తా’ అని పాకలోకి వెళ్లిందా ఇల్లాలు. అన్ని పాత్రలూ వెతికింది. ఒక్క ఉసిరికాయ మాత్రమే ఉంది. ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తున్నా, హృదయంలో దారిద్య్రం లేని ఆ తల్లి బాలుని భిక్షాపాత్రలో ఆ ఉసిరికాయనే వేసి నమస్కరించింది. బ్రహ్మచారికి ఇల్లాలి పరిస్థితి అర్థమైంది. హృదయంలో వేదన శ్లోకాల రూపంలో ఆశుధారగా ఉబికి వచ్చింది. అనర్గళంగా ఇరవై ఐదు శ్లోకాలతో సిరుల తల్లి లక్ష్మీదేవిని స్తుతించాడు.
శ్లో॥ అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః॥
‘ఆడ తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా, ఏ మంగళదేవత ఓరచూపు నీలమేఘశ్యాముడైన భగవంతుడు విష్ణుమూర్తిపై ప్రసరిస్తుందో ఆ వృక్షం తొడిగిన మొగ్గల వలె ఆయన శరీరంపై పులకాంకురాలు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి కృపా కటాక్షం నాకు సమస్త సన్మంగళాలను సంతరించును గాక!’ అని శ్లోకార్థం.
భిక్షనిచ్చిన పేద తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టితురాలై నిలబడింది. విష్ణు లోకంలో లక్ష్మీదేవి ఆనంద తన్మయత్వంతో పులకించింది. అప్పటికప్పుడే ఆ పేద తల్లి పూరిపాక ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఈ అద్భుత ఘట్టంలోని బాలశంకరుడే భవిష్యత్తులో ఆదిశంకర భగవత్పాదులై జగద్గురువయ్యాడు. వారందించిన ఆ శ్లోకచయమే కనకధారా స్తోత్రం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో త్రికాలాలలో పారాయణం చేస్తారో వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారనే ఫలశ్రుతి కూడా ఉంది. 32 ఏండ్ల శంకరుల జీవితంలో ఇలాంటి అద్భుతాలు కొల్లలు.
శంకరుల బాల్యలీలల్లో మరొకటి తల్లి ఆర్యాంబకు ఇబ్బంది కలగకుండా పూర్ణానది గమనాన్నే మళ్లించిన వైనం. తల్లి అనుమతితో సన్యాసిగా మారినప్పటికీ ఆమె తలచుకోగానే వస్తానని చెప్పడం. తల్లి అవసాన స్థితిలో ఇచ్చిన మాట ప్రకారం సన్యాసి అయినా కూడా వచ్చి అంత్యేష్టి నిర్వహించడం. నర్మదా నదీ ప్రవాహాన్ని తన కమండలంతో ఆపి జల ప్రళయాన్ని నివారించడం. యావద్భారతాన్ని కాలినడకన రెండు సార్లు చుట్టిరావడం ఇలాంటి ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో ఉన్నాయి.
పరమేశ్వరుడు మానవులకు జ్ఞాన భిక్ష పెట్టడానికి కృతయుగంలో దక్షిణామూర్తి రూపంలో, ద్వాపర యుగంలో వేదవ్యాస మహర్షిగా అవతరించాడు. గీతాచార్యుని వాక్యాన్ని జ్ఞప్తికి తెస్తూ కలియుగంలో సాక్షాత్తూ శంకరుడే ఆదిశంకర భగవత్పాదుల రూపంలో ప్రజ్ఞానమూర్తిగా అవతరించాడు. కర్మభూమి భారతావనిలో జ్ఞానామృతాన్ని పంచడానికి అవతరించిన జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. అనైక్యతతో, భిన్నభిన్న దేవతారాధనలతో, పిడివాదాలతో, పాషండ మతాలతో అతలాకుతలమై వేద ధర్మం గ్లానితో, క్లిష్టస్థితిలో ఉన్న సమయంలో హైందవ జాతికి సక్రమ దిశానిర్దేశం చేసే ఒక దీపస్తంభంలా అసామాన్య సంస్కార వారసత్వాన్ని ప్రసాదించాడు ఆదిశంకరులు. తమ బోధనలు, వాదనల ద్వారా హైందవ తత్త్వాన్ని జగజ్జేగీయమానం చేశాడు.
నానావిధ వాదాల వల్ల సనాతన వేద ధర్మం ప్రాభవం కోల్పోతున్న తరుణంలో భారత భూమిని ఆసేతు హిమాచల పర్యంతం రెండుసార్లు కాలినడకన పర్యటించి తమ ఉత్కృష్ట బోధనలతో, వాదనలతో, వివిధ దేవీ దేవతల స్తోత్ర రచనలతో జాతిని జాగృతం చేశాడు. బ్రహ్మ సూత్రాలకు, దశోపనిషత్తులకు, భగవద్గీతకు నిరుపమానమైన భాష్యాలను అందించాడు. దేశం నలువైపులా చతురామ్నాయ పీఠాలను నెలకొల్పాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతా సంచరించి, పంచాయతన పూజా విధానాన్ని ఏర్పాటుచేశాడు. షణ్మత స్థాపనాచార్యుడిగా, అద్వైత సిద్ధాంత ప్రతిష్ఠాపనాచార్యులై జగద్గురువుగా నిలిచాడు.
మరుమాముల
దత్తాత్రేయ శర్మ
94410 39146