ఓ ఆశ్రమంలో సత్సంగం జరుగుతున్నది. కార్యక్రమానికి హాజరైన ఒక వ్యాపారి ‘భగవంతుడు నిజంగా ఉన్నాడా?’ అని ప్రశ్నించాడు. ‘భగవంతుడు ఉన్నాడా, లేడా.. అనే విషయం అటుంచి ‘ఆయన చూస్తున్నాడేమో!’ అనే భయం లేకపోతే పాపాలు పెరిగిపోతాయి’ అని చెప్పాడు గురువు. ‘అదెలా?’ అని ప్రశ్నించాడు వ్యాపారి. అప్పుడు గురువు రెండు కొత్త వంద నోట్లను అతని చేతికి ఇచ్చాడు. ఎవ్వరూ చూడకుండా ఆశ్రమంలో ఒక మూల ఉన్న కెమెరా కింద బయటికి కనిపించేలా ఒక వంద నోటు ఉంచమని వ్యాపారికి చెప్పాడు. మరో వంద కాగితాన్ని కెమెరాకు దూరంగా పారిజాతం చెట్టు కింద పెట్టమన్నాడు.
ఏం జరుగుతున్నదో పరిశీలించమన్నాడు. దూరంగా కూర్చుని వ్యాపారి ఆసక్తిగా గమనించసాగాడు. కెమెరా కింద ఉన్న నోటు కనిపించినా, దానిని తీసుకునే సాహసం ఎవరూ చేయలేదు. నోటువైపు ఆశగా చూసి, అంతలోనే కెమెరా వంక భయంగా చూస్తూ అక్కడి నుంచి వెనుదిరిగారు. అదే సమయంలో పారితాజం చెట్టుకింద ఉంచిన వందనోటు క్షణాల్లో మాయమైంది.
కాసేపటికి గురువు నవ్వుతూ వచ్చి ‘చూశావా! పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదు అనుకుంటుంది. అలాంటి మనస్తత్తమే మనుషుల్లోనూ ఉంటుంది. తమాషా ఏంటంటే.. మానవ మేధతో తయారైన కెమెరాకు మనిషి భయపడుతున్నాడు. కానీ, ప్రకృతి దగ్గర ఇంతకుమించిన అధునాతన కెమెరా ఉంది. అక్కడ అన్ని విషయాలూ రికార్డు అవుతాయి. ఎప్పుడో ప్రకృతి వేసే సున్నితపు త్రాసు తూకంలో మనిషి తేలిపోతాడు’ అన్నాడు. నిజమే! భగవంతుడు అన్ని విషయాలూ గమనిస్తున్నాడనే భావన ఉంటే.. మనిషి ప్రవర్తన మహోన్నతంగా మారుతుంది కదా! అనుకున్నాడు వ్యాపారి.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821