క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తన నతా
పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితు రాహో పురుషికా!
(సౌందర్యలహరి -7)
ఈ శ్లోకంలో అమ్మవారి స్థూలరూపాన్ని అద్భుతంగా వర్ణించారు ఆదిశంకరులు. ‘క్వణత్కాంచీదామా’ అని అమ్మను ప్రస్తుతించారు. అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆమె మొలనూలు దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నది. దానికి కూర్చిన మణిమయ గజ్జెలు సవ్వడి చేస్తున్నాయట. దీన్ని‘రత్నకింకిణికారమ్యా రశనాదామ భూషితా’, ‘రణత్కింకిణి మేఖలా’ అని లలితా సహస్ర నామాలు పేర్కొన్నాయి. కూర్చున్నప్పుడు గజ్జెల చిరుసవ్వడి ఎలా సంభవం? ఇది అనుమానం. అయితే అమ్మ సంపూర్ణచైతన్య స్వరూపం. సర్వాభరణ భూషితయైన అమ్మ ఆభరణాలన్నీ చైతన్య స్వరూపాలే కానీ జడములు కావు. అలాంటి చైతన్యవంతమైన, మంత్రపూతమైన ఆభరణాల కదలిక వల్ల చిరుసవ్వడి వెలువడి అంతటా పవిత్రతను నింపుతుంది. కాంచీదామా అనడంలో కాంచీ‘ధా’మమనే పుణ్యక్షేత్రమూ ధ్వనిస్తున్నది.
‘కరికలభ కుంభస్తన నతా’ అమ్మవారి వక్షస్థలం ఏనుగు కుంభస్థలాన్ని పోలి ఉన్నది. ఎందుకు? స్త్రీల వక్షస్థలం పోషణకు ప్రతీకగా నిలుస్తుంది. అమ్మ సకల చరాచర సృష్టిని పోషించాలి కాబట్టి ఆమెను ‘కరికలభ కుంభస్తన’ అన్నారు. అంతేగాక ఆమె గజవదనుని పోషించే తల్లి అని అవగతమవుతుంది. ‘పరిక్షీణా మధ్యే’ అని ప్రస్తావించారు. అంటే సన్నని నడుము కలిగినది. సన్నని నడుము ఉత్తమజాతి స్త్రీ సౌందర్యానికి ప్రతీక. ‘పరిణత శరశ్చంద్ర వదనా’ ఆమె ముఖం పరిణతి చెందిన అంటే పున్నమి నాటి చంద్రుని వలె ఉన్నది. పున్నమి నాటి చంద్రుడు ప్రసన్నతకు ప్రతీకగా నిలుస్తాడు. మనసు ప్రసన్నతను సంతరించుకుంటేనే ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అమ్మ ప్రశాంతమైన మనసు కలిగినది. నిజానికి చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. పౌర్ణమి నుంచి ప్రతిరోజూ ఒక కళ చొప్పున చంద్రుడి కళలు సూర్యుడిలో కలుస్తుంటాయి. అదే అమావాస్య నుంచి ప్రతిరోజు ఒక కళ చొప్పున సూర్యుడి నుంచి చంద్రుడిలో చేరుతూ పౌర్ణమి నాటికి 16 కళలతో ప్రకాశిస్తాడు. దానినే పరిణతి చెందడమని చెప్తారు.
అమ్మవారు చేతిలో బంగారపు రంగుతో ప్రకాశిస్తున్న.. ‘ధనుర్బాణాన్ పాశం సృణి’ ధరించి ఉన్నది. ధనుస్సు అంటే సాధకుని మనసు. బాణాలు పంచతన్మాత్రలు. పాశం అంటే రాగానికి ప్రతీక. ప్రేమానురాగాలు జీవిని కట్టిపడేస్తుంటాయి. ఇక అంకుశం ద్వేషానికి ప్రతీక. రాగద్వేషాలు పరస్పర ఆధారితాలు. మనసు నిశ్చలం అయితేనే అమ్మను చేరుకోగలం. అలా నిశ్చలం కావాలంటే రాగద్వేషాలను అధిగమించాలి. ‘పురస్తాదాస్తాం నః పురమథితు రాహో పురుషికా..’ అనే పాదానికి అర్థవంతమైన వివరణ ఉన్నది. త్రిపురాలను అంటే స్థూల, సూక్ష్మ, కారణం అనే మూడు శరీరాలను, నశింపజేసేవాడు అయిన శివుడి అహంకార స్వరూపం అమ్మవారి ఎదురుగా ఉన్నదట.
పురుషికా అంటే ‘నేను’ అని అర్థం. నేను ఎవరంటే అమ్మ. అహో అనడంలో ‘అ’కారం బ్రహ్మతత్త్వం కాగా ‘హ’కారం శక్తితత్త్వం. ఈ రెండిటి కలయికయే ‘అహం’. సృష్టికి ముందుగా ఉన్నది ఒక్కటే. దాన్నే పుంభావనలో పరమేశ్వరుడని, స్త్రీ భావనలో ఆదిశక్తి అని చెప్తారు. ఆ ఒక్కటే తన లాంటి మరిన్ని ఆకృతులు కావాలనుకున్నది. దాన్నే ‘ఇచ్ఛ‘ అంటున్నాం. ఇచ్ఛ అవసరమైన ‘జ్ఞానాన్ని’ సమకూర్చుకున్నది. అదే ‘క్రియా’ రూపంలో అనేకమైంది. ఈ ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తులనే అహంగా వ్యవహరిస్తున్నాం. అలాంటి అమ్మ తనకు ప్రత్యక్షం కావాలని శంకరులు ధ్యానిస్తున్నారు. స్థూల ఆకారం ద్వారా తత్త్వాన్ని ఉపాసించే ఈ మార్గాన్ని ప్రబోధించారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు. అలాంటి శివుడి అహంకార రూపిణి అయిన లలితా మహా త్రిపుర సుందరి మనందరినీ అనుగ్రహించుగాక.
-పాలకుర్తి రామమూర్తి