మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే
గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే॥
(శివానంద లహరి- 63)
‘అడ్డదిడ్డమైన చోట్లలో తచ్చాడిన పాత చెప్పు శివలింగాన్ని శుభ్రపరిచేందుకు కుంచెలా పనికొచ్చింది. పుక్కిలించిన నీళ్లు ఉమ్మేస్తే దివ్యమైన అభిషేకమైంది. కాస్త కొరికి వదిలేసిన మాంసం ముక్కలు తాజా నైవేద్యమైంది. భక్తి ఎంత పనైనా చేయగలదు. ఒక వనచరుడు (ఆటవికుడు) భక్తావతంసుడు (భక్తులలో శ్రేష్ఠుడు) అయ్యాడు’ ఇది తిన్నడి గురించి ఆదిశంకరుల ఆశ్చర్యం-ఆనందం. ఒక ఆటవికుడు ఏమిటి? భక్త శ్రేష్ఠుడు కావడమేమిటి? శంకరాచార్యులకు మరెవరూ దొరకలేదా? ఒక అడవి మనిషిని, పొట్టచీరితే అక్షరం ముక్క రానివాణ్ని పట్టుకొని గొప్ప భక్తుడు అంటారేమిటి? అనుకోవచ్చు.
మనసు దేవుడి మీద నిశ్చలంగా నిలిచిపోవడమే భక్తిలో ప్రధానం. అంతేకానీ, ఆ వ్యక్తి చదువు సంధ్యలు అతని భక్తికి అర్హతలు కావు. పరిశుభ్రత, ఆచారవ్యవహారాలు, ఉపవాసాది నియమాలు ఎంతమాత్రం ప్రధానం కావు. పైన పేర్కొన్న షరతులు భక్తిమార్గంలో ఒకింత సహకరిస్తాయేమో గాని, మనసు ఒకసారి నిశ్చలంగా నిలిచిపోయిదంటే ఇవేవీ అక్కర్లేదు. తిన్నడి (కన్నప్ప) విషయంలో మనం ఛాందసాలను ఆమడదూరంలో పెట్టి జాగ్రత్తగా గమనించి తీరాల్సిందే!
నగరంలో తిరగనేర్చిన నాగరికుడు కావచ్చు, జంతువుల నడుమ తిరిగే ఆటవికుడు కావచ్చు.. దైవభక్తి వరించిందంటే ఎటువంటివాడైనా విద్యాధికులందరికీ ఆదర్శమవుతున్నాడు తిన్నడిలా. అందుకే, నారదమహర్షి తన భక్తి సూత్రాలలో ‘నాస్తితేషు జాతి విద్యారూప కులధన క్రియాది భేదః’ (72)- భక్తులలో జాతి, కుల, ధన, రూప భేదాలు లేవు’ అని చెప్పాడు.
చెప్పులతో గుళ్లోకి రావద్దు- అపవిత్రం. పాదప్రక్షాళన చేసుకున్నాకే అడుగుపెట్టాలి లాంటివి ఎన్నో! భక్తి తక్కువై ఇలాంటి నియమాలు ఎక్కువయ్యాయి. నియమాలు పాటించాల్సిందే! కానీ, నియమాలే భక్తి అనుకుంటే పొరపాటు. పంచభక్ష్య పరమాన్నాలు నివేదనగా సమర్పించినా, నిండైన భక్తితో రేగు పండ్లు నివేదించినా భగవంతుడు ఒకేలా స్వీకరిస్తాడు. ‘నాకు ఫలానా పదార్థాలు మాత్రమే కావాలి’ అని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. కానీ, దేవుడికి లేని అభ్యంతరం మనిషికి ఎందుకో అర్థం కాదు.
భక్తి తత్పరతకే తప్ప వేరే విషయాలకు అంతగా ప్రాధాన్యం లేదన్నది అక్షర సత్యం. కానీ, భక్తి కన్నా ఇతర ఆడంబరాలదే పైచేయి అవుతున్నది. అలాగని చదువు, ఆచారాలు, నియమాలు అస్సలు అక్కరలేదని భావించకూడదు. వాటిని పాటించాలే కానీ, ప్రదర్శించకూడదు. అసలైన భక్తిపై దృష్టిసారించాలి. ‘నేను భక్తుణ్ని’ అని పదిమంది చెప్పుకోవాలని భావించడం సరికాదు. ఇటువంటి దృక్పథం మారాలి. కానీ, ఓపిక చాలక సోమరిపోతులై భక్తి సాకుతో దుష్కార్యాలు చేస్తున్నారు చాలామంది. భక్తిని కూడా ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారు. అసలైన ధార్మికత, భక్తి గురించి ఆలోచించడం లేదు. ఇది ఉభయ భ్రష్టత్వానికి దారితీస్తున్నది. అంటే, నిఖార్సయిన భక్తీ లేదు, అందుకు తోడ్పడే ఆచారాల మీదా శ్రద్ధ లేదు.
వేదం చదువుకోకపోయినా, మంత్రాలు రాకున్నా, తంత్రాలు తెలియకున్నా, ఆరాధనా విధానం తెలియకపోయినా, ధనం వెచ్చించలేకున్నా, నియమాలు పాటించేశక్తి ఉండకున్నా.. నిండైన భక్తి ఉంటేచాలు. జగజ్జేగీయమానంగా అదొక్కటి వెలిగిపోతుంది. ఆ భక్తుడిని తరింపజేస్తుంది. అన్నీ సలక్షణంగా ఉన్నా, అసలైన భక్తి లేకపోతే అవెంతమాత్రమూ రాణించవు. ఉప్పులేని పప్పులా, దేవుడు లేని జాతరలా మిగిలిపోతాయి. శివానందలహరిలోని శ్లోకం ద్వారా ఆదిశంకరులు చెప్పదలుచుకున్నదీ, మనం తెలుసుకోవలసిందీ ఇదే!
డా॥వెలుదండ ,సత్యనారాయణ
94411 62863