మ॥ ‘తనవెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్’
నాగేంద్రుని- గజేంద్రుని నానావిధ దీనాలాపాలన్నీ విన్న ఆపన్న ప్రసన్నుడు, ఆది దేవుడు, అమర వల్లభుడు, జగన్నాథుడు సమర సాధనాలు కూడా సమకూర్చుకోకుండా, వినువీధిలో వెనుకకు చూడక వడివడిగా వెళ్తున్నాడు. అలా చనుచున్న వెన్ను (విష్ణువు)ని వెన్నంటి వస్తున్న అలవైకుంఠపురం మొత్తాన్ని కలియుగ వైకుంఠంగా ఇలలో మరో మత్తేభవృత్తంలోనే ఇలా కళాత్మకంగా దించాడు మన పోతన్న! ఆలకించండి…
వైకుంఠాన్ని వదలి వెడలిపోతున్న విష్ణువు, పతి అడుగుజాడలలో వెనుకనే శ్రీసతి, ఆమెను అనుసరించి అంతఃపురంలోని అతివలు-స్త్రీలు, వారి వెనుకనే విహగపతి వైనతేయుడు- గరుత్మంతుడు, అతనివెంట అంచితంగా శార్ఙమనే విల్లు, కౌమోదకీ నామక గద, పాంచజన్యమనే శంఖం, నందకమనే ఖడ్గం, సుదర్శనమనే చక్రం- ఈ పంచాయుధాలు, ఇంకా దేవర్షి నారదుడు, విష్వక్సేనుడు వచ్చి చేరారు. వారి వెనుక వైకుంఠంలోని పిన్నలు పెద్దలు- అందరూ, పసిబిడ్డ బాలాది బారులు తీరి బయల్దేరారు.
‘శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు’- దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు అఖిల శక్తిధరుడు ఆయుధాలను ధరించాలా? ‘ఆయుధమున్ ధరింప’- కురుక్షేత్ర సమరంలో సవ్యసాచి అర్జునుడు తనను సాయం కోరగా కృష్ణుడు- ‘నీ పక్షంలో ఉన్నా నేను అస్త్రశస్ర్తాలు ధరించను’ అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. అయినా, పాండవులను నిమిత్తంగా చేసుకొని శత్రుపక్షంలోని కౌరవ దుర్జనులను ఆయుధం పట్టకనే అంతమొందించాడు దానవాంతకుడు. కాన, రిక్తహస్తాలతో ఉన్నా పరమాత్మ భక్త పరిపాలనం చేసే సత్తా గలవాడు.
వాస్తవానికి భగవంతుని ఆయుధాలు, ఆభరణాలు, అంబరాలు ఆయనకంటే అతిరిక్తాలు- వేరు గావు. అవి అన్నీ ఆయన స్వరూప భూతాలు- దివ్యదేహం నుంచి విడదీయరానివి. కురుక్షేత్ర రణభూమిలో కిరీటి (అర్జునుని) కోరికను తీరుస్తూ ఉభయ సైన్యాల మధ్య తేరు (రథం) నిలిపి, వైరి పక్షంలోని వీరులను పేరుపేరునా వేలెత్తి చూపుతూ, వారిని తేరిపారా చూస్తూ, తన చూపులనే తూపులతోనే ఆ భూపతు(రాజు)ల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించి, వారిని రూపుమాపి అర్జునునికి విజయం చేకూర్చిన విజయసారథి భక్తపాలన తీరే వేరు! ఆహా! అది ఊహాతీతం.
పరమాత్మ హరి తన పట్టపుదేవి అయిన సిరి (శ్రీదేవి) పుట్టపు (చీర) పైట కొంగును విడువక పట్టుకొని లాగుతూ పోతూండగా, పతిని వెన్నెంటి పోతూ ఆయన సంరంభానికి- త్వరకి, తొట్రుపాటుకు కారణం తెలియక పరిపరివిధాల ఊహాపోహలు చెయ్యడం కూడా పోతన మరో మత్తేభ వృత్తంలో పేర్కొన్నాడు…
విభుడు (భర్త) తాను వెళ్లే చోటు వెల్లడించలేదే! మరోసారి మరో అనాథ స్త్రీ- ద్రౌపది లాంటి దిక్కులేని దీనాలాపాలు విన్నాడా? సోమకాసురుని వంటి దుర్మార్గులు, ముష్కరులు- దొంగలు వేదాలను తస్కరించారా? అమరుల రాజధాని అమరావతిపై అసురానీకం- దనుజుల మూకలు దండయాత్ర చేశాయా? చక్రధారి విష్ణువు ఎక్కడున్నాడో చూపమని వక్రబుద్ధిగల హిరణ్యకశిపుని వంటి దుష్టులు అక్రమంగా కినుక పూని ప్రహ్లాదుని వంటి భక్తులను ధిక్కరించారా?… ఇలా అనుకుంటూ లక్ష్మీదేవి ఎన్ని విధాలుగానో అనుమానపడి కూడా మిన్నకుండిపోయింది.
గజేంద్రమోక్షణ కథ జరిగింది ‘తామస’మనే పేరుగల నాలుగవ మన్వంతరంలో. మన్వంతరం అంటే లక్షల సంవత్సరాల సుదీర్ఘకాలం. సోమకాసుర, ప్రహ్లాదుల కథలు కూడా మిక్కిలి ప్రాచీనాలు. భారతంలోని ద్రౌపది చరిత్ర మాత్రం అర్వాచీనం- ఇప్పటికి కేవలం ఐదువేలకు పైగా సంవత్సరాల క్రితం జరిగింది. ఇలా ఆధునికమైన వైవస్వత మన్వంతరంలో జరిగిన ద్రౌపది వృత్తాంతాన్ని అతిప్రాచీనమైన తామస మన్వంతరంలో ఉదహరించుట, ఉటంకించుట ఎలా చెల్లుతుంది? ఇది ఎంతవరకు సమంజసం? ఈ సందర్భంలో ‘కాలాతిక్రమణం’ అనే దోషం చోటు చేసుకుందని అమాత్యుని మీద ఆక్షేపణ! భూమి మీద ఉన్న జీవులకు ఏ కాలానికి ఆ కాలమే విడివిడిగా ఖండాత్మకంగా గోచరిస్తుంది. కాని, అఖండ కాలస్వరూపుడైన పరమాత్మకు- కాలాధీశ్వరునికి, అన్ని కాలాలూ సమానమే. భూత, భవిష్యత్తులు రెండూ వర్తమాన కాలాలే! కాన, ఇక్కడ ‘కాలాతిక్రమణం’ లేదని కవిసమ్రాట్ విశ్వనాథవారు పరిష్కరించారు. అదీకాక, గజేంద్ర మోక్షణ కథ ఒక అర్థవాదం, ప్రతీకాత్మకం- సాంకేతికమని చెప్పుకొన్నాం. దీనిద్వారా భగవత్ శరణాగతి తత్తాన్ని, పన్నగశాయి భక్తపాలన కళా సంరంభాన్ని సరసంగా వివరించి విన్నవించడమే పోతన్నగారి ఆశయం!
(సశేషం)
మ॥ ‘తన వేంచేయు పథంబుఁ పేర్కొనఁ డనాథ స్త్రీ జనాలాపముల్
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలున్ వేద ప్రపంచంబులన్
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో! భక్తులం
గని చక్రాయుధుఁ డేడి చూపుఁడని ధిక్కారించిరో దుర్జనుల్’
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006