ఒక ఊర్లో తిరునాళ్లకు హరికథ ఏర్పాటు చేశారు. హరికథ చెప్పడానికి ప్రముఖ భాగవతార్ తన బృందంతో వచ్చాడు. ‘పాండవ వనవాసం’ కథను అందుకున్నాడు. అప్పుడప్పుడూ కథకుడు ‘గోవింద’లు చెబుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నా.. ఆయనలో ఉత్సాహం కనిపించడం లేదు. పక్కవాద్యగాళ్లూ అంతే నిరుత్సాహంగా కనిపించారు.
హరికథ వినడానికి వచ్చిన భక్తులు మెల్లగా అక్కణ్నుంచి జారుకోవడం మొదలుపెట్టారు. విషయం గ్రహించిన ఊరి పెద్ద.. తమ గ్రామానికి చెందిన వృద్ధ కళాకారుడితో ‘అయ్యా! కథాగానం ఇలా చప్పగా సాగితే.. భక్తులు ఉండేలా లేరు’ అన్నాడు. అప్పుడా పెద్దాయన.. ‘కళాకారులకు ధనవస్తువాహనాల కన్నా.. గుర్తింపు ముఖ్యం. చిన్నపాటి మెప్పుతో పొంగిపోతారు. మంచి పూలదండ తెచ్చి అతని మెడలో వేయండి’ అని చెప్పాడు. నిర్వాహకులు పరుగున వెళ్లి ఓ దండ తెచ్చి భాగవతార్ మెడలో వేశారు. రెట్టించిన ఉత్సాహంతో కథ మొదలుపెట్టాడు భాగవతార్. తన ఆంగిక అభినయాలతో ప్రతి ఘట్టాన్నీ కండ్లకు కట్టినట్టు వర్ణించసాగాడు. భక్తులు మహదానందం పొందారు. అందరూ భక్తిశ్రద్ధలతో ‘గోవింద’లు పలికారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821