శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి!
(సౌందర్యలహరి -1)
అమ్మా! సకల మంగళోపేతుడైన సదాశివుడు కూడా నీతో కలిస్తే గాని ఈ జగత్తు ను సృజించలేడు. నీతో కలవని సదాశివునికి స్పందించడానికి (కదలడానికి) కూడా శక్తి లేదు. త్రిమూర్తులు మొదలైన దేవతల పూజలందుకునే నీకు నమస్క రించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా పూర్వజన్మ సుకృత ఫలం ఉండాలి.
ఇక్కడ పేర్కొన్న ‘హరిహర విరించి’లో ‘హరుడు’త్రిమూర్తులలోని శంకరుడు కాదని గుర్తించాలి. ఈ శివుడిని సదాశివుడు అంటాం. సృష్టికి ఇతడే ఈశ్వరుడు (ప్రభువు). అనేక రకాలైన పనులు చేసే శక్తిని ‘ప్రభువు’ అంటాం. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం అనేవి పంచకృత్యాలు. వీటిని నిర్వహించే శక్తి కలిగినవాడు సదాశివుడు. మరి అతనికా ‘శక్తి’ ఎలా వచ్చింది అంటే శక్తిని కూడి ఉండటం వల్ల మాత్రమే. ఇక్కడ ‘దేవ’ అనే మరొక శబ్దం ప్రయోగించారు. అంటే స్వయం ప్రకాశ స్వభావం కలిగినవాడు, సార రూపంగా సృష్టి అంతటా దాగి ఉన్నవాడు. అమ్మవారిని ‘స్వప్రకాశా’ అని సంబోధించారు. అంటే తన ప్రకాశంతో అన్నిటినీ వెలిగించే తల్లి అంటుంది లలితా సహస్రనామం.
సృష్టికి ముందు శక్తి మాత్రమే అంతటా ఉన్నది. ఆమే త్రిమూర్తులను సృజించిం ది. తదుపరి సకల సృష్టి జరిగింది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ శక్తి మరొక పార్శ్వమే సదాశివుడు. ఆయనలో సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. దానితో సదాశివుడిలో సత్యమైన స్పందనలు (కదలికలు, ప్రకంపనలు) కలిగాయి. అవి అమ్మవారి ‘ఇచ్ఛ’ వల్ల కలిగినవే! సత్యమైన అంటే అవి వ్యర్థమైనవి కావని భావం. ఆ స్పందనలకు సృష్టి జరగడమనే ప్రయోజనం ఉన్నది. ఏదైనా జరుగు తున్నదని చెబితే దానిని ఎవరో చేస్తున్నారనే కదా! అంటే వారిలో సంకల్పం ఉన్నది, కామన (కోరిక) ఉన్నది. సంకల్పం, కామనలు కలవడమే ‘ఇచ్ఛ’. చేస్తాను అనేది ‘సంకల్పం’ అయితే, చేయాలి అనేది ‘కామన’. చేయడానికి ఏం కావాలో, ఎలా చేయాలో తెలుసుకోవడం ‘జ్ఞానం‘. ఇచ్ఛ ఉన్నది, జ్ఞానం ఉన్నది.. కార్యం జరుగుతుందా? దానిని చేయాలి. అదే ‘క్రియ’. సదాశివుడు ఇచ్ఛాశక్తితో కలిసినప్పుడే కార్యం సాకారమవుతుంది. జ్ఞాన క్రియాశక్తులు కలిసి ఇచ్ఛాశక్తిని పరిపూర్ణం చేస్తాయి. ఆ ఇచ్ఛాశక్తినే ‘శివా’ అనీ, అమ్మవారు అనీ అంటున్నాం. ‘శివుడు’ శివానితో కలిసినప్పుడే ఏదైనా చేయడానికి సమర్థత కలిగి ఉంటాడు.
శివునిచే ఆరాధింపబడినది (శివారాధ్యా). శివము అంటే పరమానందమే తానై భాసించేది (శివపరా). భక్తులకు ఆనందాన్ని, శుభాలను, మోక్షాన్ని ప్రసాదించే చిద్రూపిణి లలితామాత (శివంకరీ). సృజన చేయాలనే కోరిక కలిగిన ఈశ్వరుని చే సేవించబడునది (కామసేవితా). ఆ కామనను వికసింపచేయునది (కామాక్షీ) అంటుంది లలితా సహస్రనామం. ‘శక్తిః ప్రాణశ్చ జీవశ్చ మంత్రోనాదః శివోరపి’ అంటే మంత్రశాస్త్రం సిద్ధించాలన్నా శక్తే.. ప్రాణం, జీవం అవుతున్నది. వర్ణమాలలో ‘అ’ నుంచి ‘అః’ వరకున్న అచ్చులు శక్తిరూపాలుగా, ‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న హల్లులు శివుని రూపాలుగా చెబుతారు. నిజానికి శివశక్తి రూపాలు వేర్వేరు కాదు. ఒకటి లేకుండా మరొకటి లేదు. అందుకే అమ్మను ‘శివశకత్యుక్య రూపిణి’, శివశక్తుల అద్వైత బిందు స్వరూపం అంటుంది లలితా సహస్రనామం. అద్వైత స్వరూపమైన ఆ శివశక్తులు మనందరికీ శ్రేయస్సును అనుగ్రహించాలని కోరుకుందాం.
పాలకుర్తి రామమూర్తి