ఒక నడి వయస్కుడు తీవ్రమైన ఆలోచనలతో ఆశ్రమంలోని గురువు దగ్గరికి వెళ్లాడు. తనకు పెండ్లయి పదేండ్లు అయ్యిందని, భార్యతో పొసగడం లేదని వాపోయాడు. ఆమెను భరించలేక వచ్చేశానని చెప్పాడు. తనను ఆశ్రమంలో చేర్చుకోవాల్సిందిగా గురువును అభ్యర్థించాడు. ‘మూడురోజులు ఆశ్రమంలో గడిపాక నిర్ణయం తీసుకోమ’న్నాడు గురువు. మర్నాడు ఉదయమే అతణ్ని పిలిపించి ‘ఈ మూడు రోజులు ఆశ్రమంలోని ఉచిత వైద్యశాలలో ఉంటూ, రోగులకూ, వైద్యులకూ సాయం చేయమ’ని చెప్పాడు. మూడు రోజులు గురువు చెప్పినట్టే అతను చేశాడు. నాలుగో రోజు ఉదయాన్నే గురువును కలిశాడు. ‘రోగులను చూడటానికి ఎవరెవరు వచ్చేవారు?’ అని అడిగాడు గురువు.
‘రోగి పిల్లలు, బంధువులు, స్నేహితులు ఇలా చాలామంది వచ్చేవారు’ అని ఎంతో ఉత్సాహంగా బదులిచ్చాడు. ‘ఎక్కువ సమయం రోగితోనే ఉండి సపర్యలు చేసిందెవరు?’ అని అడిగాడు గురువు. ‘రోగి భార్య’ అని బదులిచ్చాడు. గురువు చిన్నగా నవ్వి ‘గమనించావా! అనారోగ్యంతో ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు పండ్లు, పాలు తీసుకొని వచ్చి పలకరిస్తారు. కాసేపు ఉండి వెళ్లిపోతారు. కట్టుకున్న భార్య మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. భర్త క్షేమం కోరి సేవలు అందించిన నిజమైన సహచరి ఆమే అని తెలుసుకో!’ అన్నాడు. గురువు మాటలతో అతనికి జ్ఞానోదయం అయింది. గురువుకు నమస్కరించి ఇంటిదారి పట్టాడు. భార్యతో కలిసి హాయిగా జీవించసాగాడు. వీలున్నప్పుడల్లా భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి ఆశ్రమంలో సేవలు చేయడం మొదలుపెట్టారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821