అసుర చక్రవర్తి బలి సాత్తికుడు కాకపోయినా అధార్మికుడు మాత్రం కాదు. గొప్ప బ్రాహ్మణ గురు భక్తుడు. సత్యసంధుడు, వదాన్యశేఖరుడు.
శ్రీ శుకముని పరీక్షిత్తుతో.. రాజా!..
శా॥ అర్థుల్ వేఁడరు, దాతలుం జెడరు,
సర్వారంభముల్ పండుఁ, బ్ర
త్యర్థుల్ లేరు, మహోత్సవంబులను
దేవాగారముల్ వొల్చుఁ, బూ
ర్ణార్థుల్ విప్రులు, వర్షముల్ గురియుఁ
గాలార్హంబులై ధాత్రికిన్
సార్థంబయ్యె వసుంధరాత్వ
మసురేంద్రాధీశు రాజ్యంబునన్’
‘బలి రాజ్యంలో సమర్థులైన దాతలకు లోటులేదు. కాని, చేయి చాచి దానమడిగే అర్థులే లేరు. అతనికి ప్రత్యర్థులు- పగవారు అసలే లేరు. ఇలలో తలపెట్టిన ప్రజల పనులన్నీ అలవోకగా సఫలమయ్యేవి. దేవాలయాలన్నీ ఉత్సవాల వేడుకలతో దేదీప్యమానంగా వెలిగిపోయేవి. భూసురుల- బ్రాహ్మణుల కోరికలు భాసురంగా తీరేవి. సకాల వర్షాలే కాని అకాల వర్షాలు- అతివృష్టి అనావృష్టులు లేవు. అసురేంద్రుడు బలి పాలనలో అవని (భూమి)కి వసుమతి (ధన ధాన్య సమృద్ధిగలది) అన్నపేరు అన్వర్థ (సార్థక)మైంది.’ బలి సామ్రాజ్యపు వైభవ ప్రాభవాలను వర్ణించిన పై వృత్తం (పద్యం) అమూలకం. అమాత్యుని సొంతం. ఆ మహనీయుని ‘ధర్మ’ దర్శనానికి నిదర్శనం! పాలకుడు ధార్మికుడైతే పాలితులు పలువిధాల సుఖాలు పొందుతారు. విత్తం కన్నా వృత్త (శీల)మే మిన్న- పవిత్రమని భావించి శుద్ధమైన జీవనం గడిపిన సిద్ధ పురుషుడు భక్త కవిరాజు బమ్మెర పోతరాజు!
శుక ఉవాచ- రాజా! అనంత భగవానుడు అంతర్ధానమయ్యే ముందు అదితితో అర్థవంతంగా ఇలా అన్నాడు.. ‘అమ్మా! ఇది అసురులకు అనుకూలమైన కాలం. ఇప్పుడు వారిని వారించి ఓడించడం దానవారి (రాక్షస విరోధి)నైన నాకు కూడా కూడని పని. ఆడితప్పని ధర్మపరుడి (బలి) మీద అమరులతో కూడి దాడికి పూనడం ధర్మ స్వరూపుడైన నాకు పాడికాదు. అయినా అమ్మా! నీ వేడుకోలును వమ్ముకానివ్వను. నేను నేనుగా- వెన్నుని (విష్ణువు)గా ఉన్నపళంగా నీ కుమారులను రక్షించలేను. కాన, నీ కన్నకొడుకునై అన్నివిధాల వారిని కాపాడతా’
కం॥ ‘నెలఁతకుఁ జూలై నెల రె
న్నెలలై మరి మూఁడునాల్గు నెలలై వరుసన్
నెల లంత కంత కెక్కఁగ
నెలలును డగ్గరిమె నసుర నిర్మూలతకున్’
రాజా! ఒకనాడు తపోనిష్ఠుడైన కశ్యపునిలో విష్ఠరశ్రవుని- విష్ణుని, వీర్యం ప్రవిష్టమైంది- ప్రవేశించింది. గాలి కాష్ఠం- కొయ్యలో అగ్నిని ఆధానం- ఉంచునట్లు, ప్రజాపతి తన అసాధారణ తేజస్సును సతి అదితితో చేర్చాడు. ఆ తల్లి ఉల్లం- మనసు చల్లబడి చాలా ఉల్లాసం పొందింది.
‘అవనీపతీ! అదితి చూలాలై ఒకటి, రెండు, మూడు, నాలుగు నెలలు గడిచాయి. అంతకంతకూ నెలలు పెరిగాయి. దానితోపాటు దానవ సమూహాల అంతానికి- వినాశనానికి కూడా మాసాలు మరింతగా సమీపించాయి.’ ఈ కంద పద్యం మునుముందు రాగల, వామనుడు విశ్వరూపం పొంది విజృంభించు సందర్భంలోని ‘ఇంతింతై వటుడింతయై’ అన్న శార్దూల వృత్తాన్ని స్ఫురణకు తెచ్చేదిగా లేదూ?
అదితి గర్భంలో అర్భకుడై (పసివాడై) అలరారుతున్న విశ్వగర్భుని హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు) అనేక ‘గుహ్య’- రహస్య నామాలతో స్తుతించాడు. ఇక్కడ ‘గుహ్య’ అంటే ‘ఎవ్వరికీ అందకుండా దాచిపెట్టిన నామాలని కాదు అర్థం. సంసార- ప్రపంచాసక్తులైన వారికి ఏ మాత్రం అందని పరమ మహిమతో కూడినవ’ని స్వామి తత్తవిదానంద వ్యాఖ్య. ఈ నామాలలో ‘ఉరుక్రముడు’ (పెద్దపెద్ద పాద విక్షేపాలు- అంగలు కలవాడు) అన్నది ఈ ఘట్టంలో వెనువెంటనే రాగల ‘వామన’ అవతారాన్ని సూచించే నామం. పరీక్షిన్మహారాజా! అది శ్రావణ మాసం, శుక్ల పక్షం, శ్రవణ (విజయా) ద్వాదశీ తిథి. శ్రవణంలో చంద్రుడు, సూర్యాది గ్రహ నక్షత్రాలు ఉచ్చదశలో ఉండగా అభిజిత్ లగ్నంలో- పట్టపగలు సూర్యుడు నడినెత్తిన వెలుగుతున్నప్పుడు శంఖ, చక్ర, గదా, పద్మ ధారియై అత్యద్భుతంగా ‘వామన’ రూపంలో విష్ణువు ఆవిర్భవించాడు. వెంటనే ఉపనయన యోగ్య వయసు కలిగిన వటువుగా మారు రూపం పొందాడు. ఆ వామన రూపం చూసి అదితి ఆనన వారిజం- ముఖ కమలం విప్పారింది. ఆమె ఆనందంతో మైమరచింది. ఈ సందర్భంలో మృదుమధురమైన మాతృభావ బంధురమై, వాత్సల్యరస సిక్త (స్నిగ్ధ)ములైన రెండు ఉత్తమ స్వీయ పద్యాలను- ముద్దులు మూటగట్టే ఒక ఆటవెలదిని, సుందర సుకుమారమైన ఒక కందాన్ని అందించాడు రససిద్ధుడు అమాత్యుడు..
ఆ॥ నన్నుఁగన్న తండ్రి! నా పాలిదైవమ!
నా తపఃఫలంబ! నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపక!
రాగదయ్య భాగ్యరాశి వగుచు’
కం॥ ‘అన్నా! రమ్మని డగ్గరిఁ
చన్నుల పాలేరు వార సంశ్లేషిణియై
చిన్నారి మొగము నివురుచుఁ
గన్నారం జూచెఁ గన్నకడుపై యుండన్’
కన్నబిడ్డ అయిన వామనుని కన్న అదితి- ‘నా కన్నతండ్రీ! నా పాలిదేవుడా! నా నోములపంటా! నా ముద్దుల మూటా! నా వన్నెచిన్నెల వడుగా! నా ఇంటి వెలుగా! నా వంశాలంకారమా! అన్నా! ఓ నా పెన్నిధీ! నా సన్నిధికి రావయ్యా!’ అంటూ చనుబాలు జాలువారగా ఆ ఉత్తమురాలు సుగుణాలవాలు, దయా విశాలుడైన బాలుని దగ్గరికి పిలిచింది. అతని చిన్నారి మొగం దువ్వి, కన్నుల నిండుగా గాంచి అక్కున చేర్చుకుంది.
అనంతరం కశ్యపుని ముందుంచుకొని మహర్షులు వామనునికి వడుగు చేశారు. సూర్యుడు గాయత్రీ మంత్రమిచ్చాడు. బృహస్పతి జన్నిదం, కశ్యపుడు ముంజదర్భల మొలత్రాడు, సరస్వతి జపమాల, సప్తర్షులు కుశలు- దర్భలు, కుబేరుడు సువర్ణ భిక్షాపాత్ర ఇవ్వగా అపర్ణ- అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ‘అక్షయం’ అంటూ బ్రహ్మచారికి- శివునికి పెట్టిన చేతితోనే కేశవునికి కూడా భిక్షపెట్టింది- ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’- హరిహర అద్వైతమే తత్త్వమని చాటుతూ! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006