దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్
ద్విత అంటే రెండు. అద్విత అంటే రెండుగా లేనిది. బయటికి చూడటానికి రెండుగా కనిపించినా, రెండు కాకుండా ఒకటే ఉండేది అని అర్థం. ఇది సాధారణమైన దృష్టికి అర్థం కాదు. అందరూ రెండుగా ఉన్నదనే అనుకుంటారు. లోపల ఉండే అజ్ఞానం తొలగిపోతే రెండూ ఒకటే అని అర్థమవుతుంది. అదే అద్వైతం. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి మనిషికి స్పష్టమైన జ్ఞానపథాన్ని ఇచ్చిన మహనీయులు, మహర్షి, దార్శనికులు శంకర భగవత్పాదులు
మనిషికి బయట అందరికీ కనిపించే దేహం ఉంటుంది. దీన్ని నిర్వహించేదాన్ని మనసు అంటుంటాం. దేహమైనా, మనసైనా ఒక శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. ఆ శక్తి లేనప్పుడు మనసు, దేహం రెండూ పనిచేయవు. ఆ శక్తినే దైవం అంటాం. వ్యక్తమైనవన్నీ జీవులు. కనిపించని దేవుడు ఈ జీవులను నిర్వహిస్తున్నాడనే భావన పైనా కొన్ని అభిప్రాయ భేదాలు వస్తూనే ఉన్నాయి. మాయ అనే అజ్ఞానంతో కూడుకున్న మనసును జీవుడనీ, మాయామర్మాలు లేకుండా, జ్ఞానాత్మకమైన మనసే దేవుడనీ ప్రతిపాదించినవారు ఆదిశంకరాచార్యులు.
సృష్టిలో ఎప్పుడూ దైవమే ఉంటుంది. అజ్ఞానం వల్ల, మోహం వల్ల మలినాన్ని అంటించుకోవడం ద్వారా ఆ దైవం జీవంగా మారుతుంది. అజ్ఞానాన్ని తొలగించుకున్న జీవుడే దేవుడని అద్వైత సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా జగద్గురువు శంకరులు ఎన్నో భాష్యాలు రాశారు. ఆనాడు ఉన్న సంప్రదాయాల్లోని వైవిధ్యాలను చాలావరకు తొలగించి శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, స్కాందం.. ఇలా షణ్మతాలు (సంప్రదాయాలు) స్థాపించడంతోపాటు పంచాయతన భావాన్ని లోకానికి పరిచయం చేశారు. ఎన్నో మఠాలను, పీఠాలను వ్యవస్థాపన చేసి అద్వైత ధర్మ ప్రచారం చేశారు.అందరికీ అద్వైతాన్ని అందించాలనే లక్ష్యంతో సాగిన శంకరుల వారి ఏకశ్లోకీ ఉపదేశం నేటికీ ప్రామాణికంగా నిలుస్తుంది. అద్వైత ఉపదేశానికి ఇది పరాకాష్ఠగా కనిపిస్తుంది. ఏకశ్లోకీ ఉపదేశం.. ప్రశ్న-సమాధాన పరంగా కొనసాగుతుంది.
“కిం జ్యోతిస్తవ భానుమానహనిమే
రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవి దీపదర్శన విధౌ
కింజ్యోతిరాఖ్యాహిమే
చక్షుః తస్య నిమీలనాది సమయే కిం?
ధీః ధియోదర్శనే
కిం తత్రాహమతో భవాన్ పరమకం
జ్యోతిః తదస్మి ప్రభో!”
కింజ్యోతిస్తవ? = నీకు వెలుగు ఏమిటి?; భానుమానహనిమే = ఉదయ కాలంలో సూర్యుడు వెలుగు; రాత్రౌ? = మరి రాత్రిపూట; ప్రదీపాదికం స్యాత్ = దీపాదులు అన్నీ కూడా; ఏవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే = రవి, చంద్ర, దీపాదులను గుర్తించి దర్శిస్తున్న వెలుగు ఏమిటి?; చక్షుః = నా కళ్లు; తస్య నిమీలనాది సమయే కిం? = కళ్లు మూసుకున్నప్పుడు కూడా ఏవో కనిపిస్తున్నాయి కదా! అలా చూసేదెవరు?; ధీః = నా మనసు (నా మనసు నా కన్ను ద్వారా చూస్తుంది); ధియో దర్శనే కిం? = నీ మనసును దర్శించేదెవరు?; కిం తత్ర అహం = ఇంకెవరు నేనే (ఆత్మ స్వరూపమైన నేను మాత్రమే నా మనసును దర్శించగలను); అతో భవాన్ పరమకం జ్యోతిః = అయితే నీవు మాత్రమే పరమమైన జ్యోతివి; తదస్మి ప్రభో = స్వామీ! అది నేనే అయి ఉన్నాను.
ప్రతి జీవుడు తాను వెలుగుననీ, ఒక వెలుగు మాత్రమే మరో వెలుగు ద్వారా లోకమనే వెలుగును దర్శించగలదనే భావం ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. మూలమైన తనలోని వెలుగును ముందుగా తెలుసుకోవాలి. తానే వెలుగుగా మారాలి. మానవుని పరిణామం ఇదే. ఇది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. కర్మబంధాల ద్వారా అంటుకున్న మలినాలను జ్ఞానాగ్నితో మాత్రమే తొలగించుకోగలం. ఆ మార్గానికి మనల్ని పంపించేందుకు అనేక గ్రంథాలను రాసి భారతీయ జీవన విధానానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మార్గనిర్దేశనం చేసి లోకగురువై, భగవత్ సమానుడై నిలిచిన ఆ శంకరులు నిరంతర స్మరణీయులు. వారి అద్వైత మార్గం లోకానికి సదా అనుసరణీయం.
…? సాగి కమలాకర శర్మ 9704227744