‘భగవాన్ భక్త భక్తిమాన్’- భాగవతంలో భగవంతుడు కూడా భక్తుని భజిస్తాడు- సేవిస్తాడు! భక్తుల కొరకు రోదిస్తాడు, ఉద్విగ్నుడౌతాడు, పరితపిస్తాడు. గిరిధారి హరి పరిపరి విధాల భక్తులను కనికరిస్తాడు. వారి భద్రతకై తాను నిద్రను కూడా త్యజిస్తాడు. క్షము (సర్వసమర్థు)డైనా వారిని క్షమించమని వేడుకొంటాడు. వారి ప్రేమకు లోనై కాపాడటానికి కాని పనికైనా పూనుకొంటాడు! తన వారి ప్రతిన (ప్రతిజ్ఞ)ను కొమ్ముకాయడానికి తన ప్రతినను వమ్ము చేయడానికి కూడా వెనుకాడడు. తాను ఎంత భక్త పరాధీనుడంటే నిత్యముక్తుడైనా అస్వతంత్రుని వలె బంధనం స్వీకరిస్తాడు!
శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! నిర్దోషి, హిత మిత భాషి, మహా మనీషి ఐన అంబరీషునే ఆశ్రయించమని పీతాంబరుడు అచ్యుతుడు ఆనతివ్వగా, చక్రజ్వాలల వల్ల మిక్కిలి ఆయాసం పొందినవాడూ, వికాసం- తేజస్సు పోగొట్టుకొన్నవాడూ, రొప్పుతున్నవాడూ ఐన దుర్వాసునికి అప్పటికి ఊపిరి (శ్వాస) ఆడింది. ఆఘమేఘాల మీద వచ్చి ఆ అవనీపతి అంఘ్రి (పాద) పద్మాలను విడువకుండా పట్టుకొన్నాడు. ఆ చక్రవర్తి తన చరణ స్పర్శకు సిగ్గుపడుతూ- వెనుకాడుతూ, కరుణతో నిండిన హృదయంతో సర్వశరణ్యమైన సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు… ‘నీరజాక్షుండు చాల మన్నించు నట్టి, శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని’- అవక్ర పరాక్రమంతో పేరెన్నికగన్న ప్రధాన శస్త్రమా! ఓ సుదర్శన చక్రమా! నిన్ను త్రివిక్రముడు బాగా మన్నిస్తాడు. నీకు పదేపదే నమస్కారం. ఆపదకు చిక్కిన ఈ మునిని కాపాడు. నాకదే చాలు! నాకు విహిత- విధింపబడిన ధర్మమార్గంలో నేను వర్తించే- నడచే వాణ్నయితే; వేద విదులు, బీద సాదలు యాచకులై వచ్చి కోరిన ద్రవ్యాన్ని లేదు కాదనక మోదంతో ఇచ్చే దాతనైతే; ధరణీసురుడు- బ్రాహ్మణుడు మాకు దైవ స్వరూపుడైతే ఈ మహర్షికి హర్షం కలుగుగాక!
కం॥ ‘అఖిల గుణాశ్రయుఁడగు హరి
సుఖియై నా కొలువు వలనఁ జొక్కెడి నేనిన్
నిఖిలాత్మమయుండగుటకు
సుఖమందుం గాక భూమిసురుఁ డివ్వేళన్’
‘సమస్త గుణాలకు ఆశ్రయుడైన శ్రీహరి నా సేవ వల్ల సంతుష్టుడైనట్లయితే, ఆ స్వామి సమస్త శరీర ధారులందు ఆత్మ స్వరూపంగా దర్శనీయుడై ఉన్నందుకు నిదర్శనంగా ఓ సుదర్శనమా! ఈ భూసురుడు ఇక సుఖాన్ని పొందుగాక!’ అని పృథ్వీపతి ప్రార్థించగా చక్రం మహర్షిని మన్నించి మరలిపోయింది. అప్పుడు మునీంద్రుడు శాంతిని పొంది దాంతుడైన రాజచంద్రుని దీవిస్తూ ఇలా చల్లగా పలికాడు… సార్వభౌమా! నా తప్పు సైరించి, ముప్పు తొలగించి నాకు గొప్ప మేలు చేశావు. లోకాంతరంగుడు శ్రీకాంతుని పద పద్మాలను మదిలో ఇంత పదిలంగా నమ్మి సేవించిన ఏకాంత భక్తుడివా మహానుభావా? ఎంత ఆశ్చర్యం? నీ వంటి సాధువుకు ఇది వింత- అరుదేమీ కాదు. కోరింది సమకూర్చడం, దరి చేరిన వారిని కూరిమితో కాపాడటం- అనేవి నీ వంటి హరిదాసులకు సహజ గుణాలై స్నేహభావంతో సరసంగా సంప్రాప్తిస్తాయి కదా!
మ॥ ‘ఒక మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్
సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో నట్టి స
త్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశుఁ దా
నకలంకస్థితి గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!’
అంతమాత్రమే కాదు, అవనీపతీ!…
‘ఎవ్వని పేరు ఒక్కమారైనా వీనులకు ఒయ్యారంగా- విలాసంగా సోకితే చాలు, సమస్త పాపాలు పటాపంచలై పోతాయో, అట్టి భక్త సులభుడూ, భృత్య వత్సలుడూ, చరణ కమలాలలో మంగళకరమైన (లోకపావన) తీర్థం- గంగ కలిగిన వాడు ఐన శ్రీకరుని- విష్ణువుని నిర్మలమైన మనసుతో సేవించు భక్తులకు అడ్డమేమీ ఉండదు కదా!’
చమత్కారాలు చేసి చూపిస్తేనే చేతులెత్తి నమస్కారాలు చేస్తూ గోతిలో పడే బహు చెడ్డకాలమిది! ఆ మత్తులో చిత్తయి చేదు అనుభవాలు ఎదురైతే ఆపై మరమ్మత్తులకు ఆదుకొనేవారెవరా అని తల బాదుకుంటూ ఛీత్కారాలు, ఫూత్కారాలు చేస్తారు! సాధు భక్తుల, మహాత్ముల మహిమ సిద్ధులలో, మాయలు చూపడంలో ఉండదు. తన అపరాధిని కూడా మన్నించి ఉపచారం- మేలు చేయడంలోనే భక్తుని మహిమ- సదాచారం. సిద్ధుల- మహిమల ప్రదర్శనం శుద్ధ భక్తికి నిదర్శనం కాదని భాగవత దర్శనం! సుకరుని- శుభంకరుడైన భగవంతుని ‘సర్వస్వం’గా స్వీకరించిన భక్తులకు ఇతర భౌతిక ప్రయోజనాలు సేకరించాల్సిన అగత్యం ఉండదు.
‘యన్నామ శ్రుతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః’ (ఏ పూతాత్ముని పవిత్ర నామ శ్రవణ మాత్రం చేతనే పురుషుడు సకల పాతకాల నుంచి విముక్తుడవుతాడో..) అని మాత్రమే మూలం. ‘ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక, దేహతాపంబులు దీరిపోవు’- (కంసాంతకా! నీ కల్యాణ గుణాలు చెవులకు సోకితే చాలు, తనువు (శరీరం) తాపాలన్నీ తీరిపోతాయి)- రుక్మిణీదేవి ప్రణయ సందేశంలోని (శ్రుత్వా గుణాన్ భువనసుందర!) ‘శ్రుత్వా’ అన్న క్రియా పదాన్ని ‘సోక’ అని మాత్రమే అనువదించాడు అమాత్యుడు. కాని, పై మత్తేభ వృత్తంలో అయ్యారే! బమ్మెర పోతనార్యా! అమ్మక చెల్ల! (ఔరా) భావుక భక్తులు తమ హృదయాలను అమ్మక చెల్లని (తప్పని) రీతిలో దుర్వాసుల వారి ద్వారా ‘ఒయ్యారమై సోకినన్’ అని భగవన్నామ ప్రీతిని, ఖ్యాతిగాంచిన ఓ భక్తకవీ! ఎంత కమ్మగా పలికించావయ్యా!
శుక ఉవాచ.. రాజా! అంబరీషుడు ముని పాదాలకు మొక్కి, ఎంతో మన్నన చేసి- ఆదరించి, సుష్ఠుగా అన్నం పెట్టించాడు. దుర్వాసుడు తృప్తిపొంది క్రన్న- మరల వెంటనే ఇలా అన్నాడు..
శా॥ ‘కంటిన్ నేఁటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా
వింటి న్నన్నముఁ గొంటి నీ గృహమునన్ వేడ్కన్ ఫలంబబ్బె నే
మంటిన్ బోయెద! నీ చరిత్ర మమరుల్ మర్త్యుల్ సుఖాసీనులై
మింటన్ మేదిని సన్నుతింపఁ గల రీమీఁదన్నరేంద్రాగ్రణీ!’
‘నరనాథోత్తమా! ఈ నాటికి నిన్ను కళ్లారా కనగలిగాను. నీ అమృత వాక్కులను వీనులారా విన్నాను. నీ భవనంలో కడుపారా భుజించాను. నాకు కూడా ద్వాదశీ వ్రతఫలం దక్కింది. ఇక మీదట నాకం (స్వర్గం)లో సురులూ (దేవతలూ), భూలోకంలోని నరులూ నీ నడవడిని వేనోళ్ల నుతిస్తారు. నరపతీ! ఇక వెళ్లొస్తా’ అని వక్కాణించి దుర్వాసుడు అంబరీషుణ్ని ఆశీర్వదించి, అభినందించి, ఆకాశమార్గాన ఎంచక్కా బ్రహ్మలోకానికి చేరుకొన్నాడు. దుర్వాసుడు తిరిగి వచ్చి వెళ్లే వరకు ఒక వత్సరం నిండి వ్రతం ముగిసింది. అంబరీషుడు సంవత్సర పర్యంతం ఉపవసించాడు. ‘మహర్షి వంతను- కష్టాన్ని మాన్పడానికి నేనెంతటి వాణ్ని? అంతా శ్రీకాంతుని మహిమ!’ అని మనస్సులో తలచి ముని తిన్న తరువాత ఆ పవిత్రమైన అన్నశేషాన్ని అంబరీషుడు తిన్నగా ఆరగించాడు.
కుచేల, దుర్వాస నామాలు సమానార్థకాలు. ‘దుష్టాని వాసాంసి యస్య’- చినిగిన, చింపిరి, మాసిన గుడ్డలు ధరించువాడు కాన దుర్వాసుడు. అష్టమూర్తి- రుద్రుని అంశ. కోపిష్టి అని ఆయన గురించి లోకంలో ఒక పాపిష్టి ప్రచారముంది. కాని, ఆ ముని భక్తులకు హాని కలిగించే దుష్టుడు కానే కాదు. ఉపరి, తన లీలల మాటున భక్తి, భక్తుల మహిమను ఉద్దీప్త- వృద్ధి పరచి లోకానికి చాటిచెప్పేవాడు. జగన్నాటక సూత్రధారి సాగించే ఆటలలో నారదుని వలె సాటిలేని మేటి పాత్రధారి! ద్వాదశీ వ్రత పారణ సమయంలో దుర్వాసులే రాకపోతే అంబరీషుని భక్తి ప్రపత్తులు, భగవంతుని భక్త రక్షణ పరాయణత్వం లోకానికి ఎలా తెలిసేవి? తాను అపఖ్యాతి పాలైనా యోగ్యుల ప్రఖ్యాతికి పాటుపడే విఖ్యాతుడు దుర్వాసుడు!
దయ, కృప, కరుణ, అనుకంప, అనుగ్రహం- ఈ పదాలు దాదాపు సమానార్థకాలు. అయినా.. దయ, కృప- ఈ రెంటికీ కించిత్- కొంత భేదం. దయ సార్వజనీనం. ‘దయా సర్వభూతేషు’- సర్వభూత దయ మానవ మాత్రుని ధర్మం. దయలో భేద బుద్ధి- పక్షపాతం ఉండదు. దయ సామాన్య ధర్మం. కృప విశేష ధర్మం! దయ గల హృదయం దేవుని నిలయం. దయ సర్వ జీవుల పట్ల ఆర్ద్రమవుతుంది- మెత్తబడుతుంది. కాని, కొందరి పట్ల ద్రవిస్తుంది- కరిగిపోతుంది! సిద్ధాంత రీత్యా సామాన్య ధర్మం కంటే విశేష ధర్మం బలవత్తరం. దయ కన్నా కృప అధిక శక్తిమంతం. భక్తుని ఆర్తిని అనుసరించి భగవంతుని ఆర్ద్రత! ఈ ఉపాఖ్యానంలో భగవంతుడు, దుర్వాస అంబరీషులు- ఇద్దరి పట్ల దయ సమంగా చూపినా కృపావృష్టి మాత్రం అంబరీషునిపైనే కురిపించాడు. ఆయన ఆత్మరక్షణకై యత్నం చేసి ఉండినట్లయితే సుదర్శన చక్రం మధ్యలో కల్పించుకునేది కాదు. కాని, భూ భర్త భగవంతునిపై భారం వేయబట్టి చక్రం బాధ్యత వహించింది. కాన, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య- ఏదో ఒక భావంతో భగవంతునితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే కృపా పాత్రులం కాగలం! సుదర్శన ప్రభావంతో దుర్వాసుడు సద్వాసుడయ్యాడు- దుర్వాసనుడు (అశుభ సంస్కారి) సద్వాసను (శుభ సంస్కారి)డయ్యాడని పరమార్థం! ఎన్నగా ‘దేవుని కన్నా దాసుడే మిన్న’ అన్న భక్తి సిద్ధాంత నిరూపణే ఇందున్న విశేషం!!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006