అహ్మదాబాద్ : గుజరాత్లోని ఖేడా జిల్లాలో దారుణం జరిగింది. తన కూతరు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ప్రశ్నించినందుకు గానూ జవాన్ను అతి కిరాతకంగా చంపేశారు. జవాన్ భార్య, కుమారుడిపై కూడా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు.
వివరాల్లోకి వెళ్తే.. బీఎస్ఎఫ్ జవాన్ మేలాజీ వాఘేలా(42) తన ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఇటీవలే ఇంటికి వచ్చాడు. అయితే తన కూతురు(మైనర్)ను అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జవాన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఆ వీడియోలను వైరల్ చేసిన దినేష్ జాదవ్ ఇంటికి వెళ్లాడు. వీడియోలను ఎందుకు వైరల్ చేస్తున్నారని, తక్షణమే తొలగించాలని జాదవ్ కుమారుడిని జవాన్ వాఘేలా హెచ్చరించాడు. ఈ క్రమంలో వాఘేలాపై జాదవ్ కుమారుడితో పాటు మరో ఆరుగురు కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో వాఘేలా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాఘేలా హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జవాన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు.