చాంద్రాయణగుట్ట : మీసేవా కేంద్రాల్లో తప్పులు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని బండ్లగూడ మండల తహశీల్దార్ షేక్ ఫర్హీన్ హెచ్చరించారు. బుధవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, ఇంజన్బౌలి, ఈదీబజార్, రియాసత్నగర్ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాలు, ఆన్లైస్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా సర్కార్ పథకాల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ధరఖాస్తుదారుల పేరుతో ఉన్న ఫైల్స్లో ఏమైనా అవకతకవలు జరుగుతున్నాయా.. మోసాలు చేస్తున్నారా అనే కోణంలో తనిఖీలను చేపట్టారు.
ఈ తనిఖీల్లో బండ్లగూడ ప్రాంతంలో గల బిస్మీల్లా ఆన్లైన్ సర్వీస్ పేరుతో కొనసాగుతున్న సెంటర్లో అనధికరికంగా షాదీ ముబారక్ , కల్యాణలక్ష్మీకి సంబంధించిన ఫైల్స్, ఒరిజినల్ ఫోటోలు లభ్యమైయ్యాయి. దీంతో అక్కడే పోలీసులను పిలిపించి ధరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దుకాణాన్ని మూసివేయించారు. అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామన్నారు.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏమైనా పనులు ఉంటే నేరుగా మండల కార్యాలయంలో అడిగి తెలుసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. తప్పు చేశారని తెలిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో వీఆర్వో చంద్రయ్య, కృష్ణగౌడ్, ఉషన్న, విజయ్, అజహార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.