Kanjhawala death case | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా అంజలి స్నేహితురాలైన నిధిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రమాద సమయంలో అంజలితోపాటు స్కూటీపై నిధి కూడా ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నిధి.. అంజలిపై పలు ఆరోపణలు చేసింది. మద్యం సేవించిన అంజలి స్కూటీ నడుపుతానని తనతో గొడవపడినట్లు చెప్పింది. మద్యం మత్తులో స్కూటీని స్పీడ్గా డ్రైవ్ చేసి కారును ఢీకొట్టినట్లు ఆరోపించింది. కారు కింద అంజలి చిక్కుకున్న విషయం తెలిసినప్పటికీ అందులోని వ్యక్తులు ఈడ్చుకెళ్లారని నిధి తెలిపింది. అయితే నిధి ఆరోపణలను అంజలి తల్లి ఖండించింది. నిధికి మద్యం అలవాటు లేదని.. నిధి అబద్ధం చెబుతోందని తెలిపింది. అంజలి మృతి కుట్రలో నిధి భాగమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు విచారణలో భాంగా నిధిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.