లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. పూజ మండపం వద్ద ఉన్న ఒక వ్యక్తిపై కాల్పలు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించగా, ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు గాయపడ్డారు. తొలుత వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్నో ఆసుపత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన నలుగురిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే చెప్పారు. దుర్గా పూజ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాలను ఆయన ఖండించారు. వ్యక్తిగత వివాదం వల్ల ఈ ఘటన జరిగిందని, కారణం ఏమిటన్నది తెలుసుకుంటున్నామని వివరించారు.