న్యూఢిల్లీ : సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నీలోత్పల్ మృణాల్ (37)పై లైంగిక దాడి కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని 32 ఏండ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలోని తిమార్పూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యూపీలోని గోరఖ్పూర్కు చెందిన మహిళ యూపీఎస్సీకి సన్నద్ధమవుతూ ఢిల్లీలో నివసిస్తోంది. నీలోత్పల్ మృణాల్తో మహిళకు 2013లో పరిచయం కాగా అప్పటినుంచి ఇద్దరూ స్నేహితులుగా మారారు.
పెండ్లి పేరుతో ఆమెకు దగ్గరైన నిందితుడు ఇటీవల ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్ 6న మహిళ ఫిర్యాదుపై ఉత్తర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత ఆమెను నిందితుడు తీవ్రంగా కొ్ట్టడంతో పాటు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరుసటి రోజు క్షమాపణలు చెప్పిన నిందితుడు ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై పెండ్లి ప్రస్తావన తీసుకువస్తే దూరం పెట్టడం మొదలుపెట్టాడు. నిందితుడు ఫోన్ను పరిశీలించగా అతడికి ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్టు బాధితురాలు గుర్తించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.