ముంబై: ఒక జంటను కొట్టి, వారి వద్ద ఉన్న బంగారం, డబ్బు, మొబైల్స్ను ముగ్గురు వ్యక్తులు దోచుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ సంస్థలో పని చేసే 34 ఏండ్ల వ్యక్తి, సహోద్యోగి అయిన 32 ఏండ్ల మహిళ కలిసి శుక్రవారం సాయంత్రం వాకింగ్ కోసం పాషన్ సుస్ రోడ్లోని కొండపైకి వెళ్లారు. కాగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరిపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఆ వ్యక్తి, మహిళ నుంచి లక్ష విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్, నగదును దోచుకుని పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పూణే జిల్లా చకన్ సమీపంలోని ధామనే గ్రామంలో కూడా ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను బెదిరించి గోల్డ్ చైన్, చెవి రింగులు దోచుకున్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.